Sunday, February 28, 2021

సీత హనుమతో పోకపోవడానికి కారణం? : వనం జ్వాలా నరసింహారావు

 సీత హనుమతో పోకపోవడానికి కారణం?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (28-02-2021) ప్రసారం  

తాను శ్రీరాముడి దూతననే విషయాన్ని ధృవీకరించడానికి, సీతాదేవి కోరినట్లే శ్రీరాముడి గుణగణాలను వర్ణించాడు హనుమంతుడు. మొదట శ్రీరాముడి ఆత్మగుణాలను వర్ణించి, తర్వాత దేహగుణాలను వర్ణిస్తాడు. రాముడిని వర్ణించిన హనుమంతుడు, ఆయన్ను గురించి చాలా నిగూఢ౦గా చెప్పడంతో సీతకు విశ్వాస పాత్రుడైనాడు. ఇక అక్కడి నుంచి సీతాన్వేషణలో రామలక్ష్మణులు ఎక్కడెక్కడ తరిగి కిష్కింధకు చేరుకున్నదీ వివరించాడు.

           “సీత కొరకై వెతుకుతున్న శ్రీరామలక్ష్మణులు మేముండే చోటుకు వచ్చారు. అన్న రాజ్యంలోంచి వెళ్లగొట్టబడి, ఋష్యమూకాద్రి మీద నివసిస్తున్న సుగ్రీవుడు, నార చీరెలు, చేతుల్లో బాణాలతో వస్తున్న వారిని చూశాడు. వారెవరో తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు. నా కంటికి వారు మహాత్ముల్లాగా కనపడినందున, వినయంగా, చేతులు జోడించి, వారి దగ్గరకు పోయాను. నన్నాదరించి, గౌరవించిన వారిద్దరినీ తీసుకునివచ్చి, సుగ్రీవుడి ఎదుట నిలిపాను”.

         “కలిసిన రామ, సుగ్రీవులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు నమ్మారు. ఒకరి దుఃఖం ఇంకొకరికి చెప్పుకొని సమాధానపర్చుకున్నారు. తన భార్యను అపహరించాలనుకున్న ఆయన అన్న వాలి, సుగ్రీవుడిని వెళ్లగొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేని సుగ్రీవుడిని నీ మగడు సమాదానపర్చాడు. వాలి, సుగ్రీవుల కలహకారణం ఇదే. నీ ఎడబాటుతో దుఃఖిస్తున్న శ్రీరాముడి చరిత్రను లక్ష్మణుడు సుగ్రీవుడికి చెప్పాడు. గతంలో రావణాసురుడు ఆకాశమార్గాన నిన్ను ఎత్తుకొని వెళ్తున్నప్పుడు, నువ్వు, భూమి మీద పడేసిన ఆభరణాలను సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపాడు. నీ జాడ మాత్రం చెప్పలేకపోయాం. నీ ఎడబాటుతో, నీమగడు, ఎల్లప్పుడు లోలోన కుములుతుంటే, అగ్నిని కలిగిన అగ్నిపర్వతంలాగా కనిపించాడు”.

“రావణుడిని, వాడి కొడుకులను, స్నేహితులను, యుద్ధంలో చంపి, నీ భర్త, నిన్ను త్వరలోనే తీసుకెళ్తాడు. వాలిని చంపుతానని రాముడు, నిన్ను వెతికించి నీవార్త తెప్పిస్తానని సుగ్రీవుడు ప్రమాణం చేసారు. సుగ్రీవుడితో కిష్కిందకు పోయి, వాలిని చంపి, సుగ్రీవుడిని రాజుగా చేసాడు రాముడు. ఇలావారిద్దరికీ స్నేహం కుదిరింది. నేను వారి దూతను, నిన్ను వెతుక్కుంటూ సముద్రాన్ని దాటి ఇక్కడకు వచ్చాను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు రాజై, తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి, నిన్ను వెతికేందుకు వానరులను పది దిక్కులకు పంపాడు. నిన్ను మేము వెతుకుతూ కనపడక బాధపడ్తుంటే, జటాయువు సోదరుడు సంపాతి కనబడి నీ జాడ చెప్పి, నువ్వు లంకలో వున్నావని అన్నాడు. ఆయన మాట ప్రకారం, నూరామడల సముద్రాన్ని దాటి, రావణుడి నగరం లంక ప్రవేశించి, రాత్రి సమయంలో రావణుడినీ, నిన్నూ చూశాను. వాస్తవం చెప్పాను. భయం లేకుండా, ధైర్యంగా నాతో మాట్లాడు. నన్ను నమ్ము. నాలో మాయలేదు. రామకార్యం చేసేందుకు నీ కొరకై వచ్చాను. వానర రాజు మంత్రిని, వాయుదేవుడి కొడుకును, సూర్యవంశం రాజు రామచంద్రమూర్తి దూతను”.

ఇంతవరకు తాను రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన హనుమంతుడు, తన జన్మ వృత్తాంతాన్ని కూడా సీతాదేవితో చెప్పాడు. "మాల్యవంతమనే పెద్ద పర్వతముంది. అక్కడ నాతండ్రి కేసరి అనే వానర రాజున్నాడు. దేవ ఋషుల ఆజ్ఞానుసారం, గోకర్ణమనే పర్వతానికి పోయి, శంభసాధనుడనే దైత్యుడిని చంపాడొకసారి. ఇట్లా మాతండ్రి కాలం నుండే, రాక్షసులకు, మాకూ విరోధముంది. ఆయన భార్యకు, వాయుదేవుడికీ, నేను జన్మించాను. నా స్వశక్తితో, స్వకార్యంతో, హనుమంతుడన్న పేరు తెచ్చుకున్నాను. నీ నమ్మకం కొరకు నీ భర్త గుణ-గణాలన్నీ చెప్పాను".

సీతమ్మ హనుమంతుడిని తన జన్మ వృత్తాంతం చెప్పమని అడగలేదు. రాముడి రూప విశేషాలను మాత్రమే అడిగింది. దానితోపాటు తన జన్మ వృత్తాంతాన్ని హనుమంతుడు చెప్పాడు. అడగనిదే చెప్పడం దేనికి? అని అనిపించవచ్చు. కానీ హనుమంతుడు ఆంజనేయుడు కదా! అంటే ప్రశస్త వాక్కు కలవాడని అర్థం. వ్యర్థంగా ఏదీ మాట్లాడడు. అసలు కారణమేమిటంటే, తాను రామదూతను అనీ, సామాన్యమైన సగటు వాడిని కాదనీ, సమర్ధుడననీ సీతమ్మను నమ్మించ చేయడం. నమ్మదగిన వాడినీ, విశ్వాసపాత్రుడినీ అని సీతమ్మకు రూఢి చేయాలని భావించడం! తనను ఈ మహాకష్టం నుండి తప్పించగలవాడని, రాముడిని రప్పించి తనను ఆయనతో కూర్చగల సమర్ధుడనీ విశ్వాసాన్ని పాదుకొల్పటానికే తన వైనం చెప్పాడు. ఇన్ని విధాలుగా చెప్పిన తర్వాత హనుమంతుడు, శ్రీరామచంద్రమూర్తి దూతన్న విషయం నమ్మింది సీతాదేవి.

జనకరాజు కూతురు సీతాదేవికి శ్రీరాముడి పేరు చెక్కిన ఉంగరాన్ని చూపిస్తాడు. దానిని దూతైన తనకు ఇచ్చిన రామచంద్రుడు, సీతకు ఇమ్మని చెప్పాడనీ, అది చూసిన ఆమెకు తనమీద నమ్మకం కