Thursday, April 9, 2020

జాబాలి ఆస్తికుడే! ..... వనం జ్వాలా నరసింహారావు


జాబాలి ఆస్తికుడే!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక, చింతన (09 &10-04-2020)  

భగవంతుడు అవ్యాకృతాత్ముడై రూపం, నామం, క్రియ లేనివాడై కొంతకాలం వుంటాడు. ఆ తరువాత మళ్లీ సృష్టిని సంకల్పిస్తాడు. ఆ సంకల్ప శక్తివల్ల ప్రకృతి క్షోభిల్లుతుంది. అప్పుడు మళ్లీ ఒకదానిలో నుండి ఇంకొకటి పుట్తాయి. ఈ విధంగా తమస్సు, ప్రకృతి, మహత్తు, అహంకారం, ఆకాశతన్మాత్రం, అగ్ని, జలతన్మాత్రం, జాలం, పృథివీ, పృథివినుండి ఔషదులు, వరుసగా ఉద్భవిస్తాయి. ఇది పరిణామం, ఇవోల్యూషన్ అని అంటారు. మొదలు జరిగేది విపరిణామం, ఇన్వొల్యూషన్. విపరిణామం చాప చుట్టడం లాంటిది కాగా, పరిణామం చాప విప్పి పరచడం లాంటిది. ఇవన్నీ చేసేవారు ఎవరు? వాటంతట అవే అయ్యాయా? ప్రకృతి జడం కాబట్టి దానంతట అది పరిణామం చెందలేదు. జీవుడు కర్మబద్దుడైనందున, ఆకాలంలో ప్రకృతిలో కలసి వున్నందున అతడికి ఆ శక్తిలేదు. కాబట్టి ఇవన్నీ చేసేవాడు భగవంతుడే! ఈ విధంగా సర్వం భగవంతుడే అని అర్థం చేసుకోవాలి. వివరాల్లోకి పోతే.....

సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్న శ్రీరాముడి దగ్గరికి  జడలు, కృష్ణాజినం ధరించి వచ్చిన భరతుడు వనవాసం మాని అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించమని అన్నగారిని పలురకాలుగా వేడుకున్నాడు. అయినా, శ్రీరాముడు భరతుడిని తనదైన శైలిలో తగురీతిలో సమాధాన పరిచే ప్రయత్నం చేసి హితోక్తులు పలికాడు. 

           హితమైన మాటలు చెప్పి భరతుడిని సమాధాన పరుస్తున్న శ్రీరామచంద్రుడిని చూసి, అక్కడే వున్న బ్రాహ్మణోత్తముడైన జాబాలి ఇలా అంటాడు: “సర్వం తెల్సిన నీకు  పామరుడిలాగా బుద్దిమాంద్యం ఎలా కలిగింది? తండ్రి-తండ్రి అని అంటున్నావే? మనిషికి తండ్రి అనేవాడెవరు? బందువులెవ్వరు? ఇదేం అనాలోచిత ప్రసంగం? ఒకడి ద్వారా మరొకడికి అయ్యే పనేంటి? ఒకడు ఇంకొకడికి ఏంచేయగలడు? ముసలితనం రాకుండా కాపాడగలమా? చావురాకుండా ఆపగలమా? పుట్టినప్పుడు తానొక్కడే పుట్టాడు, చనిపోయేటప్పుడు ఒక్కడే చస్తాడు. అప్పుడీ తండ్రులలో, బంధువులలో ఒక్కడైనా వెంట వస్తారా? అలా రానప్పుడు వీరు కన్నవారెలా అయ్యారు? బంధువులెలా అయ్యారు?”.

