Friday, February 19, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-54 : కామధేనువును బలాత్కరించి ఎత్తుకునిపోతున్న విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-54
కామధేనువును బలాత్కరించి
ఎత్తుకునిపోతున్న విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

"వశిష్ఠుడలా కామధేనువును ఇవ్వనని చెప్పగానే,విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. అప్పుడా శబల మిక్కిలి విషాదంతో, తనేం తప్పుచేసానని, ఎందుకీ మునీశ్వరుడు తననీవిధంగా వదిలిపెడుతున్నాడని, దుఃఖపడుతూ అనుకుంటుంది. తను ఏడుస్తున్నా వదలకుండా ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, తన్నీడుస్తున్నవారిని నేలపై పడవేసి-తన్ని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. కళ్లలో నీళ్లు కారుతుంటే, ఎంతో బాధతో, గోలుగోలున ఏడుస్తూ, దేవ దుందుభిలాంటి ధ్వనితో, ’బ్రహ్మ కుమారా, ఆపదలో వున్నవారిని రక్షించే నువ్వు నన్నొదిలిపెట్టడానికి నేనేం తప్పు చేసాను? నీ దగ్గర వుండనివ్వకుండా రాజభటులు నన్ను ఈడ్చుకుపోతున్నారే?’ అని వశిష్టుడిని దుఃఖాతిశయంతో పరితపిస్తూ-వాడిపోయిన ముఖంతో తోడ పుట్టిన దానిలాగా అడుగుతుంది శబల”.


 “ఆవిధంగా ప్రార్థించిన కామధేనువుతో, తాను బుద్ధిపూర్వకంగా దాన్ని వదిలిపెట్టలేదని, మోహంతో కళ్లు కనిపించక న్యాయంతప్పిన రాజు బలాత్కారంగా తీసుకొనిపోతున్నాడని,భూమికంతా ప్రభువు, దేహబలం, సేనాబలం, అస్త్రబలంకల వీరుడైన విశ్వామిత్రుడితో బలహీన బ్రాహ్మణుడినైన తాను ఆపలేక పోయానని అంటాడు వశిష్ఠుడు.విశ్వామిత్రుడికున్న రథాలు,గుర్రాలు, ఏనుగులు, అక్షౌణి సేన గురించి చెప్పిన వశిష్ఠుడితో,క్షత్రియ బలమొక బలమేకాదని,బ్రాహ్మణబలం లెక్కలేని మహిమగలదని,రాజెంత బలవంతుడైనా వశిష్ఠుడికంటే గొప్పవాడుకాదనీ,తనకాజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనంచేస్తాననీ కామధేనువైన శబల అంటుంది. బలమే న్యాయమని దుష్టబుద్ధితో అనుకుంటున్న విశ్వామిత్రుడిని,బలహీనుడిగా,వశిష్ఠుడి మంత్రబలంతో బలంపొందిన తానుచేస్తానని,ఆజ్ఞ ఇవ్వమని అడుగుతుంది.ఆలా ప్రార్థించిన శబలను, శత్రువులు నివ్వెరపోయే ట్లు-వారి రూపం చెడిపోయే ట్లు చేయగల, అనేకమంది శూరులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠుడు".

విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేసిన కామధేను కల్పిత సేన


"వశిష్ఠుడి ఆజ్ఞలభించగానే,శత్రు సమూహాలకు భయంకలిగించే పప్లవులనే శూరులను తన హుంభారవంతో శబల. కామధేను కల్పిత శూరులు విశ్వామిత్రుడి సైన్యాన్నంతా రూపుమాపి విజృంభించారు. అది చూసిన పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు, కోపంతో కళ్లెర్రచేసి, భయంకర బాణాలతో పప్లవ శూరులను చంపి నిస్సారంగా భూమ్మీద పడేటట్లు చేశాడు. విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు, బట్టిసాలు ధరించి యుద్ధం చేయగల యవనశక సేనల గుంపులను అపారంగా సృష్టించింది. ఆ యవనులు-శకులు, కార్చిచ్చు అడవిలో పడ్డట్లు, రాజు సైన్యం మీదపడి దహిస్తుంటే, వాళ్లందరినీ విశ్వామిత్రుడు తన అస్త్రాలతో పీనుగుపెంటల్లా చేసాడు".

No comments:

Post a Comment