Wednesday, April 15, 2020

అహల్య శిలగా మారిందా? ..... వనం జ్వాలా నరసింహారావు


అహల్య శిలగా మారిందా?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ గురువారం చింతన (16-04-2020)
అహల్యా వృత్తాంతం ఇతర రామాయణాలకన్నా వాల్మీకి రామాయణంలో భిన్నంగా వుంటుంది. అహల్య శిలగా మారిందని కొన్ని గ్రంథాలలో చెప్పబడిన విషయం వాస్తవం కాదని వాల్మీకి రామాయణం స్పష్టం చేసింది. వాల్మీకి మతమే వేరు. దుఃఖానుభవం లేకుండా, రాయిగా పడి వుంటే, పాప ఫలం అనుభవించినట్లెలా అవుతుంది? అహల్య స్త్రీగా వుంటూనే, ఆహారం లేకుండా తాపంలో మాడుతుంటుంది. రామచంద్రమూర్తి ఆశ్రమ ప్రవేశం చేయగానే ఆ తాపం తొలగి లోకానికి కనిపిస్తుంది. అంటే, జారత్వ దోషం పోవాలంటే, అనేక సంవత్సరాలు తపించి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి. అలా కాకపోతే వంశ నాశనం అవుతుంది. గౌతముడు అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. జారత్వమే అభ్యాసంగా వుంటే, ఆ స్త్రీని పతితగా భావించి స్వీకరించ కూడదు, పరిత్యజించాలి. స్త్రీలు తమ జాతివారితో వ్యభిచరించినప్పటికీ, గర్భం రాకపోతే పరిత్యజించ రాదు. అంటే, గర్భం వచ్చినా, అసవర్ణులతో వ్యభిచరించినా, వదిలి పెట్టాలి. గర్భం ధరించకపోతే, న్యాయ శాస్త్ర ప్రకారం దండించి ప్రాయశ్చిత్తం చేయించాలి. వివరాల్లోకి పోతే.....

తాటక లాంటి రాక్షసులను వధించి, విశ్వామిత్రుడి యాగాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి అహర్నిశలూ సంరక్షణలో వుంది, ఆ తరువాత ముని ఆజ్ఞానుసారం మిథిలా పురాన్ని చూడడానికి బయల్దేరిన రామలక్ష్మణులు దాన్ని దూరం నుండే చూసి, దాని అందాన్ని మెచ్చుకుంటూ పోతుండగా, ఆ నగరానికి దగ్గర లోనే ఓ చక్కటి మరో ఆశ్రమ ప్రదేశాన్ని చూసారు.

అక్కడున్న ఆశ్రమం ఎవరిదని, చూడడానికి అందంగా వున్నప్పటికీ ఎందుకని జనహీనమైందని అడుగుతాడు రాముడు విశ్వామిత్రుడిని. ఆశ్రమం అలా కావడానికి కారణాన్ని, ఆశ్రమ వృత్తాంతాన్ని వివరించాడీవిధంగా విశ్వామిత్రుడు:

"పూర్వం ఇక్కడ బ్రహ్మ సమానుడైన గౌతమ మహర్షి వుండేవాడు. గౌతముడు తన భార్య అహల్యతో అనేక సంవత్సరాలిక్కడ వుండి తపస్సు చేశాడు. ఒకనాడు సమయం కనిపెట్టి, గౌతముడివలె ముని వేషంలో అహల్యను కలుస్తాడు ఇంద్రుడు. మన్మథుడి ప్రేరణవల్ల విశేష మోహం కలిగి, ఆ సమయం స్త్రీలతో సంభోగించించే ఋతుకాలం కాకపోయినా, అహల్యతో రతి కేళికై కోరిక గలిగి వచ్చానని గౌతముడి వేషంలో వున్న ఇంద్రుడు అహల్యతో అంటాడు”.

