Saturday, February 13, 2021

తొలి సీతాన్వేషణలో హనుమ విఫలుడైనాడా? : వనం జ్వాలా నరసింహారావు

 తొలి సీతాన్వేషణలో హనుమ విఫలుడైనాడా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (13-02-2021) ప్రసారం  

రాక్షస సంచారం లేని ప్రదేశం ద్వారా హనుమంతుడు లంకా ప్రవేశం చేశాడు. శతృ స్థానాలలోకి దొడ్డిదారి ("అద్వారం") నుండే ప్రవేశించాలన్నది రాజనీతి. హనుమంతుడదే పనిచేసాడు. శత్రు దేశంలోకి ప్రవేశించేటప్పుడు ఎడమకాలు ముందుంచాలి కాబట్టి హనుమంతుడు ఆ పద్ధతినే అనుసరిస్తాడు. రాచబాటకు చేరిన హనుమంతుడు, లంకను నలు దిక్కులనుండి చూసి, దాని బహుముఖ ఐశ్వర్యానికి  మురిసిపోయాడు. అలా తిరుగుతున్న హనుమంతుడికి వర్ణనాతీతమైన ధ్వనులు వినిపిస్తాయి. ధ్వనులకు తోడు, వేదాధ్యయనం చేసేవారిని, రాక్షస వందిమాగధులను, రాచబాటల నడుమ నిల్చున్న గుంపులను, వేగులను, గర్జించే రాక్షసులను, దీక్షలో వున్నవారిని కూడా చూసాడు హనుమంతుడు. రావణాసురుడి ఇంటి ముందు, కాపలాకాస్తున్న ఆయన మూలబలగాన్నీ చూసాడు హనుమంతుడు. కమ్మని వాసనలతో కూడి వున్న రావణాసురుడి అంతఃపురాన్నిచూసాడు హనుమంతుడు.

 రావణుడి అంతఃపురాన్ని బయటనుండే చూసి, ఆ తర్వాత లోనికి ప్రవేశిస్తాడు. మద్యపానంతో శరీరాన్ని మరిచి ఏంచేస్తున్నారో తెలియని రాక్షసులుండే ఇళ్ల సముదాయాన్ని కనుగొంటాడు మారుతి. మద్యపాన ప్రభావంతో దేహాన్ని మరిచి మాట్లాడుతూ, ఇతరులను బెదిరిస్తున్న రాక్షసులను హనుమంతుడు చూసాడు. భర్తలను రతికై ప్రార్ధిస్తున్న స్త్రీలను హనుమంతుడు చూసాడు. కామావేశం వున్న స్త్రీలను, వికారమైన, విడ్డూరమైన, ఇంపైన చేష్టలు చేస్తున్న స్త్రీలను, పెళ్లై సంతోషంతో వున్న స్త్రీలను చూసాడు హనుమంతుడు. లేతవయస్సులో వున్నవారిని, చంద్రబింబం లాంటి ముఖం కలవారిని, వంకరకనురెప్పల వెంట్రుకలున్నవారిని, ఆభరణాలు ధరించిన వారిని, మెరుపు తీగల్లాంటి ఆడవారిని చూసాడాంజనేయుడు.

         తను చూస్తున్న స్త్రీలలో, రాజవంశంలో పుట్టినదాని లాంటి దానిని, స్వసంకల్పంతో అయోనిజగా పుట్టిన దానిని మాత్రం చూడలేకపోయాడు హనుమంతుడు. సీతాదేవిని తాను వెతికిన అన్ని రహస్య ప్రదేశాల్లో ఎక్కడా చూడలేక పోయినందుకు హనుమంతుడు బాధపడ్డాడు ఆసమయంలో. రాక్షసుల ఇళ్లల్లో ఎంత వెతికినా, సీతాదేవిని చూడలేకపోయినందుకు చింతిస్తూ హనుమంతుడు తాను కోరిన రూపాన్ని ధరించి, మరింత వేగంగా, శ్రధ్ధగా తిరిగి వెతకనారంభించాడు. సింహాల కాపలాలో నిరపాయంగా వుండే వనంలాగా, ప్రాకారంతో చుట్టబడి వున్న రావణ గృహాన్ని చూసాడు హనుమంతుడు. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యంతో ముక్కుపై వేలుంచుకుని దాన్నే చూడసాగాడు హనుమంతుడు. అక్కడా-ఇక్కడా అన్ని చోట్లా వెతకసాగాడు సీతకోసం హనుమంతుడు.

