Friday, May 31, 2024

రాజనీతిజ్ఞుడికి అపజయమే లేదు : వనం జ్వాలా నరసింహ రావు

 రాజనీతిజ్ఞుడికి అపజయమే లేదు

వనం జ్వాలా నరసింహ రావు

నమస్తే తెలంగాణ దినపత్రిక, వేదిక కాలమ్ (31-05-2024)

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను గతేడాది జూన్ 2 న ప్రారంభించి, 21 రోజుల పాటు ద్విగ్విజయంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు కొనసాగింపుగానో, లేదా వాటికి సంబంధం లేకుండానో, రాష్ట్రం ఏర్పాటై పదేండ్లు పూర్తి కావస్తున్న సంసర్భంగా, ఈ ఏడాది జూన్ 2 న, దశాబ్ది ఉత్సవాలు జరపాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలని కాబినెట్ నిర్ణయించింది. దీంతో నిమిత్తం లేకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, బిఆర్ఎస్ పార్టీ మూడు రోజుల పాటు ‘ఉత్సవాల ముగింపు వేడుకలను’ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నది.

1956 నుండి అప్రతిహతంగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చారిత్రాత్మకమైన ఒక ఎడతెగని అవిశ్రాంత, నిరంతర పోరాటం. ఏఒక్క వ్యక్తి కానీ, ఒక్క గ్రూపు కానీ, ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఒకరిద్దరు మేధావులు కానీ, ఒకరిద్దరి రచనలు-పాటలు కానీ, కొందరి ఎలెక్ట్రానిక్ మీడియా విశ్లేషణలు కానీ, పత్రికా వ్యాసాలూ కానీ కాకుండా, వీరందరితో సహా ఆబాల తెలంగాణ గోపాలం, అనేక మంది ‘మరువబడ్డ, మరుగునబడ్డ’ వీరుల పోరాట కారణానే జూన్ 2, 2014 న ‘ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఈ మహానీయులందరి గురించి, సమకాలీన వర్తమాన తెలంగాణ చరిత్రలో, అదెప్పుడు నిష్పాక్షికంగా రాస్తే, అప్పుడే, సువర్ణాక్షరాలతో లిఖించడం సమంజసం కాని, ఎంపిక చేసిన ఏ ఒకరిద్దరినో ప్రభుత్వ పరంగానో, కొన్ని ప్రభుత్వేతర సంస్థల పరంగానో సన్మానించడం బహుశా అంతగా సబబు కాదేమో!

అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇంతమంది ఎన్నివిదాలుగా రాష్ట్రసాధనకు కారణభూతులైనప్పటికీ, అత్యున్నత నాయకత్వ స్థాయికి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ‘తుదిదశ’ ఉద్యమంలో తనదైన అరుదైన శైలిలో, ‘మహాత్మా గాంధీ సంపూర్ణ శాంతియుత పోరాట నమూనాలో’, ఆ మార్గంలో, రాష్ట్ర సాధన ఉద్యమానికి సారధ్యం వహించి, అందరినీ ఏకతాటిమీద నడిపించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మద్దతు పొందే దిశగా, దేశవ్యాప్తంగా వున్న 36 రాజకీయ పార్టీలను వ్యూహాత్మకంగా ఒప్పించి, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి, రాష్ట్ర ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం, ప్రత్యామ్నాయం లేకుండా చేశారు. అందువల్ల, కేసీఆర్ పేరు, లిఖించబోయే సమకాలీన వర్తమాన తెలంగాణ చరిత్రలో, ముఖ్యంగా ‘తెలంగాణ ఆవిర్భావ, తెలంగాణ అభివృద్ధి’ అధ్యాయాలలో, అగ్రభాగాన, సవివరంగా వుండడం అత్యంత సమంజసం.

రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రజల అభీష్టం మేరకు, తొలి, మలి ముఖ్యమంత్రిగా ఎన్నికై, తొమ్మిదిన్నర సంవత్సరాలు పదవిలో ఉన్న కేసీఆర్, జార్జ్ బెర్నార్డ్ షా ఒకానొక ప్రబోధానికీ ప్రతిరూపంగా ఉన్నాడని చెప్పవచ్చు. ‘సాధారణ ప్రజలు ప్రపంచానికి అనుగుణంగా మారుతారు. అసాధారణ వ్యక్తి ప్రపంచాన్నే తనకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ప్రపంచ పురోగతి, బహుళార్థ అభివృద్ధి, వైవిధ్యభరితమైన మార్పు  అసాధారణ వ్యక్తుల ద్వారా మాత్రమే జరుగుతుంది’ అని బెర్నార్డ్ చెప్పిన వాక్యాలు, కేసీఆర్ విషయంలో అక్షర సత్యాలు. అటువంటి అసాధారణ వ్యక్తైన కేసీఆర్, తన పదేళ్ల పదవీకాలంలో తన ‘వినూత్న ఆలోచనలతో {ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్} పకడ్బందీ వ్యూహాలతో, సమస్యలకు పరిష్కారాలు సృజనాత్మకతతో కనుగొనడంతో, పాలనలో అద్భుతమైన కనీ వినని మార్పు తీసుకువచ్చాడు. సంక్షేమం, అభివృద్ధి అంటే ‘ఇదీ అని సోదాహరణంగా, త్రికరణశుద్ధిగా చేసి చూపించాడు. ‘తినబోయే పదార్ధం రుచి తినడంలోనే వుంది అన్న నానుడి ప్రకారం, పది సంవత్సరాల్లో, విజయవంతంగా ‘కేసీఆర్ తరహా తెలంగాణ అభివృద్ధి నమూనా’ ను యావత్ భారత దేశం ముందు సగర్వంగా ఉంచారు. దేశ చరిత్రలోనే ఈ నమూనా ఒక చెరిగిపోని, చెరపలేని ముద్రను వేసింది.

కేసీఆర్ లో గాంధీయ విలువలు, నెల్సన్ మండేలా విధానం, విన్‌స్టన్ చర్చిల్ వ్యూహం, జవహర్‌లాల్ నెహ్రూ సిద్ధాంతం, లీ కువాన్ యూ నిబద్ధత, పివి నరసింహా రావు ప్రగతిశీల సంస్కరణలు, డాక్టర్ ఎం చెన్నారెడ్డి ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. ఉదాహరణకు, తన మొట్టమొదటి విదేశీ పర్యటనలో సింగపూర్ సందర్శించినప్పుడు, అక్కడి అసాధారణమైన, అద్భుతమైన అభివృద్ధిని చూసి, ఆశ్చర్యపోయి, తెలంగాణ అభివృద్ధి విషయంలో అప్పటికే ఒక స్థిరాభిప్రాయానికి వచ్చిన కేసీఆర్, సింగపూర్ అభివృద్ధిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ లాగా, కేసీఆర్ కూడా ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం’ పై తదేక దృష్టి సారించారు. ‘సింగపూర్ జాతిపిత’ గా పిల్చుకున్న లీ కువాన్ యూ, ఆ దేశాన్ని ధనిక దేశంగా, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్చినట్లే, కేసీఆర్ కూడా ‘తెలంగాణ రాష్ట్ర పిత’గా అభిమానుల ఆదరాభిమానాలు పొంది, రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, గణనీయమైన ఫలితాలు సాధించాడు. దేశానికే ఆదర్శంగా తెలంగాణాను నిలిపాడు. కేసీఆర్ ఎల్లప్పుడూ లీ కువాన్ పుస్తకం 'సింగపూర్: ఫ్రం థర్డ్ వరల్డ్ టు ఫస్ట్' గురించి మాట్లాడేవాడు.

భారతదేశం ప్రప్రధమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు, కేసీఆర్ కు కొన్ని ప్రాముఖ్యతాంశాలలో, ముఖ్యంగా పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేసే అంశంలో సమీప సారూప్యత వున్నది. అనేక సందర్భాలలో నెహ్రూ, ‘ఎస్ కె డే’ ల ప్రధమ కలయిక జరిగిన నేపధ్యం, దరిమిలా ఆ అపురూప కలయిక భారతదేశంలో గ్రామీణాభివృద్ధి దిశగా, పంచాయితీ రాజ్ స్థానిక సంస్థల, సహకార సంస్థల ఆవిర్భావానికి, కమ్యూనిటీ అభివృద్ధికి ఎలా తోడ్పడిందో వివరించేవారు కేసీఆర్.

