Sunday, February 21, 2021

త్రిజట స్వప్నం నిజమా? కల్పితమా? : వనం జ్వాలా నరసింహారావు

 త్రిజట స్వప్నం నిజమా? కల్పితమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ ఆదివారం (21-02-2021)  

రావణుడి ఆజ్ఞానుసారం, రాక్షస స్త్రీలు, సీత దగ్గరకు చేరి, అనేక రకాల కఠినమైన మాటలన్నారు. ఏకజట, హరిజట, ప్రఘస, వికట, దుర్ముఖి, వినత, అసుర, చండోదరి, అజాముఖి, శూర్ఫణక అనే రాక్షస స్త్రీలు రావణుడి బల పరాక్రమాలను పొగిడి అతడి ఇల్లాలివై సంతోషించమనీ,  రారాజును, దేవతల విరోధిని, రావణుడిని భర్తగా చేసుకుని సుఖపడ మని హితబోధ చేశారు. నయవాక్యాలతో సీతను ఒప్పించ లేకపోయిన రాక్షస స్త్రీలు, బెదిరింపు మాటలన్నారు. తనను పరుష వాక్యాలతో బాధిస్తున్న రాక్షసస్త్రీలతో, తన మనసులోని మాటలను చెప్పసాగింది సీత.

"ఓరాక్షస స్త్రీలారా! మీరు చెప్తున్న మాటలు లోకం మెచ్చేవికావు. మీకు ఘోరపాపాన్ని కలిగిస్తాయి. మనుష్య స్త్రీ, రాక్షసుడి భార్యకావడం ఎక్కడైనా జరిగిందా? చెడుమాటలు మానేయండి. నామగడే నాకుగొప్ప" అంటుంది సీత రాక్షస స్త్రీలను వుద్దేశించి. సీతాదేవి అన్న మాటలకు ప్రత్యుత్తరంగా, రావణుడిచే ఆజ్ఞాపించబడిన రాక్షస స్త్రీలు, కఠినవాక్కులనే బాణాలతో ఆమెను నొప్పించసాగారు. ఆమాటలకు, శోకంతో కన్నీళ్లు కారుతుంటే, భయంతో లేచి శింశుపావృక్షం చాటుకు పోతుంది సీతాదేవి.

శింశుపావృక్షం మీద కూర్చుని రాక్షస స్త్రీలు జానకిని బెదిరిస్తూ అన్న మాటలన్నీ విన్నాడు హనుమంతుడు. రావణుడు రాకముందే తాను చూసిన స్త్రీని సీతాదేవిగా నిర్ణయించుకున్న హనుమంతుడు, సీతా-రావణుల సంభాషణవల్ల, తన నిర్ణయాన్ని స్థిరపర్చుకున్నాడు.

ఈ విధంగా రాక్షస స్త్రీలు బెదిరిస్తూ మాట్లాడుతుంటే, సీతాదేవి "రామా" అంటూ గొంతెండగా ఏడ్చింది. లంకలో వున్న సీతాదేవి రాక్షస స్త్రీలతో పడ్డ బాధల్లాంటివే, దేహంలోని "బధ్ధజీవుడు" సంసారమనే ఇంద్రియాలతో పడే బాధలు. రావణుడు కానీ, రాక్షస స్త్రీలు కానీ, సీతను బెదిరించారే కాని, చంపలేక పోయారు. అదే విధంగా, "జీవాత్మ" ను ఏవీ చంపలేవు. బాధించ గలుగుతాయి. సీతాదేవి లాగా బధ్ధ జీవులు "ప్రారబ్ధ" మని, దృఢ చిత్తంతో, భగవంతుడే రక్షిస్తాడని అమిత విశ్వాసంతో వుండాలి. సీతాదేవి ఇంద్రియాలకు లోబడలేదని, భగవంతుడి మీదే విశ్వాసం వుంచిందని దృఢ పడ్తున్నది.

సీత ఇంకా ఇట్లా అనుకుంటుంది తనమనస్సులో: "శ్రీరామచంద్రుడి దర్శనం లేకపోవడం అటుంచి, రాక్షస స్త్రీలకు వశపడి బాధపడాల్సి వచ్చిందికదా! నేను ఇంకా మరణించక ఎందుకు ప్రాణం నిల్పుకున్నాను? నాపాపమే కారణమా? ఇంత మహా దుఃఖాన్ని అనుభవించడానికి పూర్వజన్మలో నేనెంత ఘోరపాపం చేసానో? ఈవిధంగా మూర్ఖపు రాక్షస స్త్రీలు కావలికాస్తుంటే ఎక్కడో వున్న రాముడు రావడమేంటి? నన్ను రక్షించడమేంటి? కాబట్టి మృత్యుదేవతే నాకు దిక్కు”.

శ్రీరాముడిని తలచుకొని దుఃఖించిన సీత, రాక్షసస్త్రీల పైన తన కోపాన్నీ, అశక్తతనూ చూపిస్తుంది. పరుషంగా మాట్లాడుతుంది. "మీ నోళ్లు పట్టెతంత చిన్న-చిన్న ముక్కలుగా నాశరీరాన్ని కోసుకోండి. కత్తులతో నరకదల్చుకుంటే అలానే చేయండి. మంటల్లో వేయదల్చుకుంటే వేసికాల్చండి. మీ ఇష్టం వచ్చినట్లు మీరుచేయండి. నేనైతే మీమాట వినను. ఎందుకు మీకీమిడిసిపాటు? గర్వం? నాదేహం మీవశం. ఏమైనా చేసుకోండి. మనసు నాస్వాధీనం. దాన్ని మీరేమీ చేయలేరుకద!" అని తెగేసి చెప్పి, ఇంకా ఇలా అంటుంది:

"నీచుడైన రావణుడు నాకు ఏడాది గడువిచ్చాడు. అదివాడి చావు గడువు. అదిదగ్గర పడ్తున్నది. ఆ గండం తప్పించుకోవడం, మీ రాక్షసులకు తెలవదు. ఉత్పాతం ఇప్పుడే పుట్తున్నది.  చూస్తుండండి. ధర్మ మార్గంలో అపాయం తప్పించుకోవడం తెలియని మూఢరాక్షసులు, ఈ కీడుమూడింది నావల్లనేనని, రావణాసురుడి భోజనానికి నన్ను హింసించి పంపుతారేమో! ఆమాత్రం కీడుతప్పదు. రాముడు తమను చంపుతుంటే, వాళ్లు నన్ను చంపుతారు. నా ప్రాణేశ్వరుడు  దయాశీలి, తామర రేకుల్లాంటి కళ్లున్న రామచంద్రమూర్తినే విడిచి ఏడుస్తున్న నన్ను మీరేంచేసినా, నేనేంచేయగలను?"

ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడే నిద్రిస్తున్న "త్రిజట" అనే వృధ్ధ రాక్షస స్త్రీ, వీళ్లందరినీ మందలించింది. దూరంగా పొమ్మని అందరినీ గద్దిస్తుంది. ఈ రాక్షస సమూహమంతా మూలమట్టంగా నాశనమౌతుందని, సీతాదేవి భర్తకు విజయం తధ్యమని కలగన్నాననీ, ఆ కలను తల్చుకుంటే దేహమంతా వణుకుతున్నదనీ, తనకల విషయం వివివరంగా వినమనీ అనగానే రాక్షస స్త్రీలందరూ భయంతో ఆమె చుట్టూ చేరారు. తాను కలలో చూసిన సన్నివేశం  వివరాలను ఇలా చెప్పసాగింది త్రిజట:

"తెల్లటి ఏనుగు దంతంతో తయారై, ఆకాశంలో పయనించగలిగిన పల్లకీని, వేయి హంసలు లాగుతుంటే, తెల్లటి వస్త్రాలు కట్టుకుని, రామచంద్రమూర్తి, లక్ష్మణుడితో కూడి వస్తాడు. సీత అందమైన తెల్లటి చీరె కట్టుకుని, పాలసముద్రంలో, తెల్లటి పర్వతం మీద సూర్యుడితో కూడిన ప్రభలాగా, రాముడితో వుండగా చూసాను. నాలుగు దంతాల కొండలాగున్న ఏనుగుపై లక్ష్మణుడితో రాముడు పోతుండగా చూసాను.

         "తెల్లటి వలువలు, పూదండలు ధరించి, ధీరుల్లో శ్రేశ్ఠులైన రామలక్ష్మణులు, చిగుళ్ల లాంటి పాదాలున్న సీత పక్కన సంతోషంతో వుండగా చూసాను. అదిచూడగానే నా గుండెలు పగిలాయి. ఆపర్వత శిఖరం మీద ఆకాశాన్ని తాకుతున్న ఏనుగుపై, రాముడి తొడమీద సీతాదేవి కూర్చొని వుంది. సూర్యచంద్రులను తాకుతున్నదా అనిపించింది. రాజకుమారులైన రామలక్ష్మణులు, చంద్రుడిలాంటి ముఖమున్న సీతాదేవి, స్పష్టంగా భద్రజాతి ఏనుగుపై కూర్చొని లంకమీద ఆకాశాన వున్నట్లు కలగన్నాను. ఎనిమిది మేలుజాతి ఎడ్లను కట్టిన రధమెక్కి రామచంద్రుడు ఈ సీతాదేవితో రావడం చూసాను."

"సూర్యకాంతిగల పుష్పక విమానం ఎక్కి రామలక్ష్మణులు, ఉత్తరదిశగా సీతతో పోతుంటే చూసాను. విష్ణుపరాక్రముడు, మహాబుధ్ధిశాలి, శ్రీరామచంద్రమూర్తి, సీతతో, తమ్ముడితో వుండగా చూసాను. ఇది నిజమవుతుందనిపిస్తున్నది". (స్వప్నక్రమం: రామలక్ష్మణులు పల్లకీలో సీతను వెతుకుతూ లంకకు వస్తారు. లంక దగ్గర పాలసముద్రంలో ఒక తెల్లటి కొండ దగ్గరకు రాముడు వచ్చి చేరుతాడు. సీతకూడా ఆ కొండ దగ్గరే వుంది. రామలక్ష్మణులు పల్లకి దిగి ఏనుగునెక్కి సీత దగ్గరకొచ్చారు. సీతకూడా ఏనుగునెక్కి పెనిమిటి తొడపై కూర్చున్నప్పుడు సూర్యచంద్రులను తాకుతున్నట్లుగా వుంది. ఈ విధంగా వాళ్లు లంకకు ఆకాశమార్గాన వచ్చి, ఏనుగు దిగి, ఎనిమిది ఎడ్లు కట్టిన రధంపై కూర్చుని, లంకకొచ్చి, పుష్పకవిమానం ఎక్కి ఉత్తరదిశగా పోయారు)

"పాపాత్ములు స్వర్గం దగ్గరకు ఎట్లా పోలేరో, అట్లే దేవరాక్షస సమూహాలు యుధ్ధరంగంలో, శ్రీరాముడిని సమీపించలేవు. రావణుడు ఒంటికి నూనె పూసుకుని, నూనె త్రాగుతూ, గన్నేరు పూల దండలు మెళ్లో వేసుకుని, ఎర్రబట్టలు కట్టుకుని, బోడితలతో, నల్లబట్టలు ధరించి, పుష్పక విమానం నుండి ఒక ఆడది ఈడుస్తుంటే, నేలపైబడి బాధపడ్తుంటే చూసాను. గాడిదలు కట్టిన రధం మీద, ఎర్ర పూదండలు వేసుకుని, ఎర్రగంధం పూసుకుని, పిచ్చివాడిలాగా నూనె త్రాగుతూ, గంతులేస్తూ, గాడిదమీద దక్షిణ దిక్కుగా పోతుంటే చూసాను. గాడిదమీద పోతున్న వాడల్లా తలకిందులుగా పడిపోతాడు. పడి, భయంతో దిగ్గునలేచి, తెల్లబోయి, మత్తుతో వికలుడై, భయపీడితుడై, వాగుతూ, బట్టలిప్పేసి, దిక్కుతోచక, భయంకరమైన, అసహ్యమైన బురదలో పడిపోవడం చూసాను. కాళి అనే ఓ స్త్రీ ఎర్రగుడ్డేసుకుని, బురద పూసుకుని, వాడిమెడను కౌగలించుకుని, రాక్షసరాజును దక్షిణదిక్కుగా ఈడ్చుకుంటూ పోతుంది."

"కుంభకర్ణుడి పైకూడా ఇలాంటికలే కన్నాను. రావణుడి కొడుకులు నూనెలో మునగడం చూసాను. పందిపై రావణుడు, మొసలిపై ఇంద్రజిత్త్తు, ఒంటెపై కుంభకర్ణుడు దక్షిణదిక్కుగా ప్రయాణం చేయడం చూసాను. ఒక్క విభీషణుడు మాత్రం తెల్ల గొడుగు, తెల్ల బట్టలు, తెల్లగంధం పూతతో, ఆటపాటలమధ్య, మేఘధ్వనిగల ఒక పెద్ద ఏనుగునెక్కి నలుగురు మంత్రులతో ఆకాశ మార్గంలో పోతుంటే చూసాను. ఎర్రగుడ్డలు, ఎర్రమూల్యాలు ధరించి మేళతాళాలతో వుండగా చూసాను. విరిగిన గోపురాలతో వున్న రావణరక్షణలోని లంక సముద్రంలో పడుతుంటే చూసాను. రాముడికి భృత్యుడైన ఓ కోతివచ్చి లంకను కాల్చి బూడిదచేయగా చూసాను. ఏడుస్తున్న ఆడవాళ్లు నూనె త్రాగి లంకలో వేడి బూడిదలో పడిపోవడం, కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు పౌరుషం పోయి, పేడమడుగులో పడుతుంటే చూసాను." తనకొచ్చిన కల విషయం చెప్పడంతోపాటు, రాక్షసస్త్రీలను మందలిస్తుంది కూడా త్రిజట ఇలా:

"రాక్షసస్త్రీలారా లేచి చాటుగా పొండి. సీతాదేవిని తీసుకెళ్లటానికి ఇక్కడకు వచ్చిన రాముడు, భయంకరంగా రాక్షసులందర్నీ చంపుతున్నప్పుడు, తనభార్యను బాధించిన మిమ్ములనందరినీ కూడా చంపకుండా వూరుకోడు. అందువల్ల మీమాటలు చాలించండి. బెదిరింపు మాటలు మానండి. ప్రాయశ్చిత్తంతో క్షమించమని సీతను వేడుకుందాం. నా కల నిజమైన కల. సీత తప్పక తనభర్తను చేరుతుంది. సీత దు:ఖాన్ని అనుభవించడానికి అర్హురాలుకాదు. ఈమె దివ్యసుఖాలను అనుభవిస్తుంది. ఈమెను బాధిస్తే మనకొచ్చిన లాభమేంటి? ఆమె ఎడమకన్ను ఎట్లదురుతుందో చూడండి. అది ఆమెకు మేలుచేస్తుంది. ఈమె అనుకున్నట్లే భర్తను కలుస్తుంది. రావణుడు నాశనం అవుతాడు. రామచంద్రమూర్తి గెలుపు ఖాయం" అంటుంది.

ఇదిచెప్తుంటే ఉన్నట్లుండి సీతాదేవి ఎడమచేయి పులకించి అదిరింది. ఎడమతొడా అదిరింది. అంటే రాముడు సమీపంలోనే వున్నాడని మంగళసూచిక. మొదట సీతమ్మ ఎడమకన్ను అదిరింది. వెంటనే ఎడమ భుజం అదిరింది. తరువాత ఎడమ తొడ అదిరింది. ఇవన్నీ త్రిజట చెప్పినప్పుడు ఆ రాక్షస స్త్రీలంతా చూసారు. నిజమేనని నమ్మక తప్పింది కాదు. కొమ్మలమీదున్న పక్షులు అమితమైన సంతోషంతో, ఓదార్పు మాటలు పల్కుతూ, శుభసూచకం ప్రేరేపిస్తూ సీతకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయనీ, దీన్నిబట్టి సీతకు త్వరలోనే శుభం కలుగనున్నదనీ, కాబట్టి రాక్షసులు ఆమెను బాధించవద్దనీ అంటుందిత్రిజట. రాక్షసస్త్రీలంతా, త్రిజట చెప్పినట్లే సీతాదేవి శరణుజొచ్చారు. రక్షిస్తానని సీత వారికి అభయమిస్తుంది.

త్రిజట విభీషణుడి కూతురని కొందరు, కాదని మరి కొందరు అంటారు. ఆమె సీతాపక్షపాతి, అభిమానం వున్నామె. కలంతా కల్పితమనుకున్నా, కోతివచ్చే విషయమ, లంక కాల్చే విషయం వూహించని విషయమేకదా! అంటే స్వప్నమంతా కల్పితం కాకపోవచ్చు. రామాయణంలో మూడు స్వప్నాలున్నాయి. దశరధ స్వప్నం, భరత స్వప్నం, త్రిజట స్వప్నం. మూడూ నిజమయ్యాయి. భగవంతుడే నిద్రపుచ్చుతూ, మేల్కొన్నప్పుడున్న ఇంద్రియాలను తానే గ్రహించి, బాహ్యేంద్రియాలను విస్తరించి, స్వప్నాలను వాడి, వాడి అదృష్టం ప్రకారం సృష్టించి, కొంతసేపు వాడనుభవించేటట్లు చేస్తాడు. స్వప్నంలో కనిపించేవన్నీ సృష్టించబడినవే. స్వప్నాల్లో చూసినవన్నీ అసత్యం కాదు. స్వప్నాలు యదార్థమొతాయనడం శాస్త్ర సమ్మతం. త్రిజట తన స్వప్నాన్ని వివరించిన విధం రాక్షస స్త్రీలకు హడలెత్తించగా, శింశుపా వృక్షంపై చక్కగా కూర్చొని ఇదంతా వింటున్న హనుమంతుడికి ఇక చేయవలసిన పని ఏదో అందంగా సూచించినట్లయింది.

ఇంతలో, సీతాదేవికి మళ్లీ  శుభశకునాలు కనపడసాగాయి. సీతాదేవి ఎడమకన్ను చేప తాకిన పద్మంలాగా అదిరింది. ఆమె ఎడమచేయి అంతకంటే కూడా ఎక్కువగా అదిరింది. ఇలాంటి శుభశకునాలు కన్న సీతాదేవి శోకం వదలి, సంతోషించి, చంద్రుడున్న రాత్రిలాగా ప్రకాశించసాగింది. అంటే భర్తతో గూడిన సంతోషం కలిగింది. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారం)

No comments:

Post a Comment