Wednesday, March 30, 2022

బడ్జెట్ పై చర్చించటమైనా మనకు వచ్చా? : వనం జ్వాలా నరసింహారావు

 బడ్జెట్ పై చర్చించటమైనా మనకు వచ్చా?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (31-03-2022)

ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో రాష్ట్ర శాసన సభలలో, శాసన మండలిలో, పార్లమెంట్  ఉభయ సభలలో చోటు చేసుకోవాల్సిన చర్చల సరళి కూడా అదే మోతాదులో పరిణతి చెందాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇటీవలి కాలంలో ఈ సభలకు మంచి భవిష్యత్ వున్న విద్యావంతులు, యువతీ యువకులు, ఉజ్వల భవిష్యత్ వున్న వ్యక్తులు ఎన్నికవుతున్నారు. వీరి ద్వారానే భవిష్యత్ లో రాష్ట్రాలకు, దేశానికి యువనాయకత్వం రానున్నది. అనేక దేశాలలో ప్రజాస్వామ్యం బలపడి పరిణతి చెందుతున్న కొద్దీ చట్టసభల చర్చల సరళిలో సమకాలీన సామాజిక ధోరణులు ప్రతిబింబించే విధంగా అనేక రకాల చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇలా చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా వుంటాయి. ఆ విధంగా చాలా దేశాలు ముందుకు పురోగమిస్తున్నాయి. మన దేశంలో కొన్ని అలవాట్లు వచ్చేశాయి. వాటిల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా అవున్నది.

దురదృష్టవశాత్తూ బడ్జెట్ అనగానే, అదేదో బ్రహ్మ పదార్ధం అయినట్లు, అంకెలు చెప్పడానికే పరిమితమైనట్లు ఒక అభిప్రాయం మన దేశంలో ప్రబలి పోయింది. అన్ని స్థాయిలలోనూ అదే దిశగా చర్చ జరగడం తెలిసిన విషయమే. సహజంగా జరిగేది, ఆర్ధిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్తారు. అధికార పార్టీ సభ్యులు దాన్ని ఆహా- ఓహో అని పొగడడం, ప్రతిపక్ష సభ్యులు పనికిమాలిన బడ్జెట్ అని విమర్శించడం ఆనవాయితీ. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ ఇదే ధోరణి. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో వున్నప్పుడు బాగుంది అనడం, అధికారంలో లేనప్పుడు సప్పగా వుంది అనడం కూడా మామూలే!

బడ్జెట్ అనేది నిధుల కూర్పు. ఈ కూర్పు ఎలా వుండాలి అనే విషయం మీద, రాష్ట్రాలకు కానీ, దేశానికి కానీ ఎలా ఉపయోగ పడాలి అనే విషయం మీదా సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది. నిధుల కూర్పులో అప్పులు కూడా ఒక భాగమే. గత శతాబ్ది అరవయ్యవ దశకం తరువాత కాలంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కొంత పుంతలు తొక్కుతున్నది. తదనుగుణంగానే మన భారత దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా కొత్త పుంతలు తొక్కుతూ వున్నది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేవలం 190 కోట్ల రూపాయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  బడ్జెట్ కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారి హాయంలో కేవలం 680 కోట్ల రూపాయలే. ఇప్పుడేమో లక్షల కోట్ల రూపాయలలో మాట్లాడుకుంటున్నాం.

ప్రజాస్వామ్య దేశంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రణాలికా విభాగం. ప్రభుత్వ బడ్జెట్ కు, ప్రయివేట్ బడ్జెట్ కు చాలా స్పష్టమైన తేడా వుంటుంది. ప్రభుత్వ బడ్జెట్ కు మొదలు ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ఏఏ రంగం మీద ఎంత వ్యయం చేయాలి, అవసరాలు ఎలావున్నాయి లాంటి విషయాల మీదా కూలంకషంగా చర్చించి ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పన్నులు వేసే అధికారం వుంటుంది. ఆ పన్నులు ఎక్కువ వేశారా, తక్కువ వేశారా అనేది తేలేది ప్రజాకోర్టులలోనే-అంటే ఎన్నికలలో. ప్రజాస్వామ్యంలో వున్న గొప్పదనమే అది. నిధుల కూర్పులో భాగంగా రాష్ట్రానికి వచ్చే పన్నులు, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా, ఆర్ధిక సంఘం ఇచ్చే గ్రాంట్స్, పన్నేతర రెవెన్యూ, మార్కెట్ బారోయింగ్స్ వుంటాయి. ఇవన్నీ కలిపిన సమాహారమే బడ్జెట్.

