Saturday, January 23, 2021

హనుమంతుడికే ముద్రికనెందుకిచ్చాడు శ్రీరాముడు? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమంతుడికే ముద్రికనెందుకిచ్చాడు శ్రీరాముడు?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (23-01-2021) ప్రసారం   

         సీతాన్వేషణ చేయడానికి, శ్రీరాముడికి ఇచ్చిన మాట ప్రకారం వానర సేనను నలుమూలల నుండి రప్పించిన తరువాత, తాను రామచంద్రుడి కార్యం నేరవేర్చానని సంతోషించాడు సుగ్రీవుడు. అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడితో రామచంద్రమూర్తిని చూడడానికి పోదామా అని అడిగాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం అలాగే చేద్దామని అన్నాడు సుగ్రీవుడు. అంతా కలిసి రామచంద్రమూర్తి వున్న చోటుకు పోయారు. వానరసేనను చూసి రామచంద్రమూర్తి సుగ్రీవుడిని దయగా, ప్రేమగా పలకరించాడు.

         సుగ్రీవుడిని సంతోషంతో కౌగలించుకుని, ప్రేమతో ఇలా అన్నాడు. “సుగ్రీవా! ధర్మం, అర్థం, కామం అనేవాటిని వేర్వేరుగా భాగించుకుని, ఏఏ వేళల దేనిని అనుష్టించాల్నో తెల్సుకుని, ఒకటి చేసేటప్పుడు ఇంకొకటి చేయకుండా, దేన్నీ ఉపేక్షించకుండా వాటిని సేవించే వాడే రాజని కీర్తి వహిస్తాడు. (సుగ్రీవుడు ధర్మార్థాలను సేవించాల్సిన సమయంలో కామం అనుభవించాడని, అది రాజనీతి కాదని ఇక్కడ భావం). ధర్మాన్ని వదిలి, అర్థాన్ని మరిచి, ఎప్పుడూ కామంమీదే ఆసక్తికలవాడు చెట్టు కొనకొమ్మ మీద నిద్రపోయి, నేలమీద పడి మేల్కొన్నవాడితో సమానం. శత్రువులను చంపుతూ, స్నేహితులను సంపాదించుకుంటూ, హెచ్చరికగా ధర్మార్థ కామ ఫలాలను అనుభవించే రాజు ధర్మ మార్గంలో నడిచిన వాడవుతాడు. సుగ్రీవా! ఇది మన పనికోసం ప్రయత్నం చేయాల్సిన సమయం.  మంత్రులు, దండనాయకులు, ఇతరులతో ఇప్పుడే సభ ఏర్పాటుచేయి. ఎలా కార్యం ముందుకు తీసుకుపోవాలో ఆలోచిద్దాం”.

         రామచంద్రమూర్తి చెప్పిన మాటలకు జవాబుగా సుగ్రీవుడు ఇలా అన్నాడు. “రామచంద్రా! నాకు పోయిన మహైశ్వర్యం, వానర రాజ్యలక్ష్మి, గొప్ప కీర్తి, ఇవన్నీ నీ వల్ల, నీ తమ్ముడివల్ల, మీ ఇద్దరి అనుగ్రహం వల్ల, నాకు లభించాయి. ఇలాంటి నీకు ప్రత్యుపకారం చేయతలచనివాడు ఎల్లప్పుడూ నిందించతగిన వాడే. భూమండలంలోకల కోతులను, కొండముచ్చులను, ఎలుగులను, బలవంతులను పిలిపించాను. వీరంతా సాధారణమైన కోతులు కావు. కోరిన రూపం ధరించగలవారు. అడవి మార్గాలు తెల్సినవారు. తమతమ సేనలతో వందలు, వందవేలు, వంద లక్షలు, అయుతాలు, శంకువులు, అర్భుదాలు, ఖర్వాలు, మధ్యములు, అంతములు, సాగరములు, పరార్తాలుగా వస్తున్నారు. దుష్టుడైన రావణుడిని చంపి వీరు నీ భార్యను తెచ్చి నీకు సమర్పిస్తారు”. సుగ్రీవుడిలా చెప్పగా, ఆయన చేసిన యుద్ధ ప్రయత్నమంతా తెలుసుకుని, రామచంద్రమూర్తి సంతోషించాడు.

         ఇలా శ్రీరామ సుగ్రీవులు మాట్లాడుకుంటున్న సమయంలో వానరసేన భూమంతా నిండింది. పదివేల కోట్ల కోతులు కొలుస్తుంటే శతవలి వచ్చాడు. తారకు తండ్రైన సుషేషణుడు పదివేల కోట్ల సేన కొలుస్తుంటే వచ్చాడు. రుమ తండ్రైన తారుడు కోటి సహస్రాల కోతులతో వచ్చాడు. హనుమంతుడి తండ్రైన కేసరి వెయ్యి అనీకములు కొలుస్తుంటే వచ్చాడు. గవాక్షుడు కోటివేల కపులతో వచ్చాడు. రెండు కోట్ల ఎలుగులతో ధూమ్రుడు వచ్చాడు. పనసుడు మూడు కోట్ల కపులతో వచ్చాడు. నీలుడు పదికోట్ల కోతులతో, గవయుడు ఐదు కోట్ల వానరులతో వచ్చారు. వేయి కోట్ల కోతులతో దరీముఖుడు, మూడు కోట్లతో గజుడు, వేయి కోట్ల కోతులతో అశ్వినీ దేవతలా కుమారులు ద్వివిదుడు, మైందుడు, పదికోట్ల కోతులతో జాంబవంతుడు వచ్చారు. నూరుకోట్ల కపులు సేవిస్తుంటే రుమన్వంతుడు సుగ్రీవుడి ఆజ్ఞానుసారం ర్రామచంద్రుడి దగ్గరకు వచ్చాడు. నూరు వేల కోట్ల కోతులతో గంధమాదనుడు వచ్చాడు.

తారుడు ఐదు కోట్ల కోతులతో వచ్చాడు. తార కొడుకు అంగదుడు వేయి పద్మాలు, నూరు శంకువులు సంఖ్య కల కోతులతో వచ్చాడు. ఇంద్రజాను శూరుడు పదకొండు కోట్ల వానరులు కొలుస్తుంటే రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. పదివేల లక్షల కోతులు కొలవగా రంభుడు వచ్చాడు. రెండు కోట్ల కోతులు సేవిస్తుంటే దుర్ముఖుడు వచ్చాడు. వేయి కోట్ల కోతులు సేవిస్తుంటే హనుమంతుడు వచ్చాడు. నలుడు, వీరులైన ఇతర వానరులు శత లక్ష కోట్లతో, దదిముఖుడు పది కోట్ల వానరులతో, వహ్నికుముదుడు, రంహుడు, ఉగ్ర శరభుడు మొదలైన వానర సమూహాలు వచ్చాయి.

వీరు కాకుండా కొండల సమూహాల్లో, నదుల ఒడ్డులలో, అడవుల్లో వుండే వారు వచ్చారు. వారి సమాఖ్య ఇంత అని చెప్ప అలవికాదు. వచ్చిన వారందరినీ సుగ్రీవుడు వాళ్ల గురించి రామచంద్రుడికి తెలియచెప్పి, వారి క్షేమ సమాచారాలను విచారించాడు. వారిని వాళ్ల సేనలతో అడవుల్లో, కొండల్లో వుండమని ఆదేశించాడు. “ఈ సేన అంతా నీదే. నీ ఆజ్ఞకు లోబడి నీ ఆజ్ఞానుసారం నడచుకుంటారు. ఇక ఏమి చేయాలో సెలవివ్వు. ఇక్కడ వున్న వానరులు అప్పచెప్పిన పని చేయడానికి సమర్థులు. వీరందరినీ నేను ఎరుగుదును. అయినప్పటికీ నువ్వు ఆలోచించి తగిన విధంగా వీరితో పని చేయించుకో” అని సుగ్రీవుడు రాముడికి చెప్పాడు.

         రామచంద్రమూర్తి సుగ్రీవుడిని కౌగలించుకుని ఇలా అన్నాడు. “దశకంఠుని ఇంట్లో  సీతాదేవి బతికున్నదో, లేదో మొదట తెల్సుకోవాలి. ఆమె మరణించి వుంటే మనం ఏ ప్రయత్నం చేయలేం కదా? కాబట్టి రావణుడు వుండే ప్రదేశం, సీతాదేవి బతికున్నదా? లేదా? అనే విషయం, బతికుంటే ఎలా వుంది అనే సంగతి, తెలసిన తరువాతే నువ్వు చేయాల్సిన సహాయం గురించి చెప్తాను. కార్యమంతా నెరవేర్చడానికి నువ్వే సమర్థుడివి. ఎవరెవరిని ఎక్కడికి పంపాలో నువ్వే పంపించు.

రామచంద్రమూర్తి ఇలా సుగ్రీవుడికి చెప్పగానే, ఆయన రామలక్ష్మణుల ఎదుటనే, వినతుడిని శీఘ్రంగా పిలిచి లక్షల కొద్దీ వానరులు ఆయనను సేవిస్తుంటే, తూర్పు దిక్కుగా రావణాసురుడు వుండే స్థలం వెతకడానికి త్వరగా వెళ్లమని చెప్పాడు.     తూర్పుదిక్కున వెతకడానికి వానర శ్రేష్టులను పంపిన సుగ్రీవుడు ఆ తరువాత దక్షిణ దిక్కున వెతకడానికి సమర్థులైన అగ్ని కొడుకు నీలుడిని, హనుమంతుడిని, బ్రహ్మ కొడుకైన జాంబవంతుడిని, గజుడిని, సుహోత్రుడిని, గవయుడిని, శరారిని, శరగుల్ముడిని, సుషేణుడుని, ఋషభుడిని, గవాక్షుడిని, అశ్వనీ దేవతల కుమారులైన మైంద-ద్వివిదులను, గంధమాదనుడిని, విజయుడిని, ఉల్కాముఖుడిని, అంగదుడిని, తదితర ప్రసిద్ధ బలులను పంపాలని భావించి కొంత సేనను వారికంటే ముందుగానే దక్షిణ దిక్కుకు పంపాడు. వీళ్లందరినీ తన దగ్గరికి పిలిచి దక్షిణ దిక్కున కల కొండల, గుట్టల, అడవుల గురించి వివరంగా చెప్పాడు.

         హనుమంతుడిని, ఇతరులను దక్షిణ దిక్కుకు పొమ్మని ఆజ్ఞాపించిన సుగ్రీవుడు తన మామ, తారకు తండ్రైన, మహాబల పరాక్రమవంతుడు సుషేణుడిని పిలిచి ఆయనతో పాటు మరీచి మహర్షి కుమారుడిని, మారీచుడనే వాడిని, మిగతా మారీచులను, శూరులను చూసి వారితోపాటు రెండు లక్షల కోతులను తీసుకుని పశ్చిమ దిశగా పొమ్మన్నాడు. తన మామను పశ్చిమ దిక్కుగా పంపిన సుగ్రీవుడు శతవలిని ఉత్తర దిక్కుగా పొమ్మన్నాడు.

         ఈ విధంగా నలుదిక్కులకు పోయేవారికి చెప్పాల్సిన మాటలు చెప్పిన సుగ్రీవుడు హనుమంతుడిని చూసి, ఇతడివల్లే ఈ కార్యం సాధ్యమవుతుందని, ఇతడే ఈ పనిని సాధించగల సమర్థుడని ఆలోచించి, నిశ్చయించి, పరాక్రమశాలైన హనుమంతుడితో ఇలా అన్నాడు.

         “ఓ వానరసత్తమా! నీళ్లల్లో, నిప్పుల్లో, స్వర్గంలో, ఆకాశంలో, నీ గమనం అనివార్యం. నువ్వు పోవాలనుకుంటే అడ్డం రాగలది, ఆటంకపర్చగలది ఏదీ లేదు. ఇది నిశ్చయం. నాకు తెలుసు. అసురులతో, గంధర్వులతో, దేవతలతో, సర్పాలతో, మనుష్యులతో, కొండలతో, సముద్రంతో కూడిన ఈ సమస్త భూమండలంలో నీకు తెలియరానిది వుందా ఆంజనేయా? వేగంలో, తేజంలో, తేలికలో పోవడానికి, బలాతిశయం చూపడానికీ నువ్వు నీ తండ్రితో సమానం ఆంజనేయా! ఓ కపీశ్వరా! నీ అతిశయించిన తేజస్సును పోల్చి చూస్తే నీకు సమానమైన ప్రాణి ఈ భూమ్మీద లేదు. కాబట్టి హనుమంతా! రామచంద్రమూర్తి భార్యను సాధించి మరల తెచ్చే ఉపాయం ఏదో అది నువ్వే చేయాలి. నీకు తప్ప ఇతరులకు అది సాధ్యంకాదు”.

         హనుమంతుడు ఇంత బలశాలి, గొప్పవాడు అని సుగ్రీవుడికి తెలుసు కదా! ఎందుకు అతడిని వాలిమీదకు యుద్ధానికి పంపలేదు? హనుమంతుడు తనంతట తానే ఎందుకు వాలిని నిరోధించలేదు? ఇంత బలవంతుడు సహాయుడిగా వుండి కూడా ఎందుకు సుగ్రీవుడు కష్టపడ్డాడు? హనుమంతుడు సుగ్రీవుడి బంటు. స్వామి ఆజ్ఞ లేకుండా ఏదీ చేయకూడదు. తాను వాలిని జయించలేను, అని చెప్పి బంటు సహాయం కోరలేడు కదా! అలా కోరడం తనకు అవమానంగా సుగ్రీవుడు భావించి వుండవచ్చు. తనంతట తానే వాలిని నిరోధిస్తే అది సుగ్రీవుడిని అవమానించినట్లే. ఒక వేళ హనుమంతుడు సుగ్రీవుడి పక్షాన యుద్ధానికి వస్తే వాలి పక్షం వారంతా అతడిని ఎదిరించడానికి వస్తారు. ఆ పోరుకు అంతం ఎక్కడ? కాబట్టి అన్నదమ్ములే కొట్టుకుని చావనీ అని మిగతా వారంతా వూరుకున్నారు. హనుమంతుడికి కూడా తన బలం తనకు తెలియదు. స్వయంగా దేనికీ సాహసించడు. జాంబవంతుడి లాంటివారు వుండాలి ప్రోత్సహించడానికి. హనుమంతుడికి భయపడడం వల్లే వాలి సుగ్రీవుడిని భయపెట్టాడు కానీ చంపడానికి పూనుకోలేదు.

ఇలా సుగ్రీవుడు అంటుంటే రామచంద్రమూర్ర్తి, సుగ్రీవుడు కార్యభారాన్ని హనుమంతుడి మీద పెట్తున్నాడు కాబట్టి, ఈ అంజనేయుడే నిశ్చయించిన కార్యం చేసే శక్తికలవాడని భావించాడు. ఇలా భావించిన రామచంద్రమూర్తి  తన పేరు చెక్కబడిన బంగారపు ఉంగరాన్ని తన చేతిలో తీసుకున్నాడు. హనుమంతుడితో “వానరశ్రేష్టా! దీన్ని తీసుకునిపో. సీతకు చూపించు. ఇది చూపిస్తే నువ్వు నిజంగా నా దూతవేనని భయం లేకుండా నీతో మాట్లాడుతుంది. సుగ్రీవుడు అప్పచెప్పిన పని చేయగల సమర్థుడివి నువ్వే అని నాకు అనిపిస్తున్నది. ఈ కారణాన దీన్ని నీదగ్గర వుంచుకో” అని అన్నాడు.

రామచంద్రమూర్తికి ఈ ఉంగరం ఎక్కడినుండి వచ్చింది? సర్వం త్యజించిన వానప్రస్థుడు ఉంగరం దరించవచ్చా? అయితే, రామచంద్రమూర్తి వానప్రస్థాశ్రమం స్వీకరించలేదని అయోధ్యకాండలో చెప్పడం జరిగింది. కైకేయి కోరిక ప్రకారం నారచీరెలు ధరించాడే కాని, తక్కిన ఆశ్రమ చిహ్నాలను అనుష్టించలేదు. ఆ కారణాన ఉంగరం ధరించడం వల్ల వ్రతభంగం కలగలేదు. కాగల కార్యం ఆలోచించి సుబాహుడితో మారీచుడిని ఎందుకు చంపలేదో, అలాగే, ఈ ఉంగరాన్ని కూడా పరిత్యజించలేదు. కాని సొగసుకోసం వుంచుకోలేదు. ఇంకో విషయం....ఈ ఉంగరం సీత రామచంద్రమూర్తికి ఇచ్చింది. వివాహ సమయంలో వధూవరులు ఉంగరాలు మార్చుకునే ఆచారం ఇప్పటికీ వుంది. దాని విలువ మాత్రం కొంచెం చెడింది. ఈ ఉంగరాలను భర్త జీవించినంతకాలం భార్య, భార్య జీవించినంతకాలం భర్త విడవరాదు. స్త్రీలకు మంగళసూత్రం ఎలాగో, అలాగే, భర్తలకు ఈ ఉంగరం అలాంటిది. తక్కినవన్నీ త్యజించినప్పటికీ దీన్ని మాత్రం త్యజించకూడదు. దాన్ని త్యజించడం అంటే భార్యను త్యజించినట్లే. ఆ కారణాన రామచంద్రమూర్తి దాన్ని విడవకుండా ధరించాడు. సీతాదేవిని నమ్మించకలిగింది మరేదీ లేదు కనుక, తానిచ్చిన ఉంగరాన్ని, రాముడి వేలుకుండే ఉంగరాన్ని, సీత ఎప్పుడూ చూస్తుండే ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు.

శ్రీరాముడిలా చెప్పగా, హనుమంతుడు ఉంగరాన్ని తీసుకుని, శిరం మీద ధరించి, రెండు చేతులు జోడించి, రామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించి నిలబడ్డాడు. తరువాత ఆయనతో సహా వానరులు అందరూ భక్తితో, తమ ప్రభువు అజ్ఞానుసారం పెద్ద మిడతల దండులాగా భూమంతా ఆక్రమించుకుంటూ చాలా వేగంగా పోయారు. వానరులంతా ఎవరికీ వారే తామే సీతను వెతుకుతామనీ, సీతను వెతికి తెస్తామనీ కేకలు వేయసాగారు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment