Wednesday, April 22, 2020

విష్ణువే బలవంతుడా? .... వనం జ్వాలా నరసింహారావు


విష్ణువే బలవంతుడా?
వనం జ్వాలా నరసింహారావు
 ఆంధ్ర ప్రభ చింతన (23-04-2020)
         సీతారాముల కల్యాణం జరిగిన మర్నాటి ఉదయం, దశరథ కుమారులకు మంచి దీవెనలిచ్చి హిమాచలానికి వెళ్లిపోయాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆయనలా వెళ్లగానే, అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతినివ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. ఆ వెంటనే, బిడ్డలకు అరణం ఇచ్చింతర్వాత, దశరథ మహారాజుతో కలిసి, వారితో తాను కొంతదూరం ప్రయాణంచేసి, వారందరిని సాగనంపి, ఆయన అనుమతితో తన ఇంటికి తిరుగు ప్రయాణమై పోయాడు జనకుడు.

వెళుతున్న రామచంద్రమూర్తి ఇంపైన-శ్రేష్ఠమైన సుకుమారత్వాన్ని, అందాన్ని, గొప్ప గాంభీర్య గుణాన్ని, శౌర్యాన్ని గమనించిన మిథిలా పుర స్త్రీలు ఒకరితో మరొకరు ఇలా చెప్పుకున్నారు: "అమ్మా, వీడా యుద్ధంలో తాటకను చంపిన విల్లుకాడు? వీడా విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తూ సుబాహుడిని చంపిన పౌరుషశాలి? వీడా అహల్యను శాప విముక్తురాలిని చేసి మరల స్త్రీగా చేసిన ఉపకారి, వీడా మన జనక రాజు దాచిపెట్టిన శివిడివిల్లు విరిచిన జగజ్జెట్టి, వీడా నిన్ననే మన సీతను పెళ్లిచేసుకొని కులుకుతున్న సుందరుడు. అమ్మా, మన రాజు జనకుడు ఎంత పుణ్యాత్ముడే? ఇంతటి వాడిని అల్లుడిగా సంపాదించాడు!. ఇతడిని భర్తగా పొందేందుకు మన సీత ఏ నిష్ఠలు సలిపిందోకదా? ఇతడు తన అల్లుడయేందుకు మనరాజు జనకుడు ఏ మంత్రం జపించాడోకదా? ఇతడు ప్రభువుగా తమను పాలించేందుకు అయోధ్యాపురవాసులు ఎన్ని తపస్సులు చేసారోకదా?" అని ముక్కుమీద వేలుంచుకుని ఆశ్చర్యపడ్డారు.

         దశరథుడు పయనమై అయోధ్య దిక్కుగా పోతుంటే, ఆయనకు ఎదురుగా, పరుష ధ్వనులతో ఆకాశంలో పక్షులు భయంకరంగా కూసాయి. అప్పుడే కొన్ని మృగాలు ప్రదక్షిణగా పరుగెత్తసాగాయి. ఆకాశంలో అపశకునాలు, భూమిమీద శుభశకునాలు కనబడడంతో, దశరథుడు అదేంటని వశిశ్ఠుడిని అడిగాడు. పక్షి కూతలవల్ల భయంకరమైన కీడు కలిగే అవకాశం వున్నప్పటికీ, అడవిమృగాలు ప్రదక్షిణగా పోతున్నందున, భయపడాల్సిన అవసరం లేదని వశిష్ఠుడు దశరథుడికి ధైర్యం చెప్పాడు. ఇంతలో, చూసేవారి గుండెలు ఝల్లుమనేలా గాలి సుళ్లుపెట్తూ వీరిని తాకింది. భూమి వణికి చెట్లు నేల కూలాయి. విస్తారంగా చీకట్లు సూర్యుడిని కమ్ముకున్నాయి. దిక్కులు తెలవకుండా, దుమ్ము విశేషంగా లేచి, దశరథుడి సైన్యాన్ని కప్పేసింది. ఇదంతా జరుగుతుంటే, ఏంచేయాల్నో తోచక ఎక్కడివారక్కడే నిలబడి పోయారు.

ఆ సమయంలో, భయంకరమైన ఆకారంతో, దిగులు పుట్టించే తేజంతో, భుజంమీద ప్రకాశవంతమైన గండ్రగొడ్డలిని ధరించి జమదగ్ని కుమారుడు, పరశురాముడు, ఏనుగులా వేగంగా అడుగులు వేసుకుంటూ భూమిపై దద్దరిల్లే ధ్వనులు పుట్టించుకుంటూ అక్కడికొచ్చాడు. ఇలా వస్తున్న ఆయనను దూరంనుండే చూసిన మునులు, తన తండ్రిని చంపాడన్న కోపంతో రాజులందరినీ హతమార్చిన పరశురాముడు ఎందుకొస్తున్నాడానని ఆలోచించ సాగారు. ఇంతలో, అక్కడకు చేరుకున్న పరశురాముడికి, ముని సమూహం అర్ఘ్యం ఇచ్చి పూజించిన తర్వాత, వారిని దాటిపోయి శ్రీరాముడితో సంభాషించాడు పరశురాముడు.