ఇలాంటి నిధుల కూర్పులో రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన హాండ్ బుక్ లెక్కల ప్రకారం అనేక విషయాలలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతాలు సాధిస్తున్నదని స్పష్టమవుతున్నది. ఇక తెలంగాణ రాష్ట్రం చేస్తున్నదన్న అప్పుల విషయానికొస్తే, ప్రస్తుతం వున్న విజ్డం ఆఫ్ ఎకానమీ ప్రకారమైనా, ఎకనామిక్ డైనమిక్స్ ప్రకారమైనా అలాంటి అప్పులు వాస్తవానికి అప్పుగా పరిగణించ కూడదు. దానిని వనరుల సమీకరణ కింద పరిగణించాలి. వనరులు అనేవి రకరకాల పద్ధతులలో వస్తాయి. పన్నుల ద్వారా, పన్నేతర రెవెన్యూ ద్వారా, మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, తదితర వనరుల సేకరణ ద్వారా వస్తాయి. వీటన్నిటి విషయంలో తెలంగాణ రాష్ట్రం బ్రహ్మండమైన, కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తున్నది. అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం జరిగింది. గతలోఎన్నడో లేనటువంటి పారదర్శకతను ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఉదాహరణకు రైతుబంధు కింద ఇచ్చిన ఏబై వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులు పూర్తి పారదర్శకతతో జరిగింది. ఇలాంటి అనేక సంస్కారవంతమైన ఆర్ధిక క్రమశిక్షణ కఠినంగా పాటించడం మూలాన తెలంగాణలో ప్రగతి సాధ్యమైంది.

ఇక అప్పుల విషయానికి వస్తే, దేశంలోని 28 రాష్ట్రాలలో అప్పులు చేసే క్రమంలో తెలంగాణాది 25వ స్థానం. అంటే, తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు దేశంలో 24 వున్నాయి. దీనర్థం తెలంగాణ తక్కువ అప్పులు చేస్తున్నదని అర్థం. అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రమాదం ఏమీలేదు.

బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు ఒక విషయం మీద తప్పక చర్చ జరగాలి. ఆ స్థాయి రాష్ట శాసనసభకు రావాలి. భారతదేశంలో వున్నటువంటి విధానం ప్రకారం విత్తవిధానం కానీ, ఆర్థికపరమైన అంశాల మీద నియంత్రణ కానీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే వున్నది. దేశం విత్త విధానాన్ని నిర్ణయించేది, నిర్వహించేది, నియంత్రించేది కేంద్ర ప్రభుత్వమే. ఏ రాష్ట్ర ఆర్ధిక విధానమైనా దీనికి లోబడి ఉండాల్సిందే. కేంద్రప్రభుత్వ అడుగుజాడలలో ముందుకు పోవాల్సిందే. కొద్దిమేరకే స్వేచ్చ వుంటుంది. కేంద్రం వ్యవహారం గొప్పగా వుంటే దేశం అంతా గొప్పగా వుంటుంది. ఆ పరిస్థితులను కూడా రాష్ట్రాల శాసనసభలు సమీక్ష చేయాలి. తదనుగుణంగా చర్చ జరగాలి. ఆ పరిణతిని రాష్ట్ర శాసనసభలు సమీక్ష చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అకాడమిక్ విషయం. దీన్ని గురించి ఒక సమగ్రమైన విశ్లేషణ జరగాలి.

