Wednesday, May 29, 2024

ప్రదానమంత్రులు - పాత్రికేయ సమావేశాలు : వనం జ్వాలా నరసింహారావు

 ప్రదానమంత్రులు - పాత్రికేయ సమావేశాలు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-05-2024)

{ఒకప్పుడున్న పద్ధతులు, విలువలు, నిబద్ధతలు, ఎల్లప్పుడూ వుండాలని లేదుగా? అందుకే జవహర్లాల్ నెహ్రూ తన పద్ధతిలో పత్రికా సమావేశాలు నిర్వహించడం ఏవిధంగా వంద శాతం సరైనదో, అలాగే నరేంద్ర మోదీ తనదైన పద్ధతిలో 'పత్రికలు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీలకు' విడివిడిగా తన ఇష్టమొచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా వందకు పైగా శాతం సరైనదేమో} – సంపాదకుడి సంక్షిప్త వ్యాఖ్య  

సాధారణ ఎన్నికలు ముగియబోతున్నాయి. ఎవరికివారే అధికారంలోకి వస్తామన్న బింకంతో ధీమాగా పైకి కనిపిస్తున్నారు. అంచనాలు తారుమారు కావచ్చని, నిజమూ కావచ్చని, అంతా ఓటర్ల దయని, వైరాగ్యంతో వున్న నాయకులూ లేకపోలేదు. గెలవడానికి అనుసరించిన అనేకానేక ‘వ్యూహాలలో పాత్రికేయులను మంచి చేసుకోవడం కూడా ప్రధానమైనదే. అలా మీడియాను, ఎన్నికలప్పుడు, ఎన్నికలు లేనప్పుడు మంచి చేసుకోవడానికి అధికార, ప్రతిపక్ష నాయకులు అవలంభించే దారులు విభిన్నంగా వుంటాయి.

చురుమురి’ అనే పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసిన ఆసక్తికర సమాచారాన్ని అనుసరించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతి 30 రోజుల్లో పత్రికలు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీలకు విడివిడిగా కనీసం 26 సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చారట. సార్వత్రక ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా ఉండే మీడియా కవరేజీ ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తున్నదనేది ఒక విశ్లేషణ. ఇలాంటి ఇంటర్వ్యూల పరంపర నెలరోజుల తరువాత కూడా అంతో ఇంతో మోతాదులో కొనసాగింది. వాస్తవానికి, 2019 సాధారణ ఎన్నిలప్పుడు సైతం ప్రధాని మోదీ అప్పట్లో తన ఇంటర్వ్యూల పరంపరలో తాను భావించిన న్యాయమైన సమయ భాగాన్ని, కేవలం 20 రోజుల వ్యవధిలో, పది ప్రింట్ మీడియా, నాలుగు టెలివిజన్ మీడియాలకు మాత్రమే ఇచ్చారు. ఇందులో ఏమీ తప్పుపట్టడానికేమీ లేదేమో!

ప్రతి ప్రధానమంత్రికి తనదైన, బహుశా అరుదైన 'మీడియా దృక్పథ శైలి' ఉంటుంది. వాస్తవానికి అలా వుండాలేమో! కాకపోతే, ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన పద్ధతి ప్రవచించేది మాత్రం, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఉన్నత స్థానాలలోని నాయకులు తరచుగా ‘మీడియాతో ముఖాముఖి' సమావేశమవ్వాలని. అది 'వ్యక్తిగత లేదా గ్రూప్ ఇంటర్వ్యూలు' గాని లేదా 'ప్రెస్ మీట్స్ (పత్రికా సమావేశాలు)' తో చాలా మంది లేదా ఎంపిక చేసిన కొద్దిమంది పత్రికా ప్రతినిధులతో గాని కావచ్చు. మాజీ ప్రధాన మంత్రుల, అదే విధంగా ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల మీడియా సమావేశాల వ్యక్తిగత అభిరుచులు భిన్నంగా వున్నప్పటికీ, ఒకరిది తప్పనో, వేరొకరిది ఒప్పనో ఖచ్చితంగా చెప్పలేము.

ఉదాహరణకు, నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా తన 'మొట్ట మొదటి, ఆ మాటకొస్తే ఏకైక ప్రెస్ కాన్ఫరెన్స్' ను మే 2019 లో నిర్వహించారు. కాకపోతే, వింతగా, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు, బదులుగా నాటి సహచర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆయన తరపున ఆ పని పూర్తి చేశారు. ఆ ప్రెస్ మీట్ కు సంబంధించినంతవరకు ఇది 'సరైనదా కాదా' అనే విషయాన్ని పక్కన పెడితే, అందుబాటులో వున్న సమాచారం ఆధారంగా, నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. విదేశాల్లో, 2015లో ఇంగ్లాండ్ సందర్శన సందర్భంలో ఒక పర్యాయం, 2023లో అమెరికా దేశం పర్యటన సందర్భంలో మరొక పర్యాయం మాత్రమే ఆయన పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వాస్తవానికి, వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో, పాత్రికేయులు అడిగిన రెండే రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్త కరోనా మహమ్మారి సమయంలో కూడా, మోదీ ఎలాంటి మీడియా సమావేశాలలో పాల్గొనలేదు. 'నరేంద్ర మోదీకి ప్రెస్ కాన్ఫరెన్స్‌ల విషయంలో ఒక విధమైన శాశ్వత విరోధం, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, నిరాసక్తతలు వున్నాయని కూడా వ్యాఖ్యలు వున్నాయి.

నరేంద్ర మోదీకి ముందు ప్రధానిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ మీడియాకు సన్నిహితంగా, సులభంగా అందుబాటులో ఉండేవారని అనుకునేవారు. తరచుగా మీడియా సమావేశాలను కూడా నిర్వహించేవారు. ఆయన ప్రతి విదేశీ పర్యటన సందర్భంగా తిరుగు ప్రయాణంలో మీడియా సమావేశాలు నిర్వహించేవారు. అయినప్పటికీ, మన్మోహన్సింగ్ ను మౌన మునిగా అభివర్ణిస్తూ, తరచుగా ఆయన మీడియాకు సమాధానం ఇవ్వరని బీజేపీ విమర్శించేది. ఆయన ప్రత్యేకతకు ప్రబల నిదర్శనంగా, మన్మోహన్ సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఆయన పదవీ కాలం ఒక సంవత్సరం లోపునే 1991లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తరువాత, 13 సంవత్సరాల విరామం వరకు, ఏ ప్రధానమంత్రి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించని రికార్డును సమం చేశారు.

2014 జనవరి 3, ఒక భారత ప్రధానమంత్రి (మన్మోహన్ సింగ్) భారతదేశంలో నిర్వహించిన చిట్ట చివరి ప్రెస్ మీట్ లో '100 మంది పాత్రికేయుల నుండి 62 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సమాచార సలహాదారుడిగా పనిచేసిన పంకజ్ పచౌరి ట్విట్టర్ (X) పోస్ట్‌లో తెలియచేశారు. దాన్ని ‘షేర్’ చేసిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, మన్మోహన్ తన 10 సంవత్సరాల పదవీ కాలంలో 117 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారని చెప్పారు!!! ఈ రకంగా చూస్తే, మోదీకి, మన్మోహన్ కు ఎంత విస్మయకరమైన వ్యత్యాసం వున్నదో!!! 2004 సెప్టెంబర్‌లో సింగ్ మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా, వాస్తవానికి, 'నెహ్రు కాలం' నాటి తత్సంప్రదాయాన్ని కూడా పునరుద్ధరించారు.

17 సంవత్సరాలపాటు ప్రధమ ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రు తరచుగా పత్రికా సమావేశాలను నిర్వహించేవారు. ఆయనకు పాత్రికేయుల స్వాతంత్ర్యంమీద నిబద్ధత వుండేది. సాధారణంగా విజ్ఞాన్ భవన్ లో జరుగుతుండే 'మీట్-ది-ప్రెస్' గుర్తింపు పొందిన పాత్రికేయులకు, ఫోటో జర్నలిస్టులకు సదా తెరిచి ఉండేది. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగడానికి ముందు తమను గుర్తించడానికి ప్లకార్డులను చూపే సంప్రదాయం వుండేది. వాటిని అప్పట్లో 'మాసాంతం ప్రెస్ కాన్ఫరెన్స్‌లు' గా సంబోధించేవారు. ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రచయిత, ప్రముఖ పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా పరిభాషలో ‘జవహర్లాల్ సాహసోపేతమైన పత్రికా సమావేశాలు' గా చెప్పుకునే వాటిలో లభ్యమయ్యే ‘సమాచారం, విద్య, వినోదాలను తాను మరలా ఎప్పుడూ చూడలేదంటారు. తనమీద వ్యంగ్య కార్టూన్లు వేసిన కే శంకర్ పిళ్ళై 'శంకర్ కార్టూన్స్' ను ఆస్వాదించేవారు నెహ్రూ. ఒకసారి వారిరువురు కలుసుకున్నప్పుడు, 'నన్ను కూడా విడిచిపెట్టొద్దు శంకర్' అని నెహ్రూ అనడమే కాదు, వాస్తవానికి శంకర్ ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టలేదు!!!