వాస్తవానికి నెహ్రూ ప్రధాని అయిన కొత్తలో, ప్రధమ పంచ వర్ష ప్రణాళిక రూపుదిద్దుకునే దశలో, ఒక పర్యాయం యుఎస్ఎ పర్యటనలో వుండగా, అధ్యక్షుడు ఐసెన్ హోవర్ సూచనపై, ఆయనకు సలహాదారుడిగా అప్పట్లో పనిచేస్తున్న ఎస్ కె డేను కలవడం జరిగింది. తొలుత స్వదేశానికి రమ్మని నెహ్రూ ఆహ్వానించినప్పుడు, సున్నితంగా తిరస్కరించిన డే, భారత దేశంలో నెహ్రూ నాయకత్వంలో జరుగుతున్న మార్పులను గమనించి, అమెరికాలో పెద్ద ఉద్యోగాన్ని వదిలి, భారతదేశానికి వచ్చి, పంచాయతీ రాజ్, సహకార సంస్థల, కమ్యూనిటీ అభివృద్ధికి చేసిన కృషి, నెహ్రూకు అందించిన సహకారాన్ని కేసీఆర్ స్ఫూర్తిగా తీసుకునేవారు.

నెహ్రూ ఆలోచనా సరళిలోనే, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కొరకు ఒక ఆదర్శ వేదికగా అభివృద్ధి చేసారు. ప్రతి గ్రామాన్ని, సుసంపన్నంగా, దేనికి దాన్నే ఒక ఆదర్శ గ్రామంగా, పచ్చదనంతో, పరిశుభ్రతతో నిండిన చోటుగా, స్థానిక స్వపరిపాలన పటిష్టంగా సాగే దిశగా మార్చడానికి ఉద్దేశించిన పంచాయతీ రాజ్ చట్టం దేశానికే ఒక నమూనా చట్టం. దీని రూప కల్పనలో అలనాటి నెహ్రూ నిబద్ధత కేసీఆర్ లో ప్రతిబింబిస్తుంది. భూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, ధరణి పోర్టల్ రూపకల్పన చేపట్టినప్పుడు, కేసీఆర్ ను పీవీ నరసింహా రావుతో పోల్చి, ఆయన ‘భూసంస్కరణల పునఃప్రారంభ మార్గదర్శకుడు’ గా పలువురి మన్నలను పొందాడు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తి నింపుకుని, మలి దశ రాష్ట్ర మహోద్యమాన్ని విజయవంతంగా నడిపించారు.

మరో విషయంలో కూడా నెహ్రూతో కేసీఆర్ ను దగ్గరగా పోల్చవచ్చేమో! ఏ విధంగానైతే గ్రామీణాభివృద్ధిలో నిపుణుడైన ఎస్ కే డే, అమెరికాలో ఉన్నత ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు భారతదేశానికి ఆహ్వానించి, కీలకమైన బాధ్యతలు అప్పగించి, దేశాబివృద్ధికి నెహ్రూ బాటలు వేశాడో, అదే విధంగా, కేసీఆర్ సహితం రాష్ట్రానికి వెలుపల కీలక పదవులలో బాధ్యతలు నిర్వర్తిసున్న వివిధరంగాల నిపుణులను, తెలంగాణ అభివృద్ధి కోసం వారి విలువైన సేవలను అందించడానికి స్వయంగా ఆహ్వానించారు. ఉదాహరణకు ఒకరిద్దరి పేర్లు చెప్పుకోవాలంటే,  ప్రపంచ బ్యాంక్ కన్సల్టెంట్ గా సేవలందించిన ఆర్ధికరంగ నిపుణుడు డాక్టర్ జి ఆర్ రెడ్డిని రాష్ట్ర ఆర్ధిక సలహాదారుడిగా నియమించారు, ‘కోల్ ఇండియా చైర్మన్’ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏస్ అధికారి, ఒక ‘నడిచే విజ్ఞాన సర్వస్వం అని చెప్పాల్సిన ఎస్ నర్సింగ్ రావును, సిఎ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. వారిద్దరి సహకారం గణనీయమైనది.

చైనాలో ‘వర్ల్డ్ ఎకనామిక్ ఫోరం ఆద్వర్యంలో నిర్వహించిన ‘ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్’ అనే అంశంపై క్లుప్తసుందరంగా కేసీఆర్ చేసిన ప్రసంగం, ఆయనలో ఒక రాజనీతిజ్ఞుడిని, మహా పాలనా దక్షుడిని, సంపూర్ణ భారతీయుడిని ఆవిష్కరించి, సర్వత్రా ప్రశంసలు అందుకున్నది. ఆర్థిక వ్యవస్థలపై సంపూర్ణ అవగాహనతో, దేశాభివృద్ధి ప్రణాళికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చక్కని ఆలోచనతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో పారిశ్రామిక, సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దేశంపైన, ప్రపంచంపైన తనకున్న అభిప్రాయాలు చెప్పే క్రమంలోనే ఎక్కడా తొట్రుపాటుకు కానీ, మొహమాటానికీ కానీ పోలేదు. ఆ సదస్సుతో కేసీఆర్ మహోన్నత వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి తెలిసింది. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర సాధకుడిగా మాత్రమే తెలిసిన కేసీఆర్ వీటన్నిటిని మించి గొప్ప దేశభక్తుడని, విశాల భావాలున్నపౌరుడని, ప్రపంచ పౌరుడిగా, భవిష్యత్ (భారత) జాతీయ నాయకుడని రుజువైంది.

సర్ విన్స్టన్ చర్చిల్ తో కూడా పోల్చ తగ్గ వ్యక్తి కేసీఆర్. ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా, రచయితగా, వక్తగా, నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సర్ విన్‌స్టన్ చర్చిల్ ప్రణాలికా సరళి, నిర్ణయ శైలి, వ్యక్తిత్వం, గెలుపు-ఓటములు, ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలనాలి. రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రతరమైనప్పుడు, 1940 వ సంవత్సరం, మే నెలలో బ్రిటన్ ప్రధానమంత్రిగా నెవిల్ చాంబర్లెయిన్ రాజీనామా చేసినప్పుడు, ఆయన స్థానంలో చర్చిల్ నియామకం జరిగింది. బ్రిటన్ ప్రధానిగా ‘బిగ్ త్రీ’ (బ్రిటన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్) సఖ్యతను బలోపేతం చేయడం ఆయన వ్యూహంలో అతి ముఖ్యమైనది. ఆయన వ్యూహం ఫలించి, హిట్లర్ నాజీ జర్మనీ పరాజయంతో, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ రాజనీతిజ్ఞుడిగా, ప్రభావితం చేసే వ్యక్తిగా విన్‌స్టన్ చర్చిల్ కు అరుదైన గుర్తింపు వచ్చింది.

అయినప్పటికీ, ఇంత జరిగినా, బ్రిటన్ ఓటర్లు ఆయన్ను కేవలం ‘యుద్ధ కాల ప్రధాని గా మాత్రమే ‘ఆ సమయానికి అంగీకరించారు. ఫలితంగా, యుద్ధానంతరం 1945 ఎన్నికల్లో, చర్చిల్ ఘోర పరాజయం పొందారు. ఆరేళ్ల విరామం తరువాత తిరిగి 1951 లో చర్చిల్ విజయం సాధించి రెండవ పర్యాయం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అందుకు భిన్నంగా కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో, ఆ తరువాత జరిగిన ఎన్నికలలోనూ విజయం సాధించారు.

సమస్యలను వినూత్న, విభిన్న, తనదైన శైలిలో కేసీఆర్ పరిష్కరించేవారు. రాష్ట్ర ప్రజల సమగ్ర సంక్షేమం, రాష్ట్రా సర్వతోముఖాభివృద్ధి కేసీఆర్ కు ప్రధానాంశం. రాజకీయాలను ‘ఒక వికృత క్రీడలా’ చూసే వెకిలి మనస్తత్వం కాదాయనది. ఆయనకదొక ‘టాస్క్, పవిత్రమైన కార్యం.’ తాను సాధించిన తెలంగాణ రాష్ట్ర విషయంలో, రాష్ట్ర సమస్యలకు సంబంధించినంతవరకు పొరుగు రాష్ట్రాల విషయంలో, కేంద్ర దృక్ఫదం విషయంలో సుస్పష్టమైన, బలీయమైన అవగాహన, ఆలోచన వున్నాయి. వీటన్నింటిలో తన స్వరాష్ట్ర ప్రాధాన్యతే ఆయనకు సర్వస్వం. తెలంగాణ స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక అవసరాల కోసం కఠినంగా ఉండాల్సినప్పుడు, కఠినంగా, మెత్తపడాల్సిన, వెనక్కు తగ్గాల్సిన సందర్భంలో వెనక్కి తగ్గేలా ఆయన వ్యవహరించేవారు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం, అవసరమైతే, ‘ఒక అదనపు మైలు నడవడం’ ఆయన నిబద్ధతకు, ప్రత్యేకతకు ప్రబల తార్కాణం.