         "రామా, దశరథ రామా! అద్భుతమైన నీ గొప్పబలాన్ని గురించి విన్నాను. నువ్వు శివుడి ధనుస్సును విరచడం గురించి కూడా లోకులందరు చెప్పుకుంటుంటే విన్నాను. శివుడి విల్లు విరచడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇంత గొప్పదని చెప్పలేందది. ఇదివిన్న నేను, ఆ విల్లుకంటే గొప్పదైన మరోదాన్ని, నీ బలం పరీక్షించేందుకు తీసుకొచ్చాను. ఇదిగో, ఇదే పరశురాముడి విల్లు. దీన్ని చూస్తుంటేనే గుండెలు ఝల్లుమంటాయి. దీన్ని నువ్వు ఎక్కుపెట్టి, భయపడకుండా, నీబలమెంతో, వీర్యమెంతో చూపించు. ఈ విల్లు నువ్వు ఎక్కుబెట్టితే, నీ పరాక్రమం ఎంతో చూసి, నీతో ద్వంద్వ యుద్ధంచేస్తాను" అని శ్రీరాముడితో అంటాడు పరశురాముడు.

         పరశురాముడి మాటలు విన్న దశరథుడు, వెలవెలబోయిన ముఖంతో, దీనంగా, కాళ్లల్లో వణుకుపుట్తుంటే, మాటలు తడబడుతుంటే పరశురాముడిని ప్రార్థించాడీవిధంగా: "అయ్యా, ఈ నా కొడుకు బాలుడు. ఏదో పిల్లతనంతో శివుడి విల్లు విరిచాడు. నువ్వా తప్పును క్షమించు. నీవు కోపించవచ్చా? ఓ మునీశ్వరా, నా గొప్ప పురుషార్థాలన్నీ నాశనం చేయడానికి వచ్చావా? రామచంద్రుడిని ఒక్కడిని చంపితే, మేమందరం అతడితో పోవాల్సినవాళ్లమే". ఇలా అంటున్న దశరథుడి మాటలు వినిపించుకోకుండా, పెడచెవిన పెట్టిన పరశురాముడు, శ్రీరామచంద్రమూర్తికి ధనుస్సుల వృత్తాంతాన్ని చెప్పసాగాడు.

         "నీవు విరిచిన విల్లు, ఇప్పుడు నాచేతిలో వున్న విల్లు, రెండు కూడా, మిక్కిలి బలిష్ఠమైనవి. దేవతలు చెప్పి చేయించినవి. మిగుల శ్రేష్ఠమైనవి. మిక్కిలి దృఢమైనవి. గొప్ప ప్రయత్నంతో విశ్వకర్మ వీటిని తయారుచేశాడు. అందులో ఒకదాన్ని, త్రిపుర సంహార సమయంలో శివుడికి దేవతలిచ్చారు. నువ్వు విరిచింది దాన్నే. ఇది రెండోది. దీన్ని దేవతలు విష్ణువుకిచ్చారు. ఇదీ మిక్కిలి బలిష్ఠమైనదే. బలంలో శైవచాపంతో సమానమైంది. ఇలా కొంతకాలం జరిగింతర్వాత దేవతలు బ్రహ్మ దగ్గరకు పోయి, శివకేశవులలో ఎవరు బలవంతులని ప్రశ్నించారు. వారి అభిప్రాయం తెలుసుకున్న బ్రహ్మ, క్రియా రూపంలో వారి సందేహం తీరుస్తానని చెప్పి, శివుడికి, విష్ణువుకు విరోధం కలిగించాడు”.


“శివుడు దగ్గరకు పోయి, త్రిపురాలను నాశనం చేసిందెవరని అడిగాడు బ్రహ్మ. తానేనని జవాబిచ్చిన శివుడితో, చేతగాని ప్రగల్భాలు పలకొద్దని, విష్ణువు బాణమై పోయినందున కదా త్రిపురాలను కాల్చిందని అంటాడు. ఆయన చేసిందేమీ లేదని, త్రిపురాలను కాల్చి బూడిద చేసింది తానేనని, శివుడు నిమిత్తమాత్రుడేనని విష్ణువంటున్నాడని రెచ్చగొట్టాడు శివుడిని బ్రహ్మ. విష్ణువుకు ఆ శక్తి వుంటే తనకు బాణంగా ఎందుకు నిలిచాడు? అని, శివుడు ఎదురు ప్రశ్న వేశాడు బ్రహ్మను. శివుడన్న మాటలను విష్ణువుకు చెప్పి, పరస్పర ద్వేషం కలిగించి, ఇరువురినీ యుద్ధానికి సిద్ధంచేశాడు బ్రహ్మ”.

“ఒకరిపై మరొకరు కోపించి, వారిద్దరూ భయంకరమైన యుద్ధంచేశారు. ఆ యుద్ధంలో శివుడికి నువ్వు విరిచిన వింటిని, విష్ణువుకు నాదగ్గరున్న వింటిని ఇచ్చారు దేవతలు. ఆయుధాలలో తేడాలుంటే, ఇరువురి బలాబలాలు నిర్ణయించడం సాధ్యంకాదని, సరిసమానమైన ధనుస్సులను ఇచ్చారిద్దరికి. ఇద్దరూ జయించాలనే యుద్ధంచేశారు. ఇదంతా చూస్తున్న దేవతలు, మునులు, చారణులు, వృథా కలహం మాని, హరిహరులిద్దరు యుద్ధం ఆపు చేయమని ప్రార్థించారు. వారుకూడా శాంతించారు. విష్ణువు బల వేగంతో శివుడి విల్లు పెట్లిపోవడం చూసిన దేవతలు, మునులు, విష్ణువే శివుడికంటే బలవంతుడని తమ మనస్సులో అనుకున్నారు".

"దేవతల అభిప్రాయాన్ని గ్రహించిన రుద్రుడు, ధనుస్సుపై కోపంతో, బాణాలతో సహా దాన్ని దేవరాతుడికిచ్చాడు. విష్ణువు ధరించిన వింటిని ఆయన, భృగువంశభవుడైన ఋచీకుడికిచ్చాడు. ఋచీకుడు తన కొడుకైన జమదగ్నికి ఇచ్చాడు. ఆ జమదగ్ని నా తండ్రి. జమదగ్ని శస్త్ర సన్యాసం తీసుకొని తపస్సు చేస్తున్నప్పుడు, గర్విష్ఠుడైన కార్త్యవీర్యార్జునుడు, నీచ బుద్ధితో, నా తండ్రిని చంపాడు. దారుణమైన పితృమరణవార్త విన్న నేను క్రూరుడనై, రాజులను పలుమార్లు వధించాను. రాజులందరినీ చంపి, యజ్ఞం చేసి, యజ్ఞాంతంలో భూమినంతా కశ్యపుడికి దానం చేసి, మహేంద్ర పర్వతం నా నివాసంగా చేసుకొని, తపస్సు చేసుకుంటూ సుఖంగా దేవతా సంఘసేవితుడనై వున్నాను. నువ్వు, నీ మహాబలంతో, శివుడి విల్లు విరిచావని విని పరుగెత్తుకుంటూ వచ్చాను. ఆ వైష్ణవ చాపం ఇదే. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టినవాడివైతే, నీ తండ్రి, తాతల క్షాత్రం స్మరించి, ఈ విల్లు ఎక్కుపెట్టి నీ భుజబలం చూపించు. నువ్వు విల్లెక్కుబెట్టి, బాణం సంధించగలిగితే, నీతో ద్వంద్వ యుద్ధం నేనొక్కడినే చేస్తాను. త్వరగా కానివ్వు" అని పరశురాముడన్న మాటలకు శ్రీరాముడు కోపించాడు.

         పరశురాముడిలా మాట్లాడుతుంటే కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి, మెల్లని స్వరంతో, "ఏమన్నావు పరశురామా? నీకథంతా విన్నాను. శూరుడు పగ తీర్చుకోవడం న్యాయమే కాబట్టి జనకుడి ఋణం తీర్చుకునేందుకు నీవు చేసిన పని సరైందనే అంగీకరిస్తున్నాను. అంతవరకు బాగానే వుంది. కాకపోతే నేను దుర్బలుడని తలుస్తున్నావు నువ్వు. క్షాత్రధర్మంలో నేను తక్కువన్నట్లుగా నువ్వన్నమాటలను సహించను. నా తేజస్సు నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నా బలాధిక్యాన్ని చూపిస్తాను, చూడు" అని అంటూ, పరశురాముడి చేతిలోని భయంకరమైన వింటిని లాక్కున్నాడు.

