Saturday, January 23, 2021

అంగదుడిది సుగ్రీవుడి మీద తిరుగుబాటా? : వనం జ్వాలా నరసింహారావు

 అంగదుడిది సుగ్రీవుడి మీద తిరుగుబాటా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (24-01-2021) ప్రసారం  

         సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడి ఆజ్ఞానుసారం పంపబడిన వానరులు భూమండలం అంతా వెతికి నెల గడువు తీరగానే తిరిగి వెనక్కు వచ్చారు. తూర్పు దిక్కుకు పోయిన వినతుడు, ఉత్తర దిక్కుకు పోయిన శతవలి, పశ్చిమ దిక్కుకు పోయిన సుషేణుడు నెలకాగానే మరలి వచ్చి ఎక్కడా సీత కనబడ లేదనీ, సీత జాడ లేదనీ చెప్పారు.

         ఇక హనుమంతుడు సీతాదేవిని తప్పక చూసే వస్తాడని ఆయన రాకకొరకై అందరూ వేచి చూస్తున్నారు. హనుమంతుడు సుగ్రీవుడు సూచించిన విధంగానే, అంగదుడితో, తారుడితో, ఇతరులతో కలిసి మొదలు వింధ్య పర్వతం దగ్గరకు పోయాడు. సీతాదేవి కొరకై అంతటా వెతికారు. సీత ఎక్కడా కనబడలేదు. ఎక్కడ కూడా సీతాదేవి కనబడక పోవడంతో వ్యసనపడుతూ ఒక చెట్టు కింద చేరి వుండడం చూసిన అంగదుడు, తానూ బడలికతో ఉన్నప్పటికీ, తనలాగే శ్రమపడిన వానరులను ఉత్సాహపరిచే మాటలు చెప్పాడు. మళ్లీ-మళ్లీ వెతుకుదాం అన్నాడు. అంగదుడి మాటలు విన్న వారంతా బడలిక తీరగానే మళ్లీ వింధ్య పర్వతం నాలుగు దిక్కులా వెతకసాగారు.

         అలా వెతుకుతుంటే ఋక్షబిలం అనే పేరుకల ఒక పెద్ద బిలాన్ని చూశారు వానరులు. అప్పుడు ఆంజనేయుడు అక్కడ నీళ్లున్న బావో, మడుగో వుండడం నిజం కాబట్టి లోపలికి పోదామన్నాడు. అంతా కలిసి ఆ బిలంలోకి ప్రవేశించి, ఒక ఆమడ దూరం దప్పికతో ప్రయాణం చేసిన తరువాత, వెలుతురున్న ఒక ప్రదేశాన్ని తినుబండారాలను వానరులు చూశారు.  వారంతా అలా-అలా వెతుకుతుంటే ఒక చోట నారచీరెలు, కృష్ణాజినం, వస్త్రంగా ధరించి తపస్సు చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది.

         అప్పుడు హనుమంతుడు ఆ ముసలిదాని దగ్గరికి పోయి, తమ ఆకలిదప్పుల విషయం చెప్పి, అక్కడున్న భోజన పదార్థాలు, పండ్లు, ఫలాలు, పుష్పాలు, పరిమళాల బంగారు చెట్లు, నిర్మల జలాలు, బంగారు కమలాలు, ఎవరి తపోమహిమవల్ల కలిగాయని అడిగాడు. ఆమె గురించి, ఆమె మహిమ గురించి ప్రశ్నించాడు. జవాబుగా స్వయంప్రభ అనే ఆమె ఇలా చెప్పింది.

“మాయలుకల రాక్షస ప్రభువైన మయుడు తన అద్భుత శక్తితో దీన్ని నిర్మించాడు. రమ్యమైన ఈ బంగారు గృహాన్ని నిర్మించినవాడు రాక్షసులకు విశ్వకర్మ అయిన దనుజ శ్రేష్టుడు. అతడు ఈ మనోహరమైన వనాన్ని కల్పించి ఇక్కడ వుండసాగాడు. దానవుడైన మయుడు దేవతాస్త్రీ అయిన హేమతో కలిసి వున్నందుకు కోపగించిన ఇంద్రుడు వజ్రధారతో అతడిని చంపాడు. ఆ మయుడు హేమకు ఈ బంగారు గృహాన్ని, వనాన్ని ఇచ్చాడు. ఇక్కడ సమస్త సుఖాలున్నాయి. ఆటపాటల్లో నేర్పరైన హేమకు నేను ప్రేమపాత్రమైన సఖిని. ఆమెదే యీవనం. ఆమెవల్ల నేను దీన్ని వరంగా పొంది దీన్ని రక్షిస్తున్నాను. నేను మెరుసావర్ణి కూతురును. నా పేరు స్వయంప్రభ. ఈ మూలాలు, ఫలాలు, ఇతర పదార్థాలు, పానీయాలు తృప్తి తీరా తినండి, తాగండి. శ్రమ తీరిన తరువాత మీ వృత్తాంతం చెప్పండి”.

హనుమంతుడు తమ చరిత్ర సమస్తం ఆమెకు వివరించాడు. తామొచ్చిన పని గురించీ చెప్పాడు. ఆమె ఇచ్చిన  ఫలమూలాలు తిని బడలిక తీర్చుకుని, తమను ఈ బిలం నుండి మళ్లీ భూమ్మీదకు చేర్చమన్నాడు. తన తపఃఫల బలంతో వానరులందరినీ నిమిషంలో బిలం నుండి దాటించింది ఆమె. వింధ్యపర్వతం దగ్గర ప్రస్రవణం అనే పెద్ద కొండదగ్గర దింపి స్వయంప్రభ వెళ్లిపోయింది. స్వయంప్రభ సర్వజ్ఞ అని అనుకోవాలి. ఆ కారణాన ఆమెకు భూత-భవిష్యత్-వర్తమానాలలో ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఎక్కడ వాళ్లను వదిలితే భవిష్యత్ కార్యం నెరవేరుతుందో అక్కడే, సముద్రతీరంలో విడిచిందని అర్థం చేసుకోవాలి.

          అప్పుడు అంగదుడు వానరులతో ఇలా అన్నాడు. “మీరంతా రాజుకు విశ్వాసపాత్రులైన సేవకులు. రాజాజ్ఞప్రకారం, రామకార్యం నెరవేర్చడానికి, నామీద ప్రేమతో నన్ను ముందుండే వాడిగా చేశారు. ముఖ్యుడిగా వుండడానికి నేను అంగీకరించి మీవెంట వచ్చాను. ఇంత చేసికూడా వచ్చినపని చేయకుండా మరలిపోతే సుగ్రీవుడు మనల్ని తునకలు-తునకలుగా నరుకుతాడు. ఇందులో సందేహం లేదు. సుగ్రీవాజ్ఞ నెరవేర్చకుండా బతికి సుఖపడేవాడు ఎవడు? నియమించిన గడువుకాలం దాటిపోయింది. మనం బాధపడి చేయగలింది ఏమీలేదు. కాబట్టి మనకిప్పుడు ప్రాయోపవేశం ఒక్కటే మార్గం అని తోస్తున్నది”.

         “సుగ్రీవుడు స్వభావసిద్ధంగా క్రూరుడు. దానికితోడు ఇప్పుడాయన రాజు. అధికార బలం వచ్చింది. రాముడి భార్య వార్త చెప్పకపోతే మనల్ని చంపుతాడు కాని క్షమించి వదలడు. కాబట్టి అక్కడికి పోయి చావడం కంటే ఇక్కడే చావడం మంచిది. మనమంతా మరలిపోతే, పోయిన వెంటనే చంపుతాడు. అక్కడికి పోయి అవమానపడి ఘోరమైన చావు చావడం కంటే ఇక్కడే చావడం మేలుకదా! నాకు యౌవరాజ్యం ఇచ్చినవాడు సుగ్రీవుడు కాదు. రామభద్రుడు. ఆయన ఆజ్ఞ మీరలేక తనకిష్టం లేకున్నా నన్ను యువరాజు చేశాడు. నామీద సద్గుణభద్రుడైన రామభద్రుడికి దయ వున్నదికాబట్టి నన్నప్పుడు ఏమీ చేయలేక వూరకున్నాడు. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ఆయన ఆజ్ఞ మీరానన్న నెపంతో నన్ను చంపుతాడు. అక్కడికి పోయి చావడం కంటే పుణ్యస్థలమైన ఈ సముద్రతీరంలో చావడం మేలు”

         అంగదుడిలా చెప్పడంతో భయపడుతున్న వానరులను చూసి తారుడు ఇలా అన్నాడు. “మీరెందుకు దుఃఖపడతారు. చావాల్సిన పనిలేదు. మనమంతా ఈ బిలంలో మళ్లీ ప్రవేశించుదాం. మనకు కావాల్సిన చెట్లు, తినడానికి భోజ్యాలు, కందమూలఫలాలు, పరిశుద్ధమైన వనం, పరిశుద్ధమైన నీరు అక్కడ వున్నాయి. అవేకదా మనకు కావాల్సింది. భయం మాట కూడా అక్కడ వినపడదు. అక్కడ మనముంటే సుగ్రీవుడే కాదు, ఇంద్రుడైనా, ఇంద్రసమానుడైన రామచంద్రుడైనా మనల్ని చేరలేడు”.

         కిష్కింధకు పోవాల్సిన పనిలేదు, ఇక్కడే వుందాం, అని అంగదుడు చెప్పిన మాటలకు అనుకూలంగా తారుడు చెప్పిన మాట విన్న వానరులందరూ ఎలా చేస్తే మనకు కీడు కలగదో అలాగే చేద్దామని అన్నారు. అంగదుడు, తారుడు ఇలా మాట్లాడడం, దానిని వానరులు ఆమోదించడం గమనించిన హనుమంతుడు, సుగ్రీవుడి రాజ్యాన్ని అంగదుడు హరించాడని భావించాడు. తారుడు చెప్పిన మాటలను అంగదుడు, ఇతరులు నిషేధించలేదు. అంటే వారందరూ బిలంలోకి ప్రవేశించి అక్కడో, బయట అడవులలోనో వానర రాజ్యం ఒకటి ఏర్పరుచుకుంటారు. అప్పుడు ఏకంగా వున్న వానర రాజ్యంలో ద్వైవిధ్యం పుటుతుంది. అప్పుడు సుగ్రీవుడి రాజ్యం చెడిపోతుంది. సుగ్రీవుడిని విభేదించేవారు, వాలి పక్షపాతులు ఇక్కడికి చేరుతారు. అదలా వుండగా ప్రారంభించిన రామకార్యం చెడిపోతుంది. ఈ విధంగా ఆలోచించ సాగాడు హనుమంతుడు.

         అంగదుడిని ఓదార్చడానికి హుమంతుడు పూనుకున్నాడు. “ఏమీ అంగదా! నువ్వీవానరులను నీ చేతికిందకు తీసుకుని ప్రత్యేక వానరరాజ్యం స్థాపించాలని ఉపాయంతో వున్నావా? ఎలా చేస్తావో నేనూ చూస్తాను. వీరంతా రామకార్యం కొరకు నీవెంట వచ్చారు కాని నీతోపాటు కలకాలం ఇక్కడ తమ ఇండ్లు-వాకిళ్లు, భార్య-బిడ్డలను వదిలి ఈ అడవిలో అల్లాడడానికి వచ్చారని అనుకుంటున్నావా? వీరంతా నీకు లోబడ్డారనుకో! అలాగైతే, నేనిప్పుడే పోయి రామలక్ష్మణులను, సుగ్రీవుడిని, తక్కిన సైన్యాన్ని మీ దురుద్దేశం చెప్పి ఇక్కడికి పిలుచుకొస్తాను. ఇప్పుడు మనం చేసింది అబుద్ధి పూర్వకాపరాధం. అప్పుడు మీరు చేయబోయేది రాజద్రోహం. బుద్ధిపూర్వకాపరాధం. కాబట్టి ఇప్పుడు దండం తప్పవచ్చు కాని అప్పుడు దండం తప్పదు. అప్పుడు నువ్వు, నీరాజ్యం ఏం కాబోతున్నదో ఆలోచించు”. అని కోపంగా, ఉపాయంగా, భయం కలిగేట్లు చెప్పి మళ్లీ సామమార్గంలో ఇలా చెప్పాడు.

         “అంగదా!నువ్వు యుద్ధంలో నీ తండ్రి కంటే నేర్పుకలవాడివి. కపిరాజ్యం అంతా తండ్రిలాగే భరించే శక్తికలవాడివి. అయినా ఒక్కటి ఆలోచించు. ఈ కోతులు ఎప్పటికీ చపల చిత్తులే. ఇప్పుడున్న బుద్ధి ఇంకాసేపటికి వుండదు. ఇలాంటి వీళ్లు తమ పెళ్లాలను, పిల్లలను, బంధువులను వదిలి కలకాలం ఇక్కడ నిన్నెందుకు కొలుస్తారు. ఇక్కడ వున్నవారంతా నీకు లోబడి వుంటారని అనుకుంటున్నావేమో? అది పొరపాటు. సుగ్రీవుడిని సుహోత్రుడు, నీలుడు, జాంబవంతుడు ఎలా వదలరో అలాగే నేనూ వదలను. నువ్విక్కడ నీ ప్రయత్నం మొదలు పెట్టగానే మేం సుగ్రీవుడి దగ్గరికి పోయి అంగదుడు ఇలా చేస్తున్నాడని చెప్పేవాళ్ళమే. వీరిని నువ్వు ఏవిధంగానైనా నీలో కలుపుకోలేవు. నువ్వు ఇంకోటి ఆలోచించడం లేదు. ఇక్కడ నీకున్న సేనకంటే అక్కడ సుగ్రీవుడికి ఎక్కువ సేనకలదని తెలుసుకో. మూడు భాగాలు అక్కడ వుంటే ఇక్కడ ఒక్క భాగం వుంది. కాబట్టి నీవల్ల సుగ్రీవుడికి భయం లేదు. బలవంతుడితో విభేదించి బలహీనుడు బతకగలడా?”

         “వానరులను నమ్మి నువ్వు పినతండ్రితో పగబూనినా, వీరు చివరిదాకా నీతో వుండకుండా వెళ్లిపోతారు. నువ్వొక్కడివే మిగులుతావు. నువ్వు బుద్ధిమంతుడివి. ఆలోచించి చూడు. వానరులు భార్యాబిడ్డలను తలచుకుంటూ, ఇక్కడ తినడానికి కందమూలాలు, తాగడానికి నీళ్లు లేక, దినమొక గండంగా శ్రమపడుతూ, దుఃఖస్థానమైన ఈ శయ్యలమీద, రాళ్లమీద, రప్పలమీద, నీలమీద, గడ్డిమీద ఎండనక-వాననక నిద్రిస్తూ, ఆ శ్రమపడలేక నిన్ను వదిలి వెళ్లిపోతారు. సుఖజీవనానికి, సుఖ శయ్యలకు, బంధువుల తోడుకు, అలవాటుపడ్డవారు ఈ ఘోరారణ్యాలలో నీకోసం ఎందుకు కష్టపడతారు? నీ మేలుగోరు బంధువులు, నీ స్నేహితులు, నిన్ను వదిలిపోగా నువ్వు ఒంటరివాడివై భయంతో గాలికి గడ్డిపోచ వణికినట్లు ఏ సమయంలో ఏమవుతుందో అని భయపడతావు. ఉత్తభయం మాత్రమే కాదు. నీకు కీడుకూడా కలుగుతుంది. నీ విరోధ బుద్ధి మానుకుని వినయంగా మా వెంట కిష్కింధకు రా. ఇదివరకులాగే నిన్ను నీ పినతండ్రి యువరాజుగా నియమిస్తాడు. నీమీద ఆయనకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన నిర్మలమైన మనస్సుకలవాడు. ప్రతిజ్ఞ తప్పనివాడు. నామాట నమ్ము. నీకెప్పుడూ సుగ్రీవుడు కీడుచేయడు. కాబట్టి యువరాజా! కిష్కింధకు పోదాం”.

         హనుమంతుడిలా సుగ్రీవుడిని ప్రశంసించి చెప్పగా తన మనసులో మాట మెల్లగా ఆయనకు చెప్పాడిలా. “తనపని చక్కపరిచి తన ప్రాణం కాపాడిన ఋజుమనస్కుడు రామచంద్రుడినే మరచిపోయినవాడు మరింకెవరి మేలు కోరగలడు? ఇది కృతఘ్నతకు దృష్టాంతం. ఇలాంటివాడు ధర్మమార్గంలో నడుస్తాడా? ఈ విధమైన చపల చిత్తుడుని, స్మృతిలేనివాడిని, పాపాత్ముడుని, కృతఘ్నుడుని సద్వంశంలో పుట్టి గౌరవంగా బతకాలనుకున్న వాడెవరూ నమ్మరు. ఆయన తనకొడుకుకు రాజ్యం ఇస్తాడు కాని విరోధి కొడుకైన నన్ను ప్రాణాలతో కూడా వుండనిస్తాడా? ఆయనకు ఇప్పుడు కొడుకుల్లేకపోయినా ముందు-ముందు పుట్టరని ఏమిటి? కాబట్టి నేను బతికితే రాజ్యం ఆశిస్తాడని నన్ను చంపుతాడు. నా మనసులో వున్న ఆలోచనంతా చెప్పాను. ఈ కారణాన నేను స్పష్టంగా అపరాధం చేసినట్లే. దీనుడిని. నా రక్షణలో శక్తిలేనివాడిని. కాబట్టి నేను జీవించి దిక్కులేనివాడిలాగా కిష్కింధలో ఎలా వుండగలను? ప్రాణం తీపికదా? సుగ్రీవుడు నేనెక్కడ రాజ్యానికి ప్రభువునైతానో అని నన్ను బతకనీయడు. అక్కడికి వచ్చి చెరసాలలో పడి చావడం కంటే ఇక్కడ ప్రాయోపవేశం చేయడం మేలు”.

అని చెప్పి అంగదుడు తోటి వానరులతో, “వానరులారా! మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీమీ ఇండ్లకు పోవచ్చు. ఆజ్ఞ ఇస్తున్నాను. నేను కిష్కింధకు రాను. నేను ఎలా జీవించి వుండగలను?” అని అంటూ, దర్భలు పరచి, వాటిమీద తూర్పు ముఖంగా కూర్చుని మరణమే మేలని నిశ్చయించుకున్నారు. రామచంద్రుడితో సహా అందరినీ తలచుకుంటూ, జటాయువు పేరెత్తాడు. ఏ ప్రదేశంలోనైతే వానరులు చావాలని నిర్ణయించారో, అక్కడే, జటాయువుకన్నా దీర్ఘకాలం జీవించివున్నవాడు, గద్దలకు రాజు, పర్వతగుహలో వున్నవాడు, సంపాతి బయటకు వచ్చి, వానరులందరినీ సంతోషంగా చూశాడు. ఆయన రాకతో అంగదుడి కథ ఒక మలుపు తిరిగింది.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

No comments:

Post a Comment