ఉదాహరణకు రాష్ట్రాల మార్కెట్ బారోయింగ్స్ వ్యవహారం తీసుకుందాం. దీనికి సంబంధించి ఒక చట్టం వున్నది. దాన్నే ఎఫార్బీఎం (FRBM) లేదా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మానేజ్మెంట్ అంటారు. దేశానికి పెద్దగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, అదీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఈ దేశాన్ని సరైన రీతిలో నడపడం లేదు. ఇప్పుడు పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానంలో కొన్ని విచిత్రమైన ధోరణులు కనిపిస్తున్నాయి. క్రమశిక్షణ అనేది అంతటా పాటించాలి. అది ఎవరూ కాదనరు. ఆంక్షలున్నా, పద్ధతులున్నా, మొత్తం దేశం పరిస్థితిని దృష్టిలో వుంచుకోవాలి. అది కనబడటం లేదు. ఇప్పుడు అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం పాలసీ, బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు వుండాలనేది. ఇది ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే, అనారోగ్యమైన, అప్రజాస్వామిక చర్య. భవిష్యత్ లో దేశంలో అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ పెడధోరణి ఆశించతగింది కాదు.

భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అనే విషయం రాజ్యాంగం మొట్టమొదటి పేజీలోనే వున్నది. ఇది రాజ్యాంగం చెప్పిన మాట. కాబట్టి రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణచి పెడుతాం అనే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యలు సమంజసం కాదు. మరొక్క విషయం దృష్టిలో వుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ రాష్ట్రంతో పోల్చి చూస్తే ఏమంత బాగాలేదు. రాష్ట్రం కంటే చాలా దిగజారి పోయింది. అందులో ఏమాత్రం అనుమానంలేదు. గణాంకాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఇందులో దాచిపెట్టడానికి ఏమీలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన ఆర్ధిక గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం పనితీరుకు, కేంద్రం పనితీరుకు చాలా తేడా వున్నది. తలసరి ఆదాయం చూసినా, జీడీపీ చూసినా, ఇంకా ఏవిధంగా చూసినా కేంద్రం చాలా వెనుకబడి వున్నది.

రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేసిన లెక్కల ప్రకారం జీడీపీలో కేంద్ర ప్రభుత్వ అప్పుల శాతం 58.5. అంటే కేంద్ర ప్రభుత్వం 58.5 మేరకు అప్పులు తీసుకున్నది. ఈ రోజు భారదేశం చేసిన అప్పు రు 152 లక్షల కోట్లు. రాష్ట్రాలకు ఇచ్చేది మాత్రం 25 శాతం మాత్రమే. రాష్ట్రాలకు ఒక నీతి, కేంద్రానికి ఇంకొక నీతి వుంటుందా? కేంద్రం పైన ఇంకెవరూ వుండరు కాబట్టి, వాళ్లను అడిగేవారు ఎవరూ లేరు కాబట్టి, ఇష్టమొచ్చినట్లు నిధుల సమీకరణ చేస్తారు. రాష్ట్రాలను మాత్రం తొక్కి పెడతారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని చాలా భయంకరంగా దెబ్బతీస్తున్నది. అది తీసుకునే నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయా లేక సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయా అనే విషయాలు శాసనసభలో సమీక్ష చేయాల్సిన అవసరం వున్నది. ఇక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం అన్న భేదం లేకుండా ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా జరిగే విధానాలను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం వున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలు, ఈ విషయాన్ని క్షుణ్ణంగా చర్చించి ప్రమాదంలో వున్న సమాఖ్యస్ఫూర్తిని కాపాడాలి.

బడ్జెట్ అనేది ఒక పబ్లిక్ ఫండ్. ఇందులో రాజకీయాలకు తావులేదు. వాస్తవానికి రాజకీయాలనేవి వోట్లు, సీట్ల కంటే అతీతమైనవి. కేవలం ఓట్లు, సీట్లు లేక్కపెట్టుకోవడమే రాజకీయం కాదు. అంతవరకే పరిమితమైతే అది అరాచకమవుతుంది కాని రాజకీయం కాదు. దురదృష్టమేమిటంటే ఇటీవలి కాలంలో చాలా మంది పిగ్మీలు రాజకీయాలలో దూరిపోయి, అవగాహనాలేమితో, అసాధారణమైన పెడధోరణులతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భయంకరమైన విఘాతం తెచ్చే పనులు చేస్తున్నారు. మంచిగా వున్న ఈ దేశంలో విషబీజాలు నాటుతున్నారు. ఇది సరైనది కాది. తాత్కాలికంగా కొంతమందికి రాక్షసానందం కలిగించవచ్చు. కాని కాలం గడిచే కొద్దీ, ప్రపంచానికి మార్గదర్శకంగా వుంటూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నతువంటి భారత సమాజం ఔన్నత్యానికి దారుణంగా దెబ్బతీస్తుంది వీరి ధోరణి.

కేంద్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిపోవడానికి కరోనా కేవలం సాకు మాత్రమే. కరోన రాకముందే దేశ ఆర్ధిక అభివృద్ధి తిరోగమన దిశగా పయనించింది. తెలంగాణ సాధించిన తరహాలో కేంద్రం గ్రోత్ వుంటే బాగుండేది. ఏడు సంవత్సరాల కాలంలో దేశం జీడీపీ 124 లక్షల కోట్ల రూపాయల నుండి 236 లక్షల కోట్లకు పెరిగింది. అదే సమయంలో ప్రతిసంవత్సరం తెలంగాణ లక్షల కోట్ల సంపదను పెంచుకుంటూ పోయింది. భారతదేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 38.7 శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్ధిక విధానాల మూలంగా తెలంగాణకు సమకూరాల్సిన మరో మూడు లక్షల కోట్ల రూపాయల సంపద సమకూరకుండా పోయింది. ఇదిలా వుండగా 2025 సంవత్సరానికల్లా 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని భ్రమలు కలిగిస్తున్నది కేంద్రం. అదెప్పటికి నేరవేలాలో భగవంతుడికే తెలియాలి. ఇటీవల పార్లమెంటులో కేంద్రం వెలువరించిన లెక్కల ప్రకారం ప్రస్తుతానికి 3.1 ట్రిలియన్ డాలర్ ఎకానమీలోనే వున్నాం. భవిష్యత్తులో వాళ్లు చెప్పినట్లు చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం నిరంతరంగా 16 శాతం కనీస గ్రోత్ వుండాలి. కాని ప్రస్తుత గ్రోత్ 6 మాత్రమే. కేంద్రం ఎంత గొప్పగా వుంటే రాష్ట్రాలు అంత గొప్పగా వుంటాయి.

  కేంద్రప్రభుత్వం ఆర్ధిక అసమర్థత తెలంగాణ మీద ప్రభావం చూపుతున్నది. రాష్ట్రానికి బాగా నష్టం వస్తున్నది. రాజకీయాలు కూడా పెడధోరణి పడుతున్నాయి. ఎఫార్బీఎం విషయంలో ఆంక్షలు విధిస్తున్నారు. కేంద్రం ఎఫార్బీఎం 6.9 శాతం పెట్టుకుని రాష్ట్రానికి 4 శాతం ఇస్తామని అంటారు. అందులో కూడా పాయింట్ ఐదు శాతానికి ఆంక్షలు విధించారు. వారు ఇస్తామన్న 4 శాతం కూడా కరెక్ట్ గా ఇవ్వరు. జీడీపీ తగ్గింది. పరిశ్రమలు మూతబడ్డాయి. ఆత్మనిర్భర్ ఏమోకాని, దేశం ఆత్మనిబ్బరాన్ని కోల్పోయింది. మతపిచ్చి  పెరిగింది. ఆ మతపిచ్చి అనే కార్చిచ్చు ఈ దేశాన్ని దహించి వేస్తుంది. దేశంలో నెలకొన్న వాతావరణం, దశాబ్దాల తరబడి సాగిన కృషి కుప్పకూలుతున్నది. యువతకు ఉద్యోగ అవకాశాలు పోయాయి. ఇలా కొనసాగితే దారుణమైన పరిస్థితులు వస్తాయి.

బడ్జెట్ మీద చర్చ అర్థవంతంగా వుండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో వుంచుకోవాలి. కేంద్రప్రభుత్వ ఆర్ధిక విధానాలు రాష్ట్ర ఆర్ధిక విధానం మీద ప్రభావం చూపుతాయన్న విషయం మరచిపోకూడదు. కేవలం విమర్శించడం కోసమే విమర్శించడం సమంజసం కాదు.

(2022 ద్రవ్యవినియోగ బిల్లు మీద జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రసంగం ఆధారంగా) 

No comments:

Post a Comment