“తన దగ్గరకు వచ్చినవాడు ఇంద్రుడని తెలిసినా, వాడితో రమించడం పాపమని తెలిసినా, ఇంద్రుడంతటివాడు వచ్చి ప్రార్థిస్తుంటే, ఎందుకు కాదనాలని భావించి, దుష్ట బుద్ధితో అతడితో సంభోగించింది అహల్య. ఆ తర్వాత సంతోషంతో, అయిందేదో అయిందనీ, ఇక ఆయనను కాపాడుకుని, తన్ను కూడా కాపాడమని ఇంద్రుడితో అంటుంది అహల్య. అలాంటి గొప్పవాడితో సంభోగించడం వల్ల ధన్యురాలనైనానని అంటూ, త్వరగా ఇంద్రుడిని అక్కడనుండి వెళ్లమనడంతో, భయపడొద్దని చెప్పి ఇంద్రుడు వెళ్లిపోయేందుకు తయారయ్యాడు”.


“అదే సమయంలో, కుడిచేత్తో దర్భలు-ఎడమ చేత్తో సమిధలు ధరించి, తీర్థ స్నానం చేసి, తడి బట్టలతో-బ్రహ్మ వర్చస్సుతో-దేవదానవులు సహించలేని తేజంతో ఆశ్రమానికొచ్చిన గౌతముడు ఎదురయ్యాడు ఇంద్రుడికి. ఆయన్ను చూడగానే, తత్తర పాటుతో, చేష్టలుడిగి, కాళ్లు చేతులు వణుకుతుంటే, తెల్లబోయిన ముఖంతో, తన ఆకారాన్ని ధరించి నిలిచిపోయాడు ఇంద్రుడు. గౌతముడికి కోపం తారాస్థాయికి చేరుకుంది".

"తన రూపాన్ని ధరించి, చేయరాని కార్యాన్ని చేసేందుకు సాహసించిన ఇంద్రుడు భవిష్యత్ లో ఇలాంటి పాడు పనులు చేయకుండా, ఆయన వృషణాలు వూడి నేలపై పడాలని శపించాడు గౌతముడు. తక్షణమే, ఇంద్రుడి వృషణాలు వూడి నేల రాలాయి. గౌతముడు ఆ తర్వాత ఇంట్లోకి పోయి భార్య అహల్యను చూసి, కోపంతో ఆమెనుకూడా శపించాడు. నీచ నడవడిగలిగినందున, అనేక సంవత్సరాలు గాలినే ఆహారంగా తీసుకుంటూ, కూడు-నీళ్లు లేకుండా, ఆ ప్రదేశంలోనే వుంటూ, బూడిదలో పడి ఎవరికీ కనిపించకుండా, తాపంతో పొర్లాడుతుండమని శపించాడామెను”.

“శాప విముక్తి కూడా గౌతముడే చెప్పాడు. ఎప్పుడైతే దశరథుడి కుమారుడు రాముడు, ఆశ్రమానికి రావడం జరుగుతుందో, ఆ రోజున ఆమే పాపం పోయి పవిత్రురాలవుతుందనంటాడు గౌతముడు. రాముడిక్కడికి రాగానే, ఆయనను అతిథిగా ఎంచి, అతిథికి చేయాల్సిన పూజలు చేసి, కుబుద్ధీ, లోభం, మోహం పోయినదానివై, ఎప్పటి అందమైన ఆకారం ధరించి, సంతోషంగా తన దగ్గరకొస్తావని చెప్పి గౌతముడు ఆశ్రమాన్ని వదిలి హిమవంతానికి పోయాడు" అని ఆ వృత్తాంతాన్ని వివరించాడు విశ్వామిత్రుడు.

"వృషణ హీనుడైన ఇంద్రుడు, దేవతల పురోహితుడైన అగ్ని దేవుడితో సహా ఇతర దేవతలందరితో తనీ స్థితికెందుకెందుకు రావలసి వచ్చిందో చెప్పాడు. గౌతముడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కోపాన్ని జయించాడా, లేదా, అని పరీక్షించేందుకు, అతడికి కోపాతిశయం కలిగించేట్లు తపస్సును చెడగొట్టానని అంటాడు. ఇలా తను చేసిన దేవతా కార్యానికి ప్రతిఫలంగా గౌతముడు, తనను బీజహీనుడివి కమ్మని శపించాడన్నాడు. భార్యపైకూడా కోపమొచ్చి, ఆమెనూ శపించి, వదిలిపెట్టి, తపస్సును వ్యర్థంచేసుకున్నాడు గౌతముడు అనికూడా చెప్పాడు ఇంద్రుడు. దేవకార్యం చేసిన తనకీగతి పట్టింది కాబట్టి, తిరిగి తన వృషణాలొచ్చే ఉపాయం చేయమని వారందరినీ కోరాడు”.

“ఇంద్రుడిలా వారినికోరడంతో, అగ్ని మొదలైన దేవతలు, మరుద్గణం, పితృదేవతలతో, వృషణాలులేని ఇంద్రుడికి మేక అండాలనిచ్చి బీజయుతుడిగా చేయమని ప్రార్థించారు. యజ్ఞంలో మనుష్యులు వృషహీణమైన మేక మాంసాన్ని ఇస్తే, దాంతో తృప్తిచెంది, యజ్ఞఫలానికి హానిరాకుండా చేయమనికూడా అంటారు వారు. దేవతలు కోరినట్లు పితృదేవతలు, మేక బీజాలు తీసి, ఇంద్రుడికి తగిలించారు. ఆ రోజునుంచి, బీజాలు లేని మేకమాంసాన్ని యజ్ఞంలో భుజించి, యజ్ఞం చేసినవారికి యాగఫలాన్ని విశేషంగా ఇవ్వసాగారు. గౌతమమహర్షి తపోబలం వల్ల, నాటినుండి ఇంద్రుడు మేఘవృషణుడు అయ్యాడు"అని చెప్పిన విశ్వామిత్రుడు, గౌతముడి ఆశ్రమంలో ప్రవేశించి, అహల్యను ఉద్ధరించేలా సంకల్పించమని శ్రీరాముడిని కోరాడు.

విశ్వామిత్రుడిలా చెప్పడంతో, లక్ష్మణుడితో కలిసి రామచంద్రమూర్తి, విశ్వామిత్రుడు ముందు నడవగా, గౌతముడి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. తపస్సునే భాగ్యంగా కలిగున్నదాన్ని, గొప్ప తపస్సు చేయడం వల్ల అతిశయించిన తేజస్సు కలిగిన దాన్ని, దేవ, దాన, మానవులకింతవరకు కనిపించని దాన్ని, మనుష్యులలో ఎవరికీ లేని సౌందర్యం కలదిగా బ్రహ్మ మాయతో సృష్టించబడిన దాన్ని, మంచు కప్పి, మబ్బు కమ్మినా చంద్రకాంతిలా వున్నదాన్ని, నీటిలో కనిపిస్తున్న సూర్యుడిని ఎండలా చూడడం సాధ్యంకాని రీతిలో వున్నదాన్ని అక్కడ చూశాడు శ్రీరాముడు.

ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించగానే, శాపం తొలిగిన అహల్య, పూర్వరూపంలో లోకానికి కనపడింది. శ్రీరామ లక్ష్మణులు ఆమెకు నమస్కరించారు. వారు అవతారమూర్తులని గౌతముడు తనకు శాపమిస్తున్నప్పుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకున్న అహల్య, పూజ్యులైన వారికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చింది. రామచంద్రమూర్తి అవి తీసుకుంటున్నప్పుడు దేవతలు దుందుభులు మోగించి, మేలు-మేలని అహల్యను మెచ్చుకున్నారు. ఇలా, శ్రీరామానుగ్రహం వల్లా, ఇంతకాలం తపస్సు చేసినందున పరిశుద్ధురాలైనందు వల్లా, గౌతముడు ఆమెను పరిగ్రహించి శ్రీరాముడిని పూజించాడు. మునీశ్వరుడి పూజలందుకున్న రామచంద్రమూర్తి ప్రయాణానికి బయల్దేరాడు.
(వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment