Sunday, March 6, 2022

దశరథుడిని కలిసిన జనకుడి దూతలు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-98 : వనం జ్వాలా నరసింహారావు

 దశరథుడిని కలిసిన జనకుడి దూతలు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-98

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-03-2022)

         జనక మహారాజు పంపిన దూతలు, అతివేగంగా గుర్రాలను పరిగెత్తించి, త్వరగా ప్రయాణం ముగించుకొని, మూడు రాత్రిళ్లు దారిలో గడిపి, నాలుగోరోజు పగలు అయోధ్యకు చేరుకున్నారు. రాజద్వారం దగ్గర కాపలా వున్న ద్వారపాలకులతో, తాము జనక మహారాజు దూతలమని-ఆయన పనుపున వచ్చామని-ద్వారం వద్ద వేచి వున్నామని, దశరథ మహారాజుకు తెలియచేయమని కోరారు. రాజుకు తెలియచేసి వచ్చిన ద్వారపాలకులు, జనకుడి దూతలొచ్చారని చెప్పగానే, త్వరగా పిలుచుకొని రమ్మని తమ రాజు చెప్పారనీ, ఆలస్యం చేయకుండా రమ్మనీ అంటారు. వారు లోపటికిపోయి, ముదుసలి-దేవతలతో సమానుడైన దశరథుడిని కలిసారు. రాజుకు నమస్కరించి, విన సొంపైన మృదువైన మాటలతో, మొదలు, తమ రాజు అడిగినట్టుగా క్షేమ సమాచారాలు అడిగారు. జనక మహారాజు, పురోహితులతో-మంత్రులతో-అగ్నులతో కూడిన దశరథ మహారాజు క్షేమం గురించి అడిగాడని చెప్పి, ఇంకొక వార్తకూడా వుందని, విశ్వామిత్రుడి ఆజ్ఞ పొంది తమ రాజిట్లా మనవి చేయమన్నాడని, ఆయన మాటలుగా ఇలా చెప్పారు.

         "రాజేంద్రా, వినుము. నా కూతురు సీత, వీర్యశుల్కని నేను ప్రతిజ్ఞ చేసాను. ఆ చంద్రముఖిని వరించాలని ఎందరో వచ్చి బీరములేనివారై-వ్యర్థాశులై పోయారు. విశ్వామిత్రుడి వెంట నీ కుమారులు, నా అదృష్టం కొద్దీ ఆకస్మికంగా వచ్చి, రాజులందరి సమక్షంలో-నిండు సభలో, అందరుచూస్తుండగా శివుడు ధనస్సును రామచంద్రమూర్తి రెండుగా విరిచాడు. నా పుత్రికను గెలిచాడలా. కాబట్టి ఆ మహాబలశాలికి నా సీతనిచ్చి వివాహం చేసి, నా కూతురు వీర్యశుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోదలిచాను. నా కోరిక తీర్చుకొనేటట్లు ఆజ్ఞ ఇవ్వమని అడుగుతున్నాను. రాజేంద్రా మీరిక్కడకొచ్చి మీ కొడుకులను-కోడళ్లను చూడొచ్చు. వివాహం చూసి సంతోషించవచ్చు. నా కోరికా నెరవేరినట్లవుతుంది. కాబట్టి, మంత్రులతో-పురోహితులతో-హితులతో వచ్చి పుత్రులను చూడండి". ఇలా తమ రాజు చెప్పినట్లు చెప్పి, రాజుల వద్ద ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం సమంజసం కాదని వూరుకున్నారు.

దశరథ మహారాజు వెంటనే వామదేవ-వశిష్ఠాదులను,మంత్రులనుపిలిపించి సంతోషం ఉప్పొంగి పోతుంటే, వారితో ఇలా అంటాడు. "విశ్వామిత్రుడిరక్షణలో కౌసల్యా కుమారుడు - మన రామచంద్రమూర్తి, లక్ష్మణుడితో కలిసి జనకుడి రాజధానైన మిథిలా నగరంలో వున్నాడట. మన శ్రీరామచంద్రుడి బల పరాక్రమం చూసి-మెచ్చిన జనకుడు, తనకూతురునిచ్చి వివాహం చేయనున్నాడట. జనకుడు తలపెట్టిన కార్యం మీకు సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై పోదాం" అనగా మంత్రులందరు ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనని అన్నారు. వారి మాటలకు దశరథుడు సంతోషించి, ఉదయమే ప్రయాణమై పోవాలి కనుక, సర్వం సిద్ధం చేయమని మంత్రులను ఆదేశించి, శుభవార్త మోసుకొచ్చిన జనకుడు దూతలకు బహుమానాలిచ్చాడు. వారుకూడా ఆ రాత్రి అక్కడే బస చేసారు.

దశరథుడిని కుశల ప్రశ్నలు వేసిన జనకుడు

         ఉదయం కాగానే దశరథుడు, రాజసభలో, బంధువులు మౌనులు కొలుస్తుండగా మంత్రి సుమంత్రుడిని పిలుస్తాడు. రాజబొక్కసాన్ని పర్యవేక్షించే అధికారులు విశేష ధనాన్ని తీసుకొని తక్షణమే మిథిలకు బయలుదేరాలనీ, వారివెంట చతురంగ బలాలు కూడా ప్రయాణమవ్వాలని, తక్షణం పల్లకిని కూడా సిద్ధంచేయాలనీ, వాసుదేవుడు-వశిష్ఠుడు-జాబాలి-కాశ్యపుడు-దీర్ఘాయువైన మార్కండేయుడు-కాత్యాయనుడు ముందుగా వెళ్లాలి కనుక వారికొక ప్రత్యేకమైన రథాన్ని ఏర్పాటుచేయాలనీ, సుమంత్రుడితో అంటూ దశరథుడు అందరినీ ప్రయాణానికి త్వరపెట్టాడు. ఇలా రాజేంద్రుడైన దశరథుడు, మునిరాజులగుంపు తనను కొలుస్తూ-తన వెంట వస్తుంటే, సేనా సమూహాలతో కూడిన ఇంద్రుడివలె, మిక్కిలి సంతోషంగా ఐదవ రోజు పగటిపూటకల్లా విదేహనగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు, మిక్కిలి సంతుష్టిగల మనస్సుతో దశరథుడి వద్ద కొచ్చి, ముసలి రాజును పూజించి ఇలా అంటాడు:

         "రాజసత్తమా, నీకు స్వాగతం. నా భాగ్యం ఫలించినందునే నా పట్టణానికి వచ్చావు. నీ కొడుకుల శౌర్యంవల్ల కలిగిన సంతోషాన్ని మనసార అనుభవించు. దశరథరాజ చంద్రా, నా అదృష్టంవల్ల నిన్ను ఈ రోజు దర్శించుకొనే పుణ్యం కలిగింది. నా భాగ్యంవల్ల బ్రాహ్మణులతో కలిసి వచ్చిన వశిశ్ఠుడిని చూడగలిగాను. నా పుణ్య పరిపాకంవల్ల విఘ్న సమూహాలన్నీ నాశనమై పోయాయి. నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్య మాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల మా వంశం అతి పూజ్యమైంది. నీ దయవల్ల నా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. రేపు ప్రాతః కాలం యజ్ఞం అయింతర్వాత, శాస్త్ర సమ్మతమైన రీతిలో,  పరమర్షులకి ఇష్టమైన విధంగా పరిణయం చేయండి". సమాధానంగా సంతోషంతో దశరథుడు ఇలా చెప్పాడు:

"దానం దాత వశమని పూర్వం పెద్దలంటుంటే విన్నాను. దాతవు నీవే. నువ్వెలా చెపుతే అలాగే ప్రవర్తిస్తాను. నీకు నేను కొత్తవాడినికాదుకదా?". దశరథుడు గొప్ప రాజైనందున, ఎంత రాజసంగా మాట్లాడుతాడోనని తలచిన జనకుడు, వినయంగా ఆయనిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోయాడు. దశరథుడి వెంట వచ్చిన ముని సమూహమంతా అక్కడే సుఖంగా వున్నారు. దశరథుడు తన కొడుకులను చూసి, సంతోషంగా వారితో ముచ్చటలాడుకుంటూ గడిపాడు. జనకుడు యజ్ఞం పూర్తిచేసి కూతురిని పెళ్లికూతురుగా తయారుచేశాడు.

 

No comments:

Post a Comment