ఇందిరాగాంధీ ప్రధానిగా భారతీయ పాత్రికేయులకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎన్నో ఒక చేతి వేళ్లతోనే లెక్కించవచ్చని పత్రికా రంగంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత అరుణ్‌పురి అనేవారు. విదేశాలకు పర్యటించడానికి ముందు మాత్రం విధిగా ఇందిరాగాంధీ ఆ దేశానికి చెందిన పాత్రికేయుడికి ‘కర్టెన్ రైజింగ్ ఇంటర్వ్యూ’ ఇవ్వడం జరిగేదని అన్నారాయన. పశ్చిమ దేశాల పాత్రికేయులకు, ఆమె రక్షణలో ఉన్న పార్లమెంట్ హౌస్ లేదా సౌత్ బ్లాక్‌లో ఉన్న ఆమె క్వార్టర్స్‌లోకి వెళ్లడం చాలా సులువని ఆయన అభిప్రాయపడ్డారు. అదే భారతీయ పాత్రికేయుల విషయానికొస్తే, ఆమెను కలిసేందుకు సాధారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో మాత్రమే అవకాశం కలిగేది. అవి కూడా, తరువాత, అరుదైపోయాయి.

ఒక భారత ప్రధానమంత్రిగా ‘మొట్టమొదటి జాతీయంగా ప్రసారం చేయబడిన లైవ్ టీవీ ప్రెస్ కాన్ఫరెన్స్’ను రాజీవ్‌గాంధీ 1985 జూలై 7న నిర్వహించారు. గంటకు పైగా సాగిన దాంట్లో రాజీవ్ 30కి పైగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అలాంటి టెలివిజన్ పత్రికా సమావేశాలను సాదాసీదా కార్యక్రమంగా, క్రమం తప్పకుండా నిర్వహించే ఆలోచన ఉన్నట్లు అప్పుడు రాజీవ్ అన్నారు. ఆయన తన పదవీకాలంలో 60కి పైగా ప్రెస్‌మీట్‌లు నిర్వహించారు. బోఫోర్స్ వివాదం వరకు అవి కొనసాగాయి. వి.పి. సింగ్ 1989లో కేవలం ఒకే ఒక్క పత్రికా సమావేశం నిర్వహించారు!

1994–2004 మధ్యకాలంలో ప్రధానమంత్రులుగా వున్న హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్, అటల్ బిహారీ వాజపేయిలు, ఎలాంటి పత్రికా సమావేశాలను నిర్వహించలేదు. ‘మీడియాతో మాట్లాడటానికి అయిష్టత’ వ్యక్తం చేయడం అనే సంప్రదాయాన్ని, మోదీ కంటే చాలా ముందుగానే వీరు నెలకొల్పారని అనాలేమో. దేవేగౌడ, గుజ్రాల్ పదవీకాలం అతిస్వల్పమే. వారిరువురికీ మీడియా ముందు రావడానికి సమయం కూడా లేదు. వాజపేయి ప్రధానమంత్రిగా, ఢిల్లీలో అధికారిక పత్రికా సమావేశాన్ని, తన ఆరు సంవత్సరాల పదవీ కాలంలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. పాత్రికేయులతో ఆయన ముఖాముఖి సమావేశాల కలయికలు క్లుప్తంగా ముగిసేవి.

ఇదంతా పక్కన పెడితే, 75 సంవత్సరాలు నిండిన అతిపెద్ద ప్రజాస్వామ్య భారతావనిలో, నిరంతరం మార్పుకు గురవుతున్న నిజాయితీ రహిత, అసత్య, అనైతిక, వక్ర రాజకీయ, సామాజిక నీతి వ్యవస్థ నట్టనడుమ, అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలుపంచుకుంటున్న మీడియా వ్యవస్థలు నిర్వహించే ఈ సమావేశాల ద్వారా ఏమైనా ఫలితం వున్నదా అని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

దురదృష్టవశాత్తు చాలా పత్రికా సమావేశాలలో కొందరు పక్షపాత పాత్రికేయులు వేసే ప్రశ్నలు సమావేశ అంశానికి భిన్నంగా, ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా, ‘ప్రజలకు ఆసక్తి కలిగించే’ లేదా ‘సెన్సేషనల్’ విషయాలకు సంబంధించినవే కావడం గమనార్హం. అలాంటప్పుడు సమావేశం నిర్వహించే వ్యక్తిని, అందునా ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తిని విసిగించే దిశగా ఇంటర్వ్యూ కొనసాగుతుంది ఒక్కొక్కసారి. బహుశా ఈ కారణంతోనే, ఒక్కొక్క ప్రధాని తమదైన శైలిలో పత్రికా ప్రతినిధులను కలుసుకోవడం జరుగుతుండవచ్చు. ఒకప్పుడున్న పద్ధతులు, విలువలు, నిబద్ధతలు, ఎల్లప్పుడూ వుండాలని లేదుగా? అందుకే జవహర్‌లాల్ నెహ్రూ తన పద్ధతిలో పత్రికా సమావేశాలు నిర్వహించడం ఏ విధంగా వంద శాతం సరైనదో, అలాగే నరేంద్ర మోదీ తనదైన పద్ధతిలో పత్రికలు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీలకు విడివిడిగా తన ఇష్టమొచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా సరైనదేమో.

ఎవరి దారి వారిదే. ఎవరికి వారే, యమునాతీరే!   

No comments:

Post a Comment