ఇలా తిరుగుతూ రావణుడి రాక్షస నాయకులు వుండే ఇళ్లంటిలో వరుస తప్పక సీతకొరకై వెతుకుతాడు హనుమంతుడు. అయినా ఫలితం కానరాలేదు. ఇలా వీళ్లందరి ఇళ్లల్లో వెతికిన హనుమంతుడు, మనోహరంగా, విశాలంగా వున్న అందమైన రావణాసురుడి గృహాన్ని చూస్తాడు హనుమంతుడు. ఆ పరిసరాలలో సువాసనలు వెదజల్లే మనోరంజకమైన పుష్పక విమానాన్ని చూసిన హనుమంతుడు దాని రూపకల్పనకు ఆశ్చర్య పడ్డాడు. ఆపట్టణంలో ఎంతసేపు తిరిగినా, వెతుకుతున్న సీత జాడ తెలియరానందున ఏంచేయాలన్న విచారంలో పడ్డాడు సునేత్రుడైన హనుమంతుడు. దాని సౌందర్యం దేవతల విమానాలకు లేనేలేదు. దాంట్లోని ఏ భాగం, ఏ ప్రదేశం చూసినా ఆశ్చర్యం కలుగక మానదు.

         పుష్పక విమానం మధ్యలో, అర్ధ యోజనం వెడల్పు, యోజనం పొడవున్న రావణుడి ఇంటిని చూసి, అందులోకి పోయి, అక్కడ సీతాదేవి కనపడుతుందేమోనని వెతకసాగాడు హనుమంతుడు. మేడలనేకం వున్న రావణుడి నగరంలోని బలవంతులైన రాక్షసుల ఇళ్లలోనూ, రావణుడుంటున్న ఇంటిలోనూ, తనకార్యక్రమాన్ని కొనసాగించాడు మారుతి. రావణాసురుడి రక్షణలో వున్న ఆ ఇల్లు, ఇంపైన ధ్వనులతో వీనులకు, రూపాలతో కళ్లకు, త్రాగటానికి ఇంపైన వాటితో చర్మానికి, వాసనలతో ముక్కుకు, నోరూరిస్తూ నాలుకకు తృప్తినిచ్చాయి హనుమంతుడికి. అక్కడి దీపాల కాంతి, రావణుడి దేహకాంతి, వాడు ధరించిన బంగారపు సొమ్ముల కాంతి, కలవడంతో ఆ శాల మండుతున్నట్లు వెలుగుతోంది. ఆ విశేషం చూసి హనుమంతుడు, ఔరా! అని తనలో మెచ్చుకుంటాడు.

             ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, చింతిస్తూ, సీతాన్వేషణ కొనసాగిస్తాడు హనుమంతుడు. అలా వెళ్తున్న అతడికి రావణుడి శయ్య కనిపిస్తుంది. చిత్రమైన దాని ఆసనాలు స్ఫటికాలతో, బంగరు వైడూర్యాలతో, దంతాలతో చేయబడ్డాయి. ఇంద్రుడి పానుపును మించిన రావణుడి మంచాన్ని తిలకించి ఆశ్చర్య పోతాడు హనుమంతుడు. సర్వాలంకార శోభితంగా గడచిన రాత్రి సయ్యాటల అలసటతో కనిపిస్తున్న రావణాసురుడు ఆ పెద్ద పానుపుమీద నిద్రపోతుండడం గమనిస్తాడు హనుమంతుడు. అయ్యో! ఈపాపాత్ముడి దగ్గరకెందుకొచ్చానా అని బాధపడ్డాడు కాసేపు. నవ్వుముఖంతో రావణుడి కాళ్లదగ్గర నిద్రిస్తున్న, వాడి స్త్రీలను  నిర్మలమైన మనస్సుతో చూసాడు ఆంజనేయుడు. బాగా మత్తుగా మద్యం సేవించి, నాట్యాలు చేసి, భర్తతో రతిక్రీడలాడి, అలసి-సొలసి, వళ్లు తెలీకుండా అక్కడ పడిపోయి నిద్రపోతున్నారు రావణుడి భార్యలందరూ.

         వీరాంజనేయుడు ఇలా నిద్రిస్తున్న స్త్రీలందరినీ చూసుకుంటూ పోయి-పోయి, ఓ ప్రత్యేకమైన స్థలంలో, ఏకాంతంగా నిద్రిస్తున్న ముగ్ధ మనోహర సౌందర్యాతిశయంకల, మరో స్త్రీని గమనిస్తాడు. అలా కనిపించిన స్త్రీ పట్టపు దేవికనుక, ఈమూకలో కలవక వేరే ఒంటరిగా నిద్రిస్తోంది. మనోహర సౌందర్యరాశి, పట్టపురాణి మండోదరిని అక్కడి పడకటింట్లో నిదిరిస్తుండగా చూసాడు హనుమంతుడు. ఆమె ముగ్ధమోహనాకృతిని చూసిన హనుమంతుడు, "సీతను చూసితి-చూసితి"నని సంతోషంతో భుజాలు తట్టుకున్నాడు. తోకను ముద్దిడుకుంటాడు. గెంతులేస్తాడు. "అబ్బ ఇప్పటికి చూసాకదా సీతాదేవిని" అని అనుకుంటాడు కొంతసేపు హనుమంతుడు. కుదుటపడ్డ ఆయన మనస్సు, ఈమెట్లా శ్రీరాముడి భార్య సీతాదేవవుతుందని తర్కించుకుంటుంది. ఈమె సీత కాద"ని నిశ్చయించుకుని, మండోదరిని దాటి ఆవలికిపోయి, మద్యం సేవించే పానశాలలో సీతను వెతకడం ప్రారంభిస్తాడు.

         రావణుడి అంతఃపురమంతా వివరంగా గాలించినప్పటికీ, సీతాదేవి రూపం, ఆమె వున్న స్థలం జాడ ఏ మాత్రం తెలవకపోవటంతో చింతించాడు హనుమంతుడు. నిద్రలో పరవశమై వళ్లు తెలియకుండా వున్న పరస్త్రీలను చూసి పాపం చేసాననుకుంటాడు. ఇట్లా ఆలోచిస్తున్న హనుమంతుడి మనసుకు, తాను చేసిందిన్ది తప్పా-ఒప్పా అని నిశ్చయించి తీర్మానించగల సామర్ధ్యం-బుధ్ధి మళ్లీ కలిగింది. ఇలా విచారించే బదులు ఇంకోచోట వెతుకుతాననుకుంటాడు. ఆడది ఆడవారి మధ్యలో వుండక ఎక్కడుంటుందని నిష్కాముడనై, కర్తవ్యం నెరవేర్చాలి అనుకుంటాడు మరల. "నిష్కల్మశమైన మనస్సుతో అంతఃపురమంతా మిక్కిలి శ్రధ్ధతో వెతికాను-సీతాదేవి ఎక్కడా కానరాలేదు కదా" అనుకుని, పానశాలను విడిచి, అంతఃపురంలో వెతకసాగాడు మళ్లీ.

ఆ అంతఃపురం మధ్యలో తీగలతో ఏర్పాటుచేసిన ఇండ్లలోనూ, చిత్రాలతో అలంకరించబడిన ఇండ్లలోనూ ఎంత వెతికినా సీత కనపడలేదు. ఆమె కనపడనందున ఒకవేళ మరణించిందేమోనని అనుకుంటాడు. పాతివ్రత్య రక్షణకు పూనుకుని, సత్పురుషులతో స్తుతించబడే సుగుణోపేత సీతామాత ఆత్మహత్య చేసుకోక పోయుండవచ్చునేమో కాని, క్రూరుడైన రావణుడు చంపాడేమోనని అనుకుంటాడు. కాకపోతే కామాసక్తుడై తెచ్చిన వాడు నయానో, భయానో, కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు కాని, హింసించి వుండడనుకుంటాడు. ఒకవేళ భయంకర, వికార దేహాలు, ముఖాలు, కన్నులు వున్న రాక్షస స్త్రీలకు భయపడి సీతాదేవి ప్రాణాలు వదిలిపెట్టిందేమో, ఏంచేయాలిప్పుడని ఆలోచనలో పడ్తాడు హనుమంతుడు. చెప్పిన పౌరుష వాక్యాలను నెరవేర్చలేక, సీతను చూడలేక సుగ్రీవుడు పెట్టిన గడువు దాటినతర్వాత, ఆయన్ను చూడడం ఏ ధర్మాన్ననుసరించి చేయాలని భయపడ్తాడు. ఒకవేళ వెళ్లినా బలవంతుడైన అతడు తన ఆజ్ఞను మీరినందుకు తనను దండించక మానుతాడా? అని తలపోస్తాడు.

         "అంతఃపురంలో చూసాను, రావణాసురుడి స్త్రీలందరి మధ్యలో చూసాను. అయినా ఎక్కడా సీతాదేవి కనిపించలేదు. చేయాల్సిన కృషి అంతా చేసానే! శ్రమ వ్యర్ధమైందికదా!" అని అనుకుంటాడు హనుమంతుడు. వానరుల ఎదుట పౌరుషాలు పలికినందుకు; "హనుమంతా, ఏంచేసొచ్చావు? సీతను తెస్తానంటివే? తెచ్చావా?" అని అడిగితే జవాబేమివ్వాలి? వెతికాను, కానరాలేదు, పోయినవాడిని పోయినట్లే తిరిగొచ్చాను అని చెప్పనా? అలా ఎలా చెప్పేది? చెప్తే మంచిగుండదు. ఇలా అనుకున్న హనుమంతుడు, ఇక్కడే వుండి వెతుక్కుంటూపోతే, హనుమంతుడు రావణుడి చేతిలో చచ్చిపోయాడేమోననుకోవచ్చు నని తలుస్తాడు. అలా అనుకుని మిగిలిన వానరులు తామూ బ్రతికుండి ప్రయోజనం లేదనుకుని ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకోవచ్చుననుకుంటాడు. ఇక్కడుండకూడదు, మరలిపోవాల్సిందే అనుకుంటాడు. పోతే నాడు పొగిడిన, శ్లాఘించిన జాంబవంతుడు,అంగదుడు, ఇతర వానర ముఖ్యులు "ఛీ" అంటారేమోనని కూడా భయపడ్తాడు.

         తానిక్కడ ఊరకనే ఉండరాదనీ, వ్యర్ధుడై పోనూకూడదనీ, అధైర్యపడకూడదనీ, కార్యం ఎట్లాగైనా సాధించాలనీ, సకల కార్యాలను నెరవేర్చే ఉత్సాహాన్ని ఆశ్రయించి మళ్లీ ప్రయత్నించాలనీ నిశ్చయించుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు రక్షించే అన్నిప్రదేశాలు: పానగృహాలు, చిత్రగృహాలు, తోటలు, కేళిశాలలు, సందులు, గొందులు, వీధులు, విమానాలు, ఇవీ,అవీ,అన్నీ విడిచిపెట్టకుండా గాలించాలనీ ఆలోచిస్తాడు. అనుకున్నదే తడువుగా వెతకడం ప్రారంభించాడు. నేలమాళిగలలో, నాలుగు వీధులు కలిసే ప్రదేశాలలోని మందిరాలలో, రావణుడింటి దగ్గరున్న ఆటపట్టులలో, ఇలా పోయినచోటికే పోయి, ఎక్కినమెట్టే ఎక్కి, దిగినమెట్టే దిగి వెతుకుతాడు. ప్రాకారాలలో, ఇంటింటి మధ్యనున్న వీధుల్లో, అరుగుల్లో, దిగుడుబావుల్లో, సరస్సు తీరాలలో, రావణుడికి అనుకూలురైన స్త్రీల మధ్య, ప్రతికూలురైన స్త్రీల మధ్య ఎంత వెతికినా సీత కానరాక పోవటంతో దిగులు పడ్డాడు హనుమంతుడు.

         అక్కడినుండి ప్రాకారం మీదకు చేరిన హనుమంతుడు సీతాదేవిని చూడలేకపోయినందుకు చింతించసాగాడు. మనస్సు కలతచెందింది మరోమారు. లంకలోని చెరువులు, గుంటలు, సరస్సులు, నదులు, వంకలు, వాగులు, కొండలు, డొంకలు, సమస్త ప్రదేశాలలో వెతికినా వ్యర్ధమయింది కదా అని వ్యాకులపడ్తాడు.తర్వాత ఇలా ఆలోచిస్తాడు:

         "సీతను చూడలేకపోయాను. సీత రావణుడింట వున్నదని ఎంతోనమ్మకంతో చెప్పాడే సంపాతి! అయినా ఆమె ఇక్కడ కనపడలేదాయె! ఏంచేయాలి? సంపాతి అసత్యమాడడే? దానివలన అతడికి కలిగే లాభమేంటి? కాబట్టి ఇక్కడే ఎక్కడో సీత వుండేవుండి తీరాలి. ఎందున్నదో? రావణాసురుడికి వశపడినందున వాడామెను వీరందరిలో కలపక మరెక్కడైనా వుంచాడా?ఛీ, ఎందుకిలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి? ఆమె జనకరాజు కూతురు, మిధిలలో పుట్టింది, శ్రీరాముడి భార్య, విదేహ సంబంధమున్నది, భూమిలో పుట్టింది, పేరు సీత...అలాంటిది కామవశురాలై దుష్టుడు, జాతివల్ల నీచుడు, దనుజుడు, క్రూరుడు, మనుష్యులను తినేవాడైన రావణుడిని ఎట్లా కామిస్తుంది? అట్టి విపరీతం ఎప్పటికీవుండదు"

         "సీతాదేవి ఇందులేదు-అందులేదు. పోనీ రావణుడు అపహరించుకుని ఎత్తుకొస్తున్న సమయంలో, అబల అయిన సీత నడితోవలో పడిపోయివుండవచ్చా? అలాకాకపోతే ఆకాశమార్గాన తన్నెత్తుకుని రావణుడు పోతున్న సమయంలో, క్రిందున్న సముద్రాన్ని చూసి, పరవశించి, వశంతప్పి, దాంట్లో పడిపోయిందా? వాడి వేగానికి ధైర్యం కోల్పోయి, వణకుతూ ఆకాశంలోనే తనువు చాలించిందా? శ్రీరామచంద్రుడిని, పున్నమినాటి చంద్రుడినే తిరస్కరించేరీతి ముఖాన్ని, తామరపూలరేకుల్లాంటి ఆయన కళ్లను స్మరిస్తూ ప్రాణం విడిచిందా? రావణుడే భక్షించాడా? రావణస్త్రీలు చంపారా? చంపి తిన్నారా? రామా! లక్ష్మణా! అంటూ ఏడుస్తూ మరణించిందా? ఇలా పరిపరి విధాలుగా అనుకుంటాడు.

రామపత్ని సీత రావణాసురుడి వశంకావడం కల్లనీ, అందువల్ల, వాడే ఎక్కడైనా సీతను దాచైనా వుంచి వుండాలి, లేదా, పతివ్రత కనుక వశపడక సముద్రంలో పడి మరణించైనా వుండాలి అనుకుంటాడు. భార్యపై ప్రేమ వున్న రాముడికి తాను ఏమనిచెప్పాలని మధనపడ్తాడు హనుమంతుడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment