Thursday, March 31, 2022

ముందుగా మేల్కొంటే విజయం తథ్యమే! ..... వనం జ్వాలా నరసింహారావు

 ముందుగా మేల్కొంటే విజయం తథ్యమే!

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (01-04-2022)

ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన దృష్టిలో తనకు, టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక క్రీడ కానేకాదని, అదొక విద్యుక్త ధర్మమని (Politics is not a game but a task) వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన మాటలను లోతుగా విశ్లేషించి అర్థం చేసుకుంటే అనేక భావాలు గోచరిస్తాయి. వర్తమాన రాజకీయ పరిస్థితులకు అన్వయించుకుంటే అర్థవంతంగా వుంటుంది.

         భారతీయ ఎన్నికల విధానంలో, ప్రస్తుతం క్షణ క్షణానికి మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఓట్లను సంపాదించుకోవడం ఒక వికృత క్రీడలాగా పరిగణించకూడదు. ఎన్నికైన, కాదల్చుకున్న రాజకీయ నాయకులు ప్రజలకు, వారి సంక్షేమానికి తాము చేస్తున్న మంచి పనుల ద్వారా ఒక విద్యుక్త ధర్మం లాగా ఓట్లను పొందాలి. రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం పాటుపడుతూ తద్వారా ఓటర్లను ఆకట్టుకుని, ప్రజల మద్దతు పొందడమే గెలుపునకు ప్రధాన మంత్రం.

         2014 తర్వాత, మోడీ నేతృత్వంలోని బిజెపి అజేయం అన్నట్లుగా కొందరి భావన. ఆ భావన కారణాన పలువురు బీజెపీయేతర రాజకీయ ప్రత్యర్థులు, వివిధ పార్టీల నాయకులు కొంత మేరకు అయోమయంలో పడిపోయారు. అది సహజం. అయితే 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో మోడీ నేతృత్వంలోని బిజెపిని ఓడించాలంటే కష్టం కావచ్చేమో కాని అసాధ్యం మాత్రం కాదు. కాకపోతే దాన్నొక టాస్క్ లాగా తీసుకోవాలి. ఈ కర్తవ్యాన్ని జయప్రదంగా సాధించడానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉన్నది. అదే సమయంలో వారు ఒక గొప్ప వ్యూహాన్ని కూడా రూపొందించాలి. ఆ వ్యూహాన్ని చివరి అక్షరం వరకు మనసా వాచా త్రికరణశుద్ధిగా, ఒక స్ఫూర్తితో అమలు చేయాలి. 

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ  పంజాబును కైవసం చేసుకున్న దాన్ని విశ్లేషించి చూస్తే, దేశంలో ఎన్నికల వ్యూహంలో గణనీయమైన మార్పులు వచ్చాయని స్పష్టంగా అవగతమవుతున్నది.  అయితే, ఈ విషయాన్ని చాలా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోయాయి. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన బీఎస్పీ, ఎస్పీలతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోవడానికి  కారణం ఇదే. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ప్రాంతీయ పార్టీల సమర్థతను చాటిచెప్తున్నాయి.

         70వ దశకం ప్రారంభంలో, 1975 జూన్ లో దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు, అన్ని రాజకీయ పార్టీలు,  ఒకే గొడుగు కిందకు వచ్చాయి. వామపక్షాలతో సహా అన్నిరకాల మితవాద భావజాలం వున్న  రాజకీయ పార్టీల కన్సార్టియం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతా పార్టీగా ఆవిర్భవించి విజయవంతంగా ఎన్నికలను గెలిచింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే అంతర్గత కుమ్ములాటల కారణంగా జనతాపార్టీ అధికారాన్ని కోల్పోవడం, మరోసారి ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం అనే విషయం తదనంతర చరిత్ర. జనతా పార్టీ ఆవిర్భవించిన రోజుల్లో, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరు? అనే ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీవారు మాత్రం అప్పుడు ఇందిరా గాంధీని ఎవరు ఎదుర్కోగలరు అన్న ప్రశ్న ప్రజల ముందుకు పదేపదే తీసుకొచ్చింది. అలాగే, ఇప్పుడు కూడా బిజెపి దాని మద్దతుదారులు అదే ప్రశ్న అడుగుతున్నారు. మోడీని ఎవరు ఎదుర్కోగలరు? అని.

అప్పట్లో ముఖ్యంగా ఉత్తరాదిలో కాంగ్రెస్ ను ఓడించడం అనే విషయం ప్రజలలో వచ్చిన బలమైన మార్పుకు సంకేతం. జనతాపార్టీలో ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న అనేక మంది ప్రముఖులు వున్నప్పటికీ, ఎనబై సంవత్సరాల వయసున్న మొరార్జీ దేశాయ్ ప్రధాని అవుతారని ఎవరూ అనుకోలేదు. పైగా, జయప్రకాష్ నారాయణ్ లాంటి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, అప్పటికి శక్తివంతురాలైన ఇందిరా గాంధీని ఎదిరించి నిలబడతాడని కూడా ఎవరూ ఊహించలేదు. అవసరమైతే పోరాడటానికి వయస్సు సమస్య కానేకాదని ఇది రుజువు చేస్తుంది.

కేంద్రంలోని జనతా పార్టీ ప్రభుత్వం విఫలమై ఉండవచ్చు, కానీ జనతా పార్టీ ప్రయోగం దేశ రాజకీయ ఎజెండాలో కొత్త దృశ్యాలను ఆవిష్కరించింది.  ఈ ప్రయోగమే నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ అలయన్స్ (UPA I, II), నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA I, II) తదితర ఫ్రంట్ల శ్రేణికి నాయకత్వం వహించిందనవచ్చు.  

ఈసారి ప్రయోగం ఫ్రంట్ కాకపోవచ్చు. మరేదైనా కావచ్చు. అన్ని రకాల సారూప్య రాజకీయ పార్టీల కన్సార్టియం కావచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని రాజకీయం పెనుమార్పులకు గురైంది. ఒకప్పుడు ప్రమాదంగా భావించబడిన హిందుత్వమే నేడు ప్రధాన ఎజెండాగా మారింది. బిజెపి, దాని మితవాద అనుబంధ సంస్థలు ప్రజల మనస్సుల్లోకి హిందూత్వ వాదాన్ని ప్రభావవంతంగా ఎక్కించగలిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల శైలి పరిశీలిస్తే, మూడు రాష్ట్రాలలో బిజెపి హిందుత్వం బాగా పని చేసిందని, యుపిలో సమాజ్ వాదీ పార్టీ ప్రభావాన్ని తగ్గించగలిగిందని స్పష్టమైంది.

         అందువల్ల, ఇక్కడ సందేశం చాలా స్పష్టంగా ఉంది, తదుపరి సార్వత్రిక ఎన్నికలలో మోడీ నేతృత్వంలోని బిజెపి బలాన్ని సొంతంగా ఏ జాతీయ రాజకీయ పార్టీ తగ్గించలేక పోవచ్చు. కానీ, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రతిపాదించిన కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల కన్సార్షియం కచ్చితంగా బీజేపీ విజయానికి అడ్డుకట్ట వేయగలదు.

కొంత కాలంగా ఇదే ఆలోచనలో ఉన్న కేసీఆర్ ఈ విషయంలో తొలి అడుగులు వేశారు. చాలావరకు అందులో సఫలీకృతులవుతున్నారు కూడా. అయితే, ఈ కన్సార్షియం కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి? తమలో ప్రధానమంత్రి ఎవరు కావాలనే విషయాలను చర్చించడం ప్రస్తుతానికి అప్రస్తుతం అనొచ్చు. ఇదే విషయాన్ని 2018 నుంచీ కేసీఆర్ ఉద్ఘాటిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే సమస్యే లేదు. అయితే రాజకీయంగా ఎంపిక చేయాల్సిన అవసరం, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

బిజెపి హిందుత్వానికి వ్యతిరేకంగా ఈ కన్సార్షియం, లౌకికవాదం, ప్రజా సంక్షేమం అనే లక్ష్యాలను తీసుకోవాలి. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఉటంకించాలి. ప్రజా సమస్యలకు పరిష్కారాలు కూడా చూపాలి. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఈ అంశంలో విఫలమైంది. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో తెలిసినా కూడా, పరిష్కారానికి నోచుకోకుండా పోయినా ఎస్పీ మాత్రం ఆ సమస్యలను సరిగా ఎత్తిచూపలేకపోయింది. కానీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అక్కడి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపగలిగింది. ఆ సమస్యలకు కేజ్రీవాల్ మోడల్ పాలనలో పరిష్కారాలను కూడా చూపించింది. దీంతో అక్కడ విజయం సాధించింది.

         కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా కన్సార్షియంకు ఆస్కారం లేదన్న వాదన సరైంది కాదు. బీజేపీకి వ్యతిరేకంగా క్రియాశీల పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందనే విషయాన్ని గుర్తించాలి. నేడు దేశంలో బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది కూడా ప్రాంతీయ పార్టీలేనన్న విషయాన్ని గుర్తెరగాలి. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో రూపుదిద్దుకోనున్న కన్సార్షియంలో, కాంగ్రెస్ పార్టీ కూడా జూనియర్ భాగస్వామిగా చేరాలనుకుంటే, దాన్ని అన్నిపార్టీలూ స్వాగతించాలి. కాంగ్రెస్ నాయకత్వంలోనే కన్సార్షియం  వుండాల్సిన అవసరంలేదు.

సరిగ్గా కేసీఆర్ చెప్పినట్లుగా ఎన్నికలను ఒక ఆటలాగా కాకుండా, ఒక టాస్క్ లాగా, తాము తప్పక నెరవేర్చాల్సిన విద్యుక్త ధర్మంలాగా చూడాలి. 2024 ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను నేటి నుంచే ఒక టాస్క్ గా  తీసుకోవాలి. తెలంగాణలో కోట్లాది మందికి లబ్ది చేకూర్చేలా విజయవంతంగా అమలు చేస్తున్న  పథకాలను, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా, ప్రజల అవసరాలను గుర్తెరిగి అమలు చేస్తున్న వినూత్న పథకాలను దేశ ప్రజలందరికీ తెలియచేసి ప్రచారం చేయాలి. తెలంగాణ నమూనాను అంతటా హైలైట్ చేయాలి. జాతీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులను దేశ ప్రజలకు అర్ధం చేయిస్తూ, ఆకట్టుకోవాలి. కాంగ్రెస్, బిజెపియేతర పార్టీల కన్సార్షియం ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

నేడు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా మాత్రమే ప్రజలకు పనులు చేసి, ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయి. కానీ, ఈ వ్యూహం యూపీలో సమాజ్ వాదీ పార్టీకి, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పనిచేయలేదు. దీన్నిబట్టి చూస్తే, ఎన్నికలకు ముందు పనిచేయాలని కాకుండా, చాలాముందు నుంచే ప్రజల్లో ఉండటం ఎంతో ముఖ్యమని గుర్తించాలి. దేశంలోని కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు కలిసి ఈ పనిని వెంటనే ప్రారంభించి, బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా గళమెత్తితే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం పూర్తిగా సాధ్యమే. కన్సార్షియం ఈ పనిని ఎంత త్వరగా, ఎంత బలీయంగా తీసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి.

దేశంలో మంచి మార్పు కోసం ప్రజల నుండి డిమాండ్ వస్తున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ సరిగ్గా ఈ విషయాన్నే ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో నుంచే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నూతన నాయకత్వం ఆవిర్భవిస్తుందని, అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

No comments:

Post a Comment