Sunday, April 12, 2020

ఆంధ్ర వాల్మీకి, కవి సార్వభౌమ, వాసుదాస స్వామి-2 ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-3 : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్ర వాల్మీకి, కవి సార్వభౌమ, వాసుదాస స్వామి-2
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-3
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (13-04-2020)
         వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు, పరిశోధనా దృక్ఫదంతో చదివితే. ప్రతి కాండ చివర వాసుదాసుగారు రాసిన ఆఖరు పద్యంలో, ఆ కాండలో వున్న మొత్తం పద్యాలెన్నో తెలియచేసే పంక్తులుంటాయి.

         ఆంధ్ర వాల్మీకిరామాయణం రాయడానికి ప్రేరణ-స్ఫూర్తి, భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసుదాసుగారు. పోతనను కరుణించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనతో భాగవతాన్ని తెనిగింపచేసి భవ బంధ విముక్తుడిని చేసాడని, అందుకే, పలుకుపలుకులో తేనెలొలికించి, వ్యాస భాగవతాన్ని మరిపించగలిగాడని వాసుదాసుగారి అభిప్రాయం. ఆ విధంగానే, శ్రీరాముడి కరుణ తనపైన కూడా ప్రసరించిందని వాసుదాసుగారు భావించి వుండాలి. తద్రూపమే ఆంధ్ర వాల్మీకం. వాల్మీకాన్ని ఆమూలాగ్రంగా పరిశోధించిన పరమ భాగవతోత్తముడు వాసుదాసస్వామి.108సార్లు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని పఠించి-పారాయణం చేసి, పట్టాభిషేకాలు, సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించిన ఏకైక మహానుభావుడు వాసుదాసస్వామి.

         తనకంటే ముందు కాలం నాటి పూర్వ కవులెవరు, రామాయణాన్ని (పూర్వ కాండలు, ఉత్తర కాండ కలిపి) సంపూర్ణంగా తెనిగించలేదని గ్రహించిన వాసుదాసుగారు, అన్ని కాండలను తెనిగించి, విశేషించి తెలుగు పాఠక లోకానికి ఆవిష్కరించాలని సంకల్పించుకున్నారు."వాల్మీకిరామాయణాన్ని సమగ్రంగా, యథామూలంగా పలికినవారు పూర్వ కవులందూ-నేటి (ఆయన కాలం నాటి) కవులందూ లేరు. నేటి (ఆయన కాలం నాటి) రామాయణాలలో మూలానుసరణంగా వుంది, సమగ్రం కాదు. సమగ్రమయింది మూలాను సరణం కాదు. తమ అభిప్రాయాలను, ఇతరుల అభిప్రాయాలను మూలంగా చేర్చిపెడితే, అది వాల్మీకి పలికిందెలా అవుతుంది?" అని ప్రశ్నించాడు వాసుదాసుగారు.

         భగవత్ చరిత్రలెన్నో వుండగా రామాయణ రచనకే ఎందుకు పూనుకున్నావని అడిగినవారికి తనదైన శైలిలో జవాబిచ్చారు వాసుదాసుగారు. జనన-మరణ రూపకమైన సంసార బంధం నుండి విముక్తి చేసేది రామ కథేనని, భగవత్ సాయుజ్యం పొందేందుకు రామాయణ రచన చేసానని అంటారాయన. పూర్వం కొందరు రాసారుకదా, మరల ఎందుకు రాస్తున్నావంటే, "ఎవరి పుణ్యం వారిదే. ఒకరి పుణ్యం మరొకరిని రక్షించదు" అని జవాబిస్తూ, శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామాయణాన్ని రచించి వాగ్రూపకైంకర్యం చేయదల్చానంటారు వాసుదాసుగారు.       భారద్వాజ గోత్రీకుడు, ఆపస్తంబ సూత్రుడు, గోల్కొండ వ్యాపారి శాఖీయుడయిన వావిలికొలను సుబ్బరావుగారు, కడప జిల్లా-జమ్మలమడుగులో 1863 లో జన్మించి 1939 లో పరమపదించారు. ఎఫ్.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హోదాకెదిగారు. ఆ విధంగా 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు మొదట్లో. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత, మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేసారు. వాసుదాసుగారి తర్వాత ఆ పదవిని అలంకరించింది అక్కిరాజు ఉమాకాంతం గారు.

         ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యా వియోగం కలగడంతో, వాసుదాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య కాలంలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేసారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసుదాసుగారు, గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.


         వావిలికొలను సుబ్బరావుగా పండిత పదవీ విరమణ చేసిన అనంతరం, తన జీవితమంతా, భక్తి మార్గంలోనే గడిపారు. ఈ నాటికీ క్రమం తప్పకుండా గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న అంగలకుదురు నుంచి ప్రచురించబడుతున్న "భక్తి సంజీవని" అనే భక్తి-జ్ఞాన-కర్మ యోగాలను తెలిపే ఆధ్యాత్మిక మాసపత్రిక సంస్థాపక సంపాదకులుగా-వాసుదాసుగా-ఆంధ్ర వాల్మీకిగా-కవి సార్వభౌమగా ప్రసిద్ధికెక్కారు. అంగలకుదురులోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం స్థాపించింది ఆయనే. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి, ఈ నాటికీ దర్శనీయమైన రీతిలో శాశ్వత కైంకర్యం చేసిన వాసుదాసుగారు, వాజ్ఞ్మయ ప్రపంచంలోని భక్త కవులలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు."సత్కవి మిత్రుడను" అని చెప్పుకున్న ఆయనకు, తిరుపతి వేంకటకవులు, కొక్కొండ వేంకట రత్నం పంతులు, వేదం వేంకటరాయ శాస్త్రులు మొదలైన ప్రసిద్ధ కవులందరూ స్నేహితులే.

         వాసుదాసుగారు "కౌసల్యా పరిణయం" అనే ప్రబంధం, "సుభద్రా విజయం" అనే నాటకంతో పాటు, "హిత చర్యలు", "ఆధునిక వచనరచనా విమర్శనం", "పోతన నికేతన చర్చ", "పోతరాజు విజయం", "రామాశ్వమేథం", ఆంధ్రవిజయం" కూడా రాసారు."ఆర్యకథానిధులు" అన్న పేరుతో ఆయన రాసిన సులభ వచన గ్రంథాలు తెలుగువారందరికి అత్యంత ఆదరణీయమైనాయి."సులభ వ్యాకరణం" తెలుగు వ్యాకరణాన్ని నిజంగానే సులభం చేసింది. ఆయన రచించిన "కృష్ణావతార తత్వం" ప్రశస్త కృతిపాండిత్యంతో, ఆధ్యాత్మిక భావనతో, పాఠకులలో ఆంధ్ర భాషాభిమానాన్ని ఉద్దీపించచేసి-తాను తరించి, ఇతరులను తరింపచేసిన ధన్యాత్ముడు, మహామనీషి వావిలికొలను సుబ్బరావు గారు.

         ఆంధ్ర వాల్మీకిరామాయణం తర్వాత రచించబడిన పలు గద్య-పద్య రామాయణాలకు విశేష ప్రాచుర్యం లభించినా, ఆ రోజుల్లోనూ-ఈ రోజుల్లోనూ, వాసుదాసుగారి రామాయణానికి ప్రాచుర్యం లభించినా తగినంత గుర్తింపు ఎందుకు లభించలేదనేది జవాబు దొరకని ప్రశ్న. "ఆదికవి-ఆంధ్ర వాల్మీకి", యథాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందోయతులను ఆయా స్థానాలలో నిలిపి తెనిగించిన వాల్మీకానికి రావాల్సినంత మోతాదులో, ఎందుకు గుర్తింపు రాలేదు? వ్యాస మహాభారతాన్ని మొదట తెనిగించిన నన్నయను "ఆదికవి" గా పిలిచినప్పుడు, వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా పూర్వ కాండలతో కలిపి ఉత్తర కాండను కూడా మొట్టమొదట తెనిగించిన వాసుదాసుగారు కూడా "ఆదికవే" కదా? నన్నయంతటి గొప్పవాడే కదా. వాస్తవానికి సరైన పోషకుడో-ప్రాయోజకుడో వుండి వుంటే, వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకిరామాయణం, ఎప్పుడో-ఏనాడో నొబెల్ సాహిత్య బహుమతికో, జ్ఞానపీఠ పురస్కారానికో నోచుకుని వుండేది. ఏ మాత్రం మన తెలుగువారు ప్రయత్నం చేసినా, ఆ మహానుభావుడికి భారతరత్న-జ్ఞానపీఠ ఆవార్డులతో పాటు నొబెల్ బహుమానం వచ్చేది. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే మంచిదేమో.

         వాసుదాసుగారు ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టులయ్యారు. మహనీయమైన "మందర" రామాయణాన్ని అనేకానేక విశేషాలతో, పద్య-గద్య-ప్రతి పదార్థ-తాత్పర్య-ఛందోలంకార విశేష సముచ్ఛయంతో, నిర్మించి, వేలాది పుటలలో మనకందించారు. రామాయణ క్షీర సాగరాన్ని "మందరం" మథించి, మనకందరికీ ఆప్యాయంగా అందించింది. అయితే, దానిని ఆస్వాదించే తీరికా-ఓపికా లేని జీవులమైపోయాం మనం. భాష, శైలి, అర్థం, తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి. "సూక్ష్మంలో మోక్షం" కావాలంటున్నారు నేటి తరం పఠితులూ, పండితులూ.

         కాలం గడిచిపోతున్నది. వాసుదారుగారు మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్ఠమైపోతున్నది. వారి "ఆర్యకథానిథుల" తోనూ, "హితచర్యల" పరంపరలతోనూ, పరవశించిపోయిన ఆ నాటి తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి.

No comments:

Post a Comment