ఎమ్మెల్యే నుండి కేంద్ర మంత్రి పదవి వరకుమ్ పనిచేసిన కేసీఆర్ కు అపారమైన అనుభవం వున్నది. పాలనాపరమైన అనుభవంతో, ఉద్యమం నేర్పిన పాఠాలతో, రాష్ట్ర అవసరాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న కేసీఆర్, ముఖ్యమంత్రిగా, పలు సమీక్షా సమావేశాలలో, అధికారుల అనుభవాన్ని, విజ్ఞానాన్ని, పరిగణలోకి తీసుకున్నారు. వారి విలువైన ఆలోచనలను గౌరవించారు. అవసరమైన సమయంలో మార్గనిర్దేశనం చేశారు.  అంతేగాని, తన ఆలోచనలను వారిమీద బలవంతంగా రుద్దేవారు కాదు. పథకాల అమలు బాధ్యత మాత్రం అధికారులదే.  

మార్పు తేవడం, మార్పులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయడం, వాటిని అమలు పరచడం, కేసీఆర్ విశిష్టత. ఎన్ని చేసినా, ఎంత చేసినా ప్రజలు మార్పు కోరుకున్నారు. అతి స్వల్ప తేడాతో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటమి పాలైంది. రాజకీయనాయకుడికి గెలుపే ప్రధానం. కానీ, రాజనీతిజ్ఞుడికి జయాపజయాలు రెండూ రెండు సహజ పరిణామాలే. అలెగ్జాండ్ర్ డ్యూమాస్ చెప్పినట్లు ‘విజయాన్ని మించిన విజయం లేదు అనేది వందశాతం సరైనది కాదేమో! బహుశా ‘వైఫల్యాలు భవిష్యత్ విజయాలకు మూల స్థంబాలు కావచ్చేమో! వాస్తవానికి ‘అపజయం అనేది తాత్కాలికంగా రద్దు అయిన విజయమే!!! అందుకే కేసీఆర్ నాయకత్వానికి అపజయం లేదనేది అసలిసిసలు వాస్తవం.

(తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని)

 

6 comments:

  1. అభిమానం, గౌరవం స్ధాయిని దాటి భక్తిగా పరిణమించినట్లుంది ఈ ప్రశస్తి.

    బెర్నార్డ్ షా, మండేలా, నెహ్రూ, చర్చిల్ … అబ్బో అబ్బో ఇంకెవరు మిగిలారు ? నాసర్ తోను, కిసింగర్ తోను, హో చి మిన్ తోను, కృశ్చేవ్ తోనూ, గోర్బఛేవ్ తోను కూడా పోలిస్తే ఓ పనయిపోతుందిగా?

    వడ్డించిన విస్తరిని ముందర పెట్టింది కేంద్రం. దాన్ని మరింత డెవలప్ చేసుకున్నారు, మంచిదే. వెళ్ళగొట్టబడినవాళ్ళకు అసలు విస్తరే లేదుగా?

    ReplyDelete
  2. గాంధీగారితో పోల్చి చెబుతారేమో నండీ రాబోయే వ్యాసంలో.

    ReplyDelete
  3. తనపార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని చెప్పి మాటతప్పటం రాజనీతిజ్ఞత.
    దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తానే కుర్చీయెక్కటం దార్శనికత.
    స్వపరబేధంలేకుండా చివరకు న్యాయమూర్తులనూ వదలకుండా వేలమంది ఫోనులను tap చేయటం రాజనీతి.
    అపరభగీరథుడిగా కీర్తికోసం కాళేశ్వరం డిజైన్లలో చేతులుపట్టి ప్రాజెక్టును ముంచటం మహాపురుషలక్షణం.
    సంపన్నరాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చటం statesmanship.
    కుటుంబపాలన ఏర్పరచి సచివాలయంలో కాలేపెట్టకపోవటం పాలనాదక్షత
    ఇంకా ఎన్నైనా చెప్పవచ్చును దొరగారి గురించి

    ReplyDelete
  4. *అతి స్వల్ప తేడాతో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటమి పాలైంది*
    64 v 39 అంటే అతిస్వల్ప తేడా కాదేమోనండీ.

    ReplyDelete
  5. Some people of still in denial mode, it will take more time to accept the reality.

    ReplyDelete