వింటిని లాగి, ఎక్కుపెట్టిన రామచంద్రమూర్తి, ఒక బాణాన్ని సంధించి, కళ్లెర్రచేసి అమితమైన కోపంతో పరశురాముడిని చూసి "బ్రాహ్మణుడవైకూడా, శస్త్రాన్ని ధరించి వచ్చిన నిన్ను చంపవచ్చని శాస్త్రం అనుమతించినా, నీవు నా గురువైన విశ్వామిత్రుడి బంధువైనందున, నీమీద కోపంతో నీపై సంధించి, నిన్ను చంపగలిగిన ఈ బాణాన్ని నీమీద ప్రయోగించడానికి మనసొప్పుకోవడంలేదు. అందువల్ల, నువ్వింక ఎంతమాత్రం నడవ లేకుండా, ఒక దిక్కున పడే విధంగా నీ కాళ్ల గమనవేగాన్నిగానీ, నువ్వు తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాలనుగానీ, ఏదికోరుకుంటే దాన్ని, ఈ బాణంతో ఖండిస్తాను. ఈ బాణం వృధాగా పోదు. ఇది విష్ణు సంబంధమైంది కనుక సంధించిన తర్వాత వ్యర్థంగా పోదు. సార్థకంగా లక్ష్యాన్ని భేదించిన తర్వాతే శాంతిస్తుంది. దేనిని ఖండించాలో చెప్పు" అంటాడు.

         ఆ మాటలకు పరశురాముడు జడపదార్థమై, వీర్య విహీనుడై, బొమ్మలాగా శ్రీరామచంద్రమూర్తిని చూడసాగాడు. శ్రీరామచంద్రుడి తేజంతో, పరాక్రమం నశించి, బలం పోయి, జడుడైన పరశురాముడు, మునుపటిలా కాకుండా, గౌరవంతో మెల్లగా ఇలా అన్నాడు రాముడితో.

         "పుండరీకాక్షా, మహానుభావా, నా నడకను నరకొద్దు. నా తపస్సుతో నేను సంపాదించుకున్న పుణ్య లోకాలను నీ బాణంతో ధ్వంసం చేయి. ఆ పుణ్యలోకాల అనుభవం నాకు లేకుండా చేయి. అజ్ఞానంతో, తెలివిలేక, నీ సత్తా తెలుసుకోలేక తప్పుచేసాను. ఎప్పుడైతే నువ్వు నా చేతిలో వున్న విల్లు లాక్కొని బాణం సంధించావో, అప్పుడే, ఇతరులకెవరికీ సాధ్యంకాని పని నువ్వు చేసావనుకున్నాను. కాబట్టి నువ్వు నిర్వికారుడవు, అపరాజితుడవు, శ్రీమన్నారాయణుడివి అని తెలుసుకున్నాను. నేను తెలివి మరిచి అపరాధం చేసాను. క్షమించు. నీకు శుభం జరగాలి. నువ్వు ముల్లోకాలను పాలించే ముఖ్యదేవుడివి. అసమానమైన వ్యర్థంగాని నీ బాణాన్ని విడువు. నా కీర్తి నాశనం కావడం-గతులు తప్పడం కళ్లారా చూసి, సమయం దాటకుండా మహేంద్ర పర్వతానికి పోతాను". పరశురాముడిలా చెప్పగానే, రామచంద్రమూర్తి బాణాన్ని విడవడంతో, తన పుణ్య గతులన్నీ దగ్దమై పోవడం చూసి, ఆయనకు ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి పోయాడు.

పరమార్థ జ్ఞానం దేవతలు క్రియా రూపంగా తెలిపేందుకు బ్రహ్మ శివకేశవుల మధ్య పరస్పర ద్వేషం కలిగించి యుద్ధం చేయించాడు. ఒకరు చూసి చెప్పినదానిలా కాకుండా, కళ్లార చూసి, ఎవరెక్కువ బలవంతులో దేవతలు స్వయంగా తెలుసుకున్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా, విష్ణువు ఎక్కువా, శివుడెక్కువా అని, తత్పక్షపాతులు విరివిగా గ్రంథాలు రాసారు. శివ కేశవులకు భేదం లేదని పురాణాలు ఘోషించాయి. భగవంతుడు, జనార్ధనుడు ఒకడే. సృష్టి, స్థితి, లయం చేసేందుకు బ్రహ్మని, విష్ణువని, శివుడని పేర్లు పెట్టుకున్నాడు. విష్ణువు అధికుడని దేవతలు గ్రహించారని పరశురాముడు శ్రీరాముడికి చెప్పాడు. అది వాస్తవం కాదు. ఇక పొతే, శ్రీరామావతారం పూర్ణావతారం. పరశురామ అవతారం, రామావతారంలో కలిస్తే, తక్కువ తేజస్సు, ఎక్కువ తేజస్సులో కలిసిపోతుంది. పరశురాముడిలోని వైష్ణవ తేజం బయటికొచ్చి దేవతలందరు చూస్తుండగా శ్రీరాముడిలో ప్రవేశించింది. 
(వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)

No comments:

Post a Comment