         “ఎక్కడి తల్లి? ఎక్కడి తండ్రి? ఒకడిని తండ్రి అనీ, ఒకరిని తల్లి అనీ అనడం బుద్ధిలేనితనమే! ఒక ప్రాణికి, మరొక ప్రాణికి సంబంధమే లేదు. రామచంద్రా! ఈ తల్లిదండ్రుల దేహాలు సత్రాలు, చలువ పందిళ్ళ లాంటివి. అప్పటికప్పుడు ఉపయోగించుకునేవి మాత్రమే! కాబట్టి వీటికోసం వివేకవంతుడు తాపత్రయపడడు. రామచంద్రా! యౌవనంలో అనుభవయోగ్యం కాని చెడుమార్గాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? సుఖకారణమై, భోగవస్తువులతో నిండిన అయోధ్యకు పో. నీ ఇష్టానుసారం సుఖం అనుభవించు”.

         “తండ్రి ఎవడు? నువ్వెవరివి? తండ్రికి నీకు ఏమి సంబంధం? అతడు వేరు, నువ్వు వేరు. దీనిని తెల్సుకుని హితులు చెప్పిన విధంగా చేయి. పురుషుడు ఒక స్త్రీ గర్భంలో బీజం వేస్తే అది స్త్రీ రక్తంతో కలిసి పిండమై, ప్రాణంతో పుట్తున్నది. తండ్రి ఒక అల్ప సహాయం మాత్రమే. ఆ మాత్రానికి ఎందుకు తండ్రి-తండ్రి అని అంటున్నావు? నాలుగు భూతాల సంయోగమే దేహం. పుట్టినవాడు ఎన్ని రోజులకైనా చావాల్సిందే. ఇది ఆలోచించకుండా పిచ్చివాడిలా వ్యర్థంగా ఏంటో అంటున్నావు. నువ్వెక్కడ? తండ్రి ఎక్కడ? ఇద్దరికీ ఏం సంబంధం?”.

         “కష్టపడి వైదిక కర్మలు చేస్తున్నారు. చనిపోయినవాడు అన్నం తింటాడా? చనిపోయినవారి పేరు చెప్పి ఇతరురులు తింటున్నారు. దీనివల్ల లాభం ఏమిటి? బతికున్నవాడు అన్నం తింటే చనిపోయినవాడి కడుపెలా నిండుతుంది? ఒకడు కూడు తింటే మరొకడి కడుపెలా నిండుతుంది? బుద్ధికలవారు ఇవి విని నమ్ముతారా? మబ్బుల్లో నీరును నమ్ముకుని చెరువు నీరు తెగగొట్టుతారా? చనిపోయిన తరువాత ఎదో సుఖం కలుగుతుందని ప్రత్యక్ష రాజ్య సుఖాన్ని పోగొట్టుకునే బుద్ధిలేనివాడు ఎవరైనా వుంటారా? కాబట్టి లోకం సమ్మతించే ఆలోచన చేయి. మామీద దయ చూపి పట్టాభిషేకం చేసుకో”.

జాబాలి మాటలకు శ్రీరాముడు జవాబుగా ఇలా చెప్పాడు: “ఓ బ్రాహ్మణుడా! నీ మాటలను బట్టి నువ్వు నియమహీనుడివని, పాపివని తెలసుకున్నా. నేను చేసిన ప్రతిజ్ఞను సముద్రంలో కలిపి, సత్యాన్ని నాశనం చేసి, మీరు సత్యంలో వుండమని ఎవరికి ఏమని చెప్పను? అసత్యమాడి పరలోక సుఖం ఎలా అనుభవించను? యథారాజా తథా ప్రజా అనే న్యాయాన్ని అనుసరించి రాజు నాస్తికుడై, దేవుడు లేడు, పరలోకం లేదు, అని చెప్తే లోకులు కూడా వారి-వారి ఇష్టప్రకారం దొంగతనం, రంకుతనం, హత్యలు లాంటివి చేస్తారుకదా? అప్పుడు ధర్మం, సత్యం అనేవి నశిస్తాయి కదా? కాబట్టి సర్వ జగాలకు సత్యమే ఆధారం. అన్నింటికంటే సత్యమే శ్రేష్ఠం. వాస్తవానికి మోక్షాన్ని కోరేవాడు సత్యాన్నే పలకాలి. సత్యమే లక్ష్మీవాసస్థానం. ప్రపంచానికంతా సత్యమే నియంత. సత్యానికి లోబడి ప్రపంచం నడుస్తున్నది. సత్యమే ప్రపంచం నిలబడడానికి మూలాధారం. మోక్షప్రాప్తికి సాధనం సత్యం. సత్యం విడిచిన వారికి ఇవేవీ పనిచేయవు. నరుడు సత్యమే ప్రధానంగా కలవాడు కావాలి”.




         “సత్యమే స్వరూపంగా వుండే ధర్మం ఆత్మను విడిచి వుండేది కాదు. సత్పురుషులు ఆచరించాల్సిన వానప్రస్థ ఆశ్రమాన్ని, జడలు ధరించి సత్యం కొరకై నేను స్వీకరించా. పాపకార్యాలు ఆలోచిస్తే, అవి చేయకపోయినా, పాపం వస్తుంది. ఇది మానసికం. అసత్యం నోటితో చెప్పినా పాపం వస్తుంది. ఇది వాచకం. దేహంతో చేయడం వల్ల ఈ మూడు రకాల పాపాలు వస్తాయి. సత్యమే ప్రదానంగాగల పురుషుడికి కీర్తి, యశస్సు, లక్ష్మి తమంతట తామే వలచి వస్తాయి. ఈ లోకంలో ఇవి సమకూర్చడమే కాకుండా సత్యం స్వర్గలోకానికి తోడుగా పోయి దివ్యసుఖాన్ని కలిగిస్తాయి. ఇలాంటి సత్యాన్ని ఎవరు వదులుకుంటారు?”

         “అది లేదు, ఇది లేదు అనే విచారం కాని, లభించిన దాని మీద ప్రేమకాని లేకుండా, లభించినదానితో పంచేద్రియాలను సంతోషపెట్తూ, శాస్త్రం మీద, కర్మఫలం మీద నమ్మకంతో, పాపరహితమైన మనసుతో, సత్కార్యాలు చేస్తూ, పితృవాక్యాన్ని పాలిస్తూ కాలం గడుపుతా. ఈ భూమండలం కర్మభూమి కాబట్టి ఇక్కడున్నవారు కర్మలే చేయాలి. ఊర్ధ్వలోకాలు ఫలభూములు. ఇక్కడ చేసిన కర్మల ఫలం అక్కడ అనుభవించాలి. ఇక్కడ పుణ్యం చేసినవాడు అక్కడ సుఖం అనుభవిస్తాడు. ఇక్కడ పాపం చేసినవాడు అక్కడ దుఃఖం అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ పుణ్యకర్మలే చేయాలి. అలా పుణ్యకర్మలు చేసిన మనుష్యులే వారి-వారి పుణ్యకర్మం కొద్దీ వాయువుగానో, అగ్నిగానో, చంద్రుడుగానో పుట్తాడు”.

“సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, ఇవన్నీ ఉద్యోగాలే. ఎవరే సంకల్పంతో ఏ కర్మ చేస్తాడో, ఆచరిస్తాడో, ఆ కర్మఫలంగా వాడే ఉద్యోగ పదవికి అర్హుడో వారికా పదవి ఇవ్వడం జరుగుతుంది. వీరంతా కొంతకాలం ఆ పదవుల్లో వుండి వేరేవారికి స్థానం కలిగిస్తారు. బ్రహ్మ రుద్రేంద్రాది పదవులన్నీ కర్మఫలాలే. ఫలదాత భగవంతుడైన విష్ణువే. భగవంతుడైన విష్ణువు సృష్టికర్త అయి తన్ను సృజించుకుంటున్నాడు. పాలించేవాడై తన్ను రక్షించుకుంటున్నాడు. సంహరించేవాడై సంహరింపబడుతున్నాడు. నూరు యజ్ఞాలు చేసినవారు ఇంద్రుడై నహుషుడిలాగా స్వర్గాధిపతి అవుతాడు. మహర్షులందరూ స్వర్గం పోవడానికి కారణం వారు-వారు చేసిన తపోనిష్ఠల వల్లే”.

         ఇలా కోపంతో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడగా, జాబాలి మళ్లీ సత్యమైన మాటలతో ఇలా అన్నాడు: “రామచంద్రా! నేను నాస్తికుడిని కాదు. నేను నాస్తికోక్తులను చెప్పను. నాస్తి అనేది లోకంలో లేదు. సర్వం అస్తియే! నేను నాస్తికుడిని కాకపోయినా ఎందుకు నాస్తికవాదం చేశానంటావా? విను. రామచంద్రా! మీరిద్దరూ రాజ్యాన్ని అంగీకరించకపోతే రాజ్యం, ప్రజలు ఏగతి పట్టాలి? దేశం ఎంతటి దుస్థితికి వస్తుంది? ఈ మహావిపత్తును ఆలోచించి న్యాయంగా రాజ్యం నీది కాబట్టి నువ్వు రాజు కావడం ధర్మమని అనుకుని, న్యాయోక్తులన్నిటికీ విరుగుడు మాటలు చెప్పిన నీకు, ఈ మార్గంలోనైనా నిన్ను అంగీకరించేలా చేద్దామనుకుని నాస్తికవాదం చేశానే కాని, నేను నాస్తికుడిని కాదు. ఎవరైనా నాస్తికవాదం చేస్తే నేనే వారిని ఖండిస్తా”.

         “ఇప్పుడు నేను చేసిన వాదన, ధర్మానికి హాని కలిగినప్పుడు ఎలాగైనా ధర్మ స్థాపన చేయాల్సి వస్తే, నువ్వు రాజుగా వుండి అలా చేస్తే, నిన్ను నేనే ఆక్షేపించి ఇప్పుడు నేను చేసిన వాదన ఖండించే వాడిని.  ఇప్పుడు నాస్తికవాదన చేయడమే కాదు, ఎప్పుడైనా ధర్మహాని కలిగితే, ఇలాంటి కష్టకాలం వస్తే, మళ్లా నాస్తికవాదన చేస్తా. ధర్మంగా వుండి, ఇంత దేశాన్ని అరాజకం చేసి ఇందరు ప్రజలను నాశనం చేయడం ఎక్కువ కీడా? నువ్వొక్కడివి తాత్కాలికంగా నాస్తికవాక్యాన్ని అంగీకరించి రాజువై, లోకరక్షణ చేయడం మేలా? క్షమించు. ఒక పని నెరవేరాలంటే ఎన్ని విధాల ప్రయత్నించినా తప్పులేదు”.

           జాబాలి ఇలా చెప్పగా అతడిమీద కోపంతో వున్న శ్రీరామచంద్రుడితో వసిష్ఠుడు ఇలా అన్నాడు: “రామచంద్రా! నిన్ను అయోధ్యకు తీసుకుపోవడానికే జాబాలి ఆ విధంగా నాస్తికవాదం చేశాడు. ఈ ప్రపంచం ఎలా పుట్టిందో చెప్తా విను. బ్రహ్మాండమంతా జలంతో నిండి ఒక సముద్రంగా వున్నప్పుడు భూమి సృష్టించబడింది. పరబ్రహ్మం వల్ల దేవతలు, బ్రహ్మ కలిగారు. భూమి నీట్లో మునుగుతున్నప్పుడు విష్ణువు ఆదివరాహమై తన కొమ్ముతో దాన్ని పైకెత్తాడు. అప్పుడు అవ్యయుడు, నిత్యుడు, పరబ్రహ్మం వల్ల కలిగిన బ్రహ్మ తన కొడుకులైన మరీచ్యాదులతో ప్రపంచమంతా వ్యాపించాడు. ఆకాశమే పరబ్రహ్మం. ఆకాశమంటే సర్వత్రా ప్రకాశించేది. ఈ ప్రపంచం ప్రళయకాలంలో చీకట్లో మునిగి వుండేది. అంటే, ఆ కాలంలో మహదాది అయిన ప్రకృతి సూక్ష్మ ప్రకృతైన తమస్సులో లీనమై తమస్సు భగవంతుడితో ఏకీభావంగా వుండేది. ఈ కారణం వల్ల అది ప్రత్యక్ష ప్రమాణానికి అగమ్యంగా, చీకట్లో వస్తువులు కళ్లకు కనబడని విధంగా, ఇది ప్రపంచమని గుర్తించగల చిహ్నాలు లేకుండా, శబ్దం వల్ల కూడా తెలియకుండా అంతా నిద్రావస్తలో వున్నట్లుండేది”.

         వసిష్ఠుడు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు: “ఆ బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి భాస్కరుడు, భాస్కరుడికి మనువు, మనువుకు ఇక్ష్వాకుడు పుట్టారు. అయోధ్యను మనువు ఇక్ష్వాకుడికి ఇచ్చాడు కాబట్టి మీ వంశానికి ఇక్ష్వాకుడే మూలపురుషుడు. అతడికి కుక్షి, ఆ కుక్షికి వికుక్షి, అతడికి బాణుడు, బాణుడికి అరణ్యుడు జన్మించారు. ఈ అరణ్యుడే రావణుడితో యుద్ధం చేసి శపించాడు. అరణ్యుడికి బృథువు కలిగాడు. అతడి కుమారుడే త్రిశంకుడు, దేహంతో స్వర్గానికి పోయాడు. త్రిశంకుడికి ధుంధుమారుడు లేదా యువనాశ్వుడు, అతడికి బలశాలి మాంధాత పుట్టారు. మాంధాత కొడుకు సుడంది. అతడి కొడుకులు ధ్రువసంధి, ప్రసేనజతుడు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతడి కొడుకు అసితుడు. ఇతడిని హైహయులు, తాలజంఘులు యుద్ధంలో ఓడించి రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. ఆయనకు ఇద్దరు భార్యలు. వారిలో ఒకామె గర్భవతిగా వున్నప్పుడు సవతి విషం పెట్టింది. గర్భవతి కాళింది చ్యవనుడనే మునిదగ్గరకు పోయింది. ఆ ముని ఆమెకు వంశాన్ని ఉద్ధరించే సజ్జన స్తోత్రుడైన కొడుకు పుడుతాడని దీవించాడు”.

         “ఇంటికి పోయిన కాళిందికి బ్రహ్మతో సమానుడైన కొడుకు సగరుడు పుట్టాడు. ఆ వంశ పరంపరలో, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుథ్సుడు, రఘువు, కల్మాషపాదుడు, శoఖనుడు, సుదర్శనుడు. నహుషుడు, నాభాగుడు పుట్టారు. అతడికి అజుడు, సువ్రతుడు అనే ఇద్దరు కొడుకులున్నారు. అజుడి కుమారుడు దశరథుడు. “దశరథుడి కొడుకుల్లో నువ్వు పెద్దవాడివి. కాబట్టి రామచంద్రా! నీ తండ్రిలాగా నువ్వు కూడా భూమిని పాలించు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారిలో ఇప్పటిదాకా వంశపరంపరంగా పెద్దవాడే రాజవుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా వంశధర్మాన్ని అనుసరించి, అది తప్పించక, రాజ్యాభిషేకానికి అంగీకరించి ప్రజలను పాలించు” అని ముగించాడు వసిష్టుడు.
(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా) 

No comments:

Post a Comment