Saturday, February 6, 2021

హనుమను అడ్డుకున్న సింహిక జలాంతర్గామా? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమను అడ్డుకున్న సింహిక జలాంతర్గామా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (06-02-2021) ప్రసారం

జాంబవంతుడి ప్రేరణతో వానరులతో కూడి హనుమంతుడు, లంకకు వెళ్లాలన్న సంకల్పంతో మహేంద్ర పర్వతాన్ని ఎక్కుతాడు. దానిని కార్యరూపంలోకి తేవడానికి సిద్ధపడ్డాడు హనుమంతుడు. రావణుడు అపహరించిన సీతాదేవిని లంకలో వెతికేందుకు ఆకాశ మార్గాన అక్కడకు ప్రయాణమవుతాడు. హనుమంతుడు తాను పయనించాల్సిన మార్గాన్ని ఒక సారి తేరిపార చూశాడు. హనుమంతుడు అత్యంత సుందరాకారుడిలాగా కనిపించాడప్పుడు. దీర్ఘంగా ఆలోచిస్తూ ముందుకూ, వెనుకకూ తిరుగుతాడు. పక్షులను బెదిరించాడు. జంతువులను అదిలించాడు. రొమ్ము, నుదురుతో తాకుతూ చెట్లను పడేశాడు. కొండను వూగేట్లు చేశాడు. విజృంభించిన సింహం మాదిరి సంచరించాడు. ఆ మహేంద్ర పర్వతంపైన హనుమంతుడు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రకాశించాడు.     

సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మకు, ఇతర దేవతలకు అణకువతో నమస్కరించి ప్రయాణానికి సన్నాహమవుతాడు హనుమంతుడు. సూర్యుడు ఆయనకు విద్యా గురువైనందున తొలుత నమస్కరిస్తాడు. రాక్షసులతో యుద్ధానికి పోతున్నాడు కాబట్టి రాక్షస విరోధి ఇంద్రుడికి ఆ తర్వాత నమస్కరిస్తాడు. బలం, వేగం కలగాలని తండ్రి వాయుదేవుడికి నమస్కరిస్తాడు. బ్రహ్మాస్త్రాల బాధ కలగకుండా వుండాలని బ్రహ్మదేవుడికి ప్రార్థనా పూర్వకంగా నమస్కరిస్తాడు. గురుదేవతలతో పాటు ప్రత్యక్షదేవతైన తండ్రికి నమస్కరించాలని భావించి దక్షిణ ముఖంగా వున్న హనుమంతుడు తూర్పు తిరిగి ఆ పని చేస్తాడు. వానరులందరూ చూస్తుండగా అంతు లేనంతగా తన దేహాన్ని పెంచాడు.

మితిమీరిన శరీరంతో, సముద్రాన్ని దాటుతున్నానన్న గర్వంతో, హనుమంతుడు రెండు చేతులతో, కాళ్లతో పర్వతాన్ని ఊగించాడు. కదలని ఆ పర్వతం హనుమంతుడి బలానికి చెదిరింది. ఆ ఉగిసలాటకు పర్వతం మీదున్న చెట్ల పూలు కొండ మీద రాలడంతో పర్వతం పూలకొండ మాదిరిగా అందంగా కనిపించింది. గడ-గడ వణకుతున్న ఆ కొండ గుహల్లోకి అడవి మృగాలు కలవరపడి ఏడ్చిన ధ్వనులు భూమ్యాకాశాలను దద్దరిల్ల చేసాయి. పర్వత చరియల్లోనూ, చుట్టుపక్కల ప్రదేశాలలోనూ, తిరుగాడే పాములు పడగలు విప్పి, కాటేస్తే అగ్నితో సమానమైన ఆ విషప్రభావానికి రాతిగుండ్లు వేయితునకలై ఎగిరిపడ్డాయి.

         ఆంజనేయుడు రామకార్యార్థమై, వానరార్థమై, పర్వతాకారంలో అసాధ్యమైన సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు పోయే ప్రయత్నంలో ఉన్నాడని సిద్ధులు, చారణులు, విద్యాధరాలకు చెప్పారు. సీతకై సముద్రాన్ని దాటడం కేవలం రాముడికొరకే కాదు, వానరుల ప్రాణ రక్షణ చేయడం కూడా వుంది. దేహాన్ని అమితంగా పెంచిన హనుమంతుడు ఒక్కసారిగా వళ్ళు విదిలించి, వెంట్రుకలు రాల్చి, వర్షాకాల మేఘం లాగా దిక్కులు పిక్కటిల్లేట్లు గర్జిస్తాడు. గరత్మంతుడు పామును విదిలించినట్లు తన తోకను విదిలించాడు. హనుమంతుడి తోక గరత్మంతుడు పట్టుకున్న పాములాగా ఆయన వీపుమీద మెరుస్తున్నదప్పుడు.

హనుమంతుడు సముద్రాన్ని దాటేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ఆక్కడున్న వానర ముఖ్యులతో, సంతోషంగా తన పౌరుషాన్ని, బలాన్ని తెలియచేస్తూ, వాయువేగ సమానమైన శ్రీరామ బాణంలాగా లంకలో ప్రవేశిస్తానంటాడు హనుమంతుడు. అక్కడ సీత కనిపించక పోతే, రావణుడిని బందించి తెస్తాననీ, ఏవిధంగా నైనా సీతను తోడ్కొని వస్తాననీ అంటాడు హనుమంతుడు. ఒక వేళ వెళ్లేది తానొక్కడే కనుక, సీతాదేవిని లంకలో వెతకడం ఆలశ్యమైతే, లంకనే ఇక్కడకు తెస్తానంటాడు. అడ్డమొస్తే రావణుడిని పాతిపెట్తానని కూడా చెప్తాడు. హనుమంతుడు వానరుల వద్ద సెలవు తీసుకుంటాడు.

         కపులవద్ద సెలవు తీసుకున్న హనుమంతుడు, చివాలున ఎగిరి వేగంగా పయనించడం ప్రారంభించాడు. చేతులు చాచి ఆకాశంలో దూసుకెళ్తున్న పంచముఖ ఆంజనేయుడు పర్వత గుహలోంచి తలబయటకు చాచి ప్రాకుతున్న "పంచశీర్షయివోరగమా" (ఐదు తలల పామా!) అన్నట్లున్నాడు. అలలతో నిండిన సముద్రాన్ని రివ్వున దాటి ఆకాశాన పోతున్న హనుమంతుడు, ఆకాశ, సాగరాలను తాగుతూ పోతున్నాడా అనిపించింది. హనుమంతుడాసమయంలో, పరివేశం మధ్యనున్న సూర్యుడిలాగా కనిపించాడు. హనుమంతుడు పయనిస్తున్న సాగరమార్గమంతా ఆయన తొడల వేగంతో తలక్రిందులై, తారుమారై, పిచ్చిపట్టిన దానిలాగా కనిపించింది. ఆకాశన్నంటుతున్న అలలను హనుమంతుడు తన దేహం నుండి వీస్తున్న గాలితో తన్నుకుంటూ పోసాగాడు.

         హనుమంతుడి కదలికతో సముద్రం కలవరపడింది. హనుమంతుడి ఉల్లంఘన వేగానికి సముద్రపు నీళ్లన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవడంతో, అందులో వుండే తాబేళ్లు, మొసళ్లు, చేపలు, ఇతర జలచరాలు, బయటకు కనిపించసాగాయి. రామకార్యం నిర్వహించటానికి అనువుగా, హనుమంతుడికి శ్రమ కలుగకుండా వుండేందుకు, వాయువు చల్లగా వీచింది.

          ఇదిలా వుండగా, సముద్రుడు, రామకార్యార్ధమై వెళ్తున్న హనుమంతుడికి ఏవిధంగా సాయపడగలనా అని ఆలోచిస్తాడు. పరాక్రమించి పోతున్న ఆంజనేయుడికి కష్టం కలుగకుండా చూడడమే మేలనుకుంటాడు. హనుమంతుడికి ఒకింత బడలిక తీర్చే ఉద్దేశ్యంతో, తనలో దాగివున్న మైనాక పర్వతాన్ని ఆపని కొరకు పురమాయిస్తాడు సముద్రుడు. హనుమంతుడు మనకు అతిథి, పూజ్యుడు. నీవు నీటిలోనుండి లేచి, ఆయనకు ఎదురేగి, బడలిక తీరేటట్లు నీనెత్తిన ధరించు. నీవిట్లా చేస్తే, ఆయనకు కొంత బడలిక తీరుతుంది. తక్కిన సముద్రాన్ని సులభంగా దాటిపోగలడు" అంటాడు మైనాకుడితో.

