Saturday, January 7, 2023

అప్పటి కాంగ్రెస్ ఏదీ? : వనం జ్వాలా నరసింహారావు

 అప్పటి కాంగ్రెస్ ఏదీ?

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (08-01-2023)

         (దేశాన్ని ఏకచ్చత్రాదిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ గత దశాబ్దపు కాలంగా బాగా బలహీనపడుతున్నట్లు వివిధ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. సామ్యవాద, లౌకిక విధానాలను అమలు పరిచే కారణంతో పనిచేసిన అలనాటి కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటి పార్టీకి ఎంత తేడా? అసలప్పటి కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగిలి వుందా? మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి జవసత్త్వాలు తేగలరా? తేనిస్తారా?-ఎడిటర్)

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీయేనా అని అనిప్స్తున్నది. పాత కాంగ్రెస్ లో నిర్ణయాలు మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీసుకున్నవైనప్పటికీ, సంఖ్యా పరంగా మైనార్టీ ఆలోచనలను, సూచనలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎలా గౌరవించేవారు అనే విషయం భోధ పడుతుతుంది. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగినప్పటినుంచికూడా, మోడరేట్లనీ, అతివాదులనీ భిన్నాభిప్రాయాలవారున్నప్పటికి, స్వాతంత్ర్య సాధన ధ్యేయం, లక్ష్యంతో కలిసిమెలిసి పనిచేసేవారు. స్వాతంత్ర్యం వచ్చిన పిదప కూడా కాంగ్రెస్ పార్టీలోని అతివాద, మితవాద భిన్నాభిప్రాయాలవారందరు కలివిడిగా జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో పనిచేశారు.

సామ్యవాద, లౌకిక సిద్ధాంతాలను గౌరవించే నెహ్రూ, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పాలన చేసిన నెహ్రూ, పార్టీలోని మితవాద భావాల వారినుండి అడపాదడపా ఎదురైన ప్రతిఘటనలను చాకచక్యంగా అధిగమించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. పార్టీని పటిష్టంగా నడిపించారు. నాటి పరిస్థితుల్లో పార్టీపరంగా ఆయన అవలంబించిన మధ్యేమార్గం చక్కగా పనిచేసింది. ఆయన మరణానంతరం, పార్టీలోని బలీయమైన మైనార్టీ మితవాద, సామ్యవాద వ్యతిరేక, లౌకిక వ్యతిరేక శక్తులు, అభివృద్ధి మార్గాన్ననుసరిస్తున్న నాటి ప్రధాన మంత్రికి అడ్డంకులు, అవరోధాలు కలిగించడంతో, భారత జాతీయ కాంగ్రెస్ లో చీలి కొచ్చి, దరిమిలా కాంగ్రెస్ (ఐ) ఆవిర్భవించి, చాలా కాలందాకా దేశ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని, గెలుపు-ఓటములను ఎదుర్కొని చివరకు 137 సంవత్సరాల తరువాత తన మనుగడే ప్రశ్నార్థకం చేసుకుంది. సామ్యవాద, లౌకికవాద విధానాలను గట్టిగా సమర్ధించక పోవడమే దీనికి కారణమా? మేధోమధనం చేసుకోవాల్సిన విషయమే అనాలి.

భారత జాతీయ కాంగ్రెస్ లో విభేదాలు, చీలికలు అనాదిగా వస్తున్నవే. 1907 లో అతివాద భావాల వారికి నాయకత్వం వహిస్తున్న బాలగంగాధర తిలక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికకావడం ఇష్టపడని మాడరేట్లు, రాష్ బిహారీ ఘోష్ కు నాయకత్వం అంటగట్టారు. పాతతరం నాయకత్వమని, కొత్తతరం నాయకత్వమని, రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అతివాద భావాల వారు వేరుకుంపటి పెట్టుకున్నారు. ఏడెనిమిది సంవత్సరాల వరకు పార్టీపై మాడరేట్లే ఆధిపత్యం సాగింది. దరిమిలా అతివాదులుగా ముద్రపడిన వారంతా మాతృసంస్థైన కాంగ్రెస్ లో తిరిగి చేరడంతో, నాయకత్వంలో కూడా మార్పులు-చేర్పులు చోటుచేసుకోవడం ఆరంభమయింది.

స్వాతంత్ర్యోద్యమ కాలంలోను, జవహర్లాల్ నెహ్రూ హయాంలోను, సామాజిక, ఆర్థిక, విధానపరమైన విషయాలలో భేదాభిప్రాయాలు, భిన్న ధృక్ఫధాలున్నవారు అనేకమంది వున్నప్పటికీ, వారంతా కాంగ్రెస్ గొడుగు కింద పనిచేసి, ఐకమత్యంగా పార్టీ బలపడేందుకు ఉమ్మడిగా కృషిచేశారు. నాలుగో సాధారణ ఎన్నికలనంతరం, ముఖ్యంగా 1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత, దేశ రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ లోపలా, వెలుపలా, తరచూ, ‘అతివాద-మితవాద’ శక్తుల, వ్యక్తుల ప్రస్తావన రావడం ఆరంభమయింది. ఈ సంఘర్షణ అన్ని పార్టీలలోనూ మొదలైంది.

ఆ రోజుల్లో ‘సిండికేట్’ గా సంబోధించబడే కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్ కె పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు), కామరాజ్ నాడార్, సంజీవరెడ్డి లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. బాంకులను జాతీయం చేయడాన్ని అతివాదులు మద్దతిస్తే, సిండికేట్ వర్గం వ్యతిరేకించింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న వర్గం, ‘సామ్యవాద-లౌకికవాద’ విధానాలకు సిండికేట్ వర్గం వ్యతిరేకమనే భావనకొచ్చారు.

ఈ నేపధ్యంలో ఇందిరాగాంధి సూచించిన వివి గిరి పేరును గానీ, జగజీవన్ రాం పేరును గానీ పరిగణలోకి తీసుకోకుండా నీలం సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాడు నిజలింగప్ప.  తను సూచించిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తిని పార్లమెంటరీ బోర్డ్ ఎంపిక చేయడాన్ని, దాని వెనుక నున్న ఉద్దేశాన్ని తప్పుబట్టింది ఇందిరాగాంధి. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన విషయంలో ఏకాభిప్రాయం ముఖ్యమని తేల్చిచెప్పిందామె. భవిష్యత్ లో తాను తీసుకోదలచిన ఆర్థికపరమైన విధానాల అమలు బాధ్యతను మొరార్జీ మీద మోపలేనంటూ ఆయన్ను ఆర్థిక శాఖనుంచి తొలగించింది. మొరార్జీ రాజీనామా చేశాడు. జులై 19, 196914 భారీ వాణిజ్య బాంకులను జాతీయం చేయాలని ఇందిరాగాంధి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీస్తే, వామపక్షాల సంపూర్ణ మద్దతు లభించిందామెకు.

వి వి గిరి స్వతంత్ర అభ్యర్థిగా, వామ పక్షాల మద్దతుతో, రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్న నిజలింగప్ప, తమ పార్టీ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్న స్వతంత్ర, జనసంఘ్ (ఒకప్పటి భారతీయ జనతా పార్టీ) పార్టీల నాయకులకు, సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపట్టింది ఇందిరాగాంధి. ఆమె పక్షాన ఫకృద్దీన్ అలీ అహ్మద్, జగ్జీవన్ రాం కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్, శాసనసభ సభ్యుల ఓటర్లకు ఆత్మ ప్రబోధం మేరకు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయమని పిలుపివ్వడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వున్న కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఇందిరాగాంధి ఆగస్ట్ 18, 1969 న లేఖ పంపుతూ, ‘సరళీకృత, సామ్యవాద, ఆర్థిక సంస్కరణలను తేవాలని, అమలుచేయాలని అనుకున్నప్పుడల్లా, స్వప్రయోజన పరులు వాటిని వ్యతిరేకిస్తుంటారు’ అని పేర్కొని, వారందరి మద్దతు కోరింది. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేశారని జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లకు కాంగ్రెస్ అధ్యక్షుడు నోటీసులు పంపాడు. అధ్యక్షుడిచ్చిన నోటీసును వారు సవాలు చేశారు. వి వి గిరి రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో పార్టీపై ఇందిరాగాంధీకి వున్న ఆధిక్యత ఋజువైంది.

లౌకిక వాదం మీద, ప్రజాస్వామ్యం మీద, సామ్యవాద సిద్ధాంతాల మీద నమ్మకం వున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపిచ్చింది ఇందిరాగాంధి. దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రూల అడుగుజాడల్లో పనిచేస్తుందని, దేశాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్తూ దేశవ్యాప్తంగా పర్యటించింది ఇందిరాగాంధి. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఇందిరాగాంధి మద్దతుదారుడైన సి సుబ్రహ్మణ్యం రాజీనామా చేయడంతో, దాన్ని సాకుగా చూపి, ఆయన్ను వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగే విషయంలో పేచీ పెట్టాడు నిజలింగప్ప. నిజలింగప్ప తీసుకుంటున్న చర్యలు ఐక్యతా ఒప్పందానికి విరుద్ధమైన వని పేర్కొంటూ, ఇందిరాగాంధి, వై బి చవాన్, జగ్జీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్, ఉమాశంకర్ దీక్షిత్, సి సుబ్రహ్మణ్యంలు సంయుక్తంగా లేఖను అధ్యక్షుడికి పంపారు.

ఆ లేఖలో, సామ్యవాద, లౌకిక, అభివృద్ధికర విధానాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు జరిపేందుకు పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనీ, అందుకు పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలనీ, అధ్యక్ష ఎన్నిక జరగాలనీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడానికి ఒకరోజు ముందర, నవంబర్ 1, 1969, సి సుబ్రహ్మణ్యం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లను సభ్యులుగా తొలగిస్తూ నిజలింగప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో, ఇందిరాగాంధి మద్దతు దార్లు సమావేశానికి హాజరు కాకుండా, ఇందిరాగాంధి ఇంట్లో సమావేశమయ్యారు. నవంబర్ 12న ఇందిరాగాంధిని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్టడంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. ఇందిరాగాంధి మద్దతు దారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తప్పుబట్టి, నవంబర్ చివరి వారంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించి, సి సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది.

ఎమర్జెన్సీ అనంతరం మార్చ్ 201977 న జరిగిన ఎన్నికలలో ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందిరాగాంధీని ఆమె నియోజక వర్గంలోనుఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ఓటమితో కుంగిపోకుండా తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకునిపార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వారిలో సగం మందికి పైగా తన వెంట వుంచుకునిమరో మారు కాంగ్రెస్ పార్టీని చీల్చి, కాంగ్రెస్ (ఐ) ని స్థాపించింది. అచిరకాలంలోనే ప్రధాని పదవిని చేపట్టింది మళ్లీ. ఇప్పుడున్నది ఆమె చీల్చి స్థాపించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఐ) నే కాని స్వాతంత్ర్య కాలంనాటి అఖిలభారత కాంగ్రెస్ పార్టీ కాదంటే అతిశయోక్తి కాదేమో!

ఆ తరువాత రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, సీతారం కేసరి, సోనియా గాంధీ, రాహుల్ గాంధి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోకుండా కొంత మనుగడ సాధించినప్పటికీ పూర్వ వైభవాన్ని సంతరించుకోలేకపోయింది. క్రమేపీ క్షీణించ సాగింది. తెలుగురాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాలలో మొదటినించీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని దూరంగా పెట్టడమో, ఇతర పార్తీలవారిని చేర్చుకుని అందలం ఎక్కించడమో చేయడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయిపోయింది.    

ఏదెలావున్నా, సైద్ధాంతిక విభేదాలతో సామ్యవాద, లౌకిక, విధానాలను అమలు పరిచే కారణంతో పనిచేసిన అలనాటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి పార్టీకి ఎంత తేడా? అసలప్పటి కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగిలి వుందా? ఏదీ అప్పటి సామ్యవాద, లౌకిక కాంగ్రెస్ పార్టీ? హిమాచల్ ప్రదేశ్ లో ఆ పార్టీ గెలుపుతో ఇంకా కొంత ఆశ! ఎనిమిది పదుల వయసులో అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి జవస్వత్త్వాలు తేగలడా? తేనిస్తారా? పార్టీలో నిర్ణయాధికారం ఆయనదవుతుందా? గాంధీ-నెహ్రూ కుటుంబ వారసత్వం చేతిలోని అధిష్టానం అలా కానిస్తుందా? కోటిరూకల ప్రశ్న.

(ఏబైరెండు సంవత్సరాల క్రితం (1969-71), ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర, సమైక్య ఆంధ్ర ఉద్యమాల నేపధ్యంలో, నాగపూర్ విశ్వవిద్యాలయంలో నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న రోజులవి.  అప్పట్లో చాలామంది తెలుగువారు అక్కడే చదివేవారు. తెలుగువాడైన ఆచార్య వీఎస్ మూర్తిగారు (30 సంవత్సరాలుగా) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ప్రధాన అధ్యాపకుడు. ఆయన విద్యార్థులు అనేకమంది ఉన్నత పదవుల్లో పనిచేశారు. పదవీ విరమణ అనంతరం హైదరాబాద్ లో స్థిరపడి, ఇక్కడే మరణించారు మూర్తిగారు.

మూర్తిగారు తన క్లాస్ లో, సాధారణంగా, సమకాలీన, వర్తమాన, సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరిపాలనలకు సంబంధించిన విషయాలను భోదించడానికి, విద్యార్థులతో చర్చించడానికి ప్రాధాన్యతనిచ్చేవారు. ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా రాజకీయాలలో నిలదొక్కుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో సిండికేట్ గా పిలువబడే అతిరథ, మహారథులైన ఉద్దండ పిండాలను మట్టికరిపిస్తున్న రోజులవి. ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత పదవికి తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి వ్యతిరేకంగా తనపార్టీవారినే ఓటేయమని ఇందిరాగాంధి ప్రోత్సహించిన రోజులవి. మూర్తిగారి క్లాస్ లో రాష్ట్రపతి పదవి పూర్వాపరాలను, అధికారాలను, రాష్ట్రపతికి ప్రధానికి అభిప్రాయ భేదం వస్తే ఎలా అనే అంశాన్ని, రాజకీయాలలో సమీకరణలు గురించి నేర్చుకున్న రోజులవి. అప్పటి నోట్సు ఆధారంగా ఈ వ్యాసం).

No comments:

Post a Comment