         సముద్రుడి మాటలకు స్పందించాడు మైనాకుడు. నీటిని రెండు భాగాలు చేసి పైకొచ్చాడు. తనదారికి అడ్డంగా నిల్చిన మైనాకుడిని గమనించి, హుంకరించి, ఆకాశమార్గంలోనే ఢీకొన్నాడు హనుమంతుడు. హనుమ దెబ్బకు, విలపిస్తూ, శోషిల్లి పడిపోయాడు మైనాకుడు. అయినా, ప్రీతిగా హనుమంతుడితో ఇలా అన్నాడు: “నాబంగారు శిఖరం మీద నీశ్రమ తగ్గేంత వరకు నిలిచి, ఆతర్వాత నీ ఇష్టమొచ్చినట్లు పో. సముద్రుడు నీమేలు కోరి నన్నెంచుకున్నాడు. శ్రీరామచంద్రమూర్తి కార్యార్ధివై పోతున్న నీకు సహాయపడాలని భావించాడు. నీవిక్కడ కాసేపాగి, ఫలాలు, కందమూలాలు తిని, అలసట తీరేవరకు విశ్రాంతి తీసుకో. తర్వాత మిగిలిన దూరాన్ని వేగంగా, సులభంగా, పోవచ్చు" అని మైనాకుడు హనుమంతుడితో విన్నవిస్తాడు.

మైనాకుడికి తనదైన శైలిలో జవాబిచ్చాడు హనుమంతుడు. "పర్వతోత్తమా, నీవు చేసే సత్కారాలు అంగీకరించినట్లే. నీ మంచి మాటలచేతనే సపర్యలు అంగీకరించినట్లయింది. ఆఫలం నీకు దక్కింది కూడా. నేను సంతోషించాను. నేనిక్కడ ఆగకూడదు. చేయాల్సిన పని చాలా వుంది. నేను ఎక్కడా ఆగననీ, రామబాణంలా వెళ్లి వస్తాననీ, పని చక్కబెట్టుకొస్తాననీ వానరులతో ప్రతిజ్ఞ కూడా చేసాను. నన్నాపవద్దు. కోప్పడవద్దు మిత్రమా!"అన్నాడు. పోయివస్తానని సెలవుతీసుకొని, మరింత వేగంగా, మరింత పైకెగిరి, సముద్ర మైనాకుల ఆశీర్వాదం పొందాడు.

         ఒంటరిగా సాహసించి పోతున్న హనుమంతుడు రావణుడిని ఎలాగెల్చి రాగలడని, దేవతలు, ఋషులు, సిధ్ధులు అనుకుంటారు. ఎలా సముద్రాన్ని దాటగలడన్న సందేహంతో, ఆయన బలాన్ని తెలుసుకోదల్చారు వారు. ఆ ఆలోచనతో, సూర్యకాంతిగల నాగమాత "సురస"ను సందేహ నివృత్తి కొరకు ఉపయోగించ దల్చారు. దైత్య స్త్రీగా పోయి వేగంగా సముద్రాన్ని దాటుతున్న హనుమంతుడికి అడ్డుపడి, ముహూర్తకాలం పాటు ఆలస్యం చేయమని సురసను కోరుతారు. సరేనని అంగీకరించిన సురస, భయంకరమైన పెద్ద వికార రూపాన్ని ధరించి ఆకాశంలో తిరుగుతూ, ఆంజనేయుడికడ్డుపడి, ఎదురునిల్చి, "ఎటుబోతున్నావు" అని ప్రశ్నిస్తుంది. "దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు. నన్ను దాటి నీవెక్కడకు పోలేవు. నానోట్లో చొరపడు. నిన్నుమింగుతా. నువ్వేం మాట్లాడినా నేనువినను" అంటుంది సురస. ఆమెతో విరోధానికి పోకుండా, రెండు చేతులెత్తి జోడించి, నమస్కరించి, తాను వెళ్తున్న పనిని వివరిస్తాడు హనుమంతుడు.

            తనకు చిక్కి ఆతడు ప్రాణాలతో తప్పించుకుని పోలేడనీ, అదితనకీయబడ్డ వరమనీ అంటూ సురస హనుమను అడ్డుకుంటుంది. అలా అంటూ నోరు తెర్చుకొని నిలబడ్తుంది. తన్ను మింగగల నోరు ఆమెకు లేదని తన దేహాన్ని పది ఆమడల నిడివిగా పెంచుతాడు హనుమంతుడు. సురస తన నోటిని ఇరవై ఆమడల నిడివిగా చేస్తుంది. హనుమంతుడు ముప్పై ఆమడలకు పెంచుతాడు. ఇలా ఇరువురూ పెన్చుకుంటూ పోతుంటారు. ఎప్పుడైతే సురస తన నోటిని నూరు ఆమడలకు పెన్చుతుందో, బుధ్ధిమంతుడైన హనుమంతుడు తక్షణమే తన దేహాన్ని చిన్నదిగా చేసాడు. అతి వేగంతో, సమర్ధతతో, హనుమంతుడు బొటన వేలంత రూపంలో, చటుక్కున సురస నోట్లో చొరబడి, అంతే వేగంతో, ఆమె నోరుమూసేలోపల, బయటపడి, ఆకాశంలో నిల్చి ఆమెకోరిక తీర్చానంటాడు.

సురస పోయినతర్వాత అలక్ష్యం చేయరాని సముద్రాన్ని వదిలి, గరుడ వేగంతో, ఆకాశానికి లంఘించి భయంకరంగా, హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. స్వర్గానికి వెళ్తున్న పుణ్యాత్ములు, దేవతలు భుజించే అన్నాన్ని తీసుకెళ్తున్న అగ్నిహోత్రుడు, చంద్ర-సూర్యది గ్రహాలు, చుక్కలు, అశ్వినీ మొదలైన నక్షత్రాలు, దేవ ఋషులు, దేవతలు, ఆకాశమార్గాన సంచరించే ఇతరులు, నాగులు, యక్షులు, దేవ గంధర్వులు, కిన్నరుల కలయికతో కూడిన బ్రహ్మ నిర్మిత ఆకాశమార్గాన, సూర్య-చంద్రులు పయనించే దారిని (ఖగోళ రహస్య సంచారమార్గం) కూడా దాటుకుంటూ ఏ ఆధారం లేకుండా దూసుకుపోతున్నాడు ఆంజనేయుడు.

         వేగంతో అతిశయించి పోతున్న హనుమంతుడిని చూసి, "సింహిక"అనే రాక్షసి హనుమంతుడి నీడను తన ఆకారంతో పట్టుకుంటుంది. ఎదురుగాలి తగిలిన పడవలాగా అయిందప్పుడు హనుమంతుడికి. వేగం తగ్గింది. ఓ భూతం సముద్రం నుండి లేవడం గమనించాడు. సముద్రంలో సరీగ్గా ఇదే చోట్లో, తన నీడను పట్టుకోబోయే అంగారక గ్రహం వున్నదని సుగ్రీవుడు తనకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు బుధ్ధిమంతుడైన హనుమంతుడు. వెంటనే భయంకరమైన కొండలాగా, శరీరాన్ని ఎత్తుగా, వెడల్పుగా పెంచుతాడు. అది చూసిన రాక్షసి పాతాళ గుహవంటి భయంకరమైన తన నోరు తెర్చి, మేఘం లాగా గర్జించి, సునాయాసంగా ఆంజనేయుడిని తినేద్దామని ముందుకొచ్చింది. అప్పుడాంజనేయుడు దాని శరీరాన్ని, విప్పిన నోటిని, మర్మ స్థానాలను, పరిశీలించసాగాడు.

         ఇలా పరిశీలించిన వెంటనే అదను చూసి, వజ్రం లాంటి దేహమున్న హనుమంతుడు, శరీరాన్ని చిన్నదిగా చేసి, దాని నోట్లో దూరాడు. దేవతలది చూసి ఆందోళన చెందారు. వారలా భయపడ్తుండగా, దాని పేగులను మొలకల్లాంటి తనగోళ్లతో అతివేగంగా, అతితొందరగా, ఆరాక్షసి భరించలేని రీతిలో, నోరు మూసేలోపల, చీల్చి బయటకు దూకాడు మహావీరుడు ఆంజనేయుడు. (ఈ సింహిక అనే హింసిక జలాంతర్గామి లాంటిది. సముద్రంలో వుండి కాపలా కాస్తున్నది కాబట్టే, చుట్టూ సముద్రం ఆవరించి వున్న తన లంకా నగరానికి ఎవ్వరూ ప్రవేశించజాలరనే విశ్వాసం రావణుడికుంది). దేవతలు హనుమంతుడిని పొగుడుకుంటూ మాట్లాడారు.

         దేవతలంటున్న మాటలను ఆలకిస్తూనే తనువచ్చిన పని పూర్తి చేసుకోపోయే ఉపాయాన్ని ఆలోచిస్తూ, ఆకాశాన్నుండి కిందకు దిగే ప్రయత్నం చేసాడు హనుమంతుడు. తను దిగాల్సిన తీరాన్ని దగ్గరనుండి చూస్తాడు. అప్పుడే తన శరీరాన్ని, చూసుకుంటూ, ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. ఇంత పెద్ద శరీరంతో కనిపిస్తున్న తనను ఒక వింత జంతువుగా రాక్షసులు భావించి వేడుకగా తన చుట్టూ తిరుగుతారేమోనన్న అనుమానం కలుగుతుంది. కొండంత శరీరాన్ని తక్షణమే చిన్నదిగా చేస్తాడు. త్రికూటపర్వతం మీదినుంచి దేవేంద్రుడి పట్టణంతో సరితూగే వనసమూహాలతో ప్రకాశిస్తున్న లంకానగరాన్ని తేరిపార చూసాడు. (వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)

No comments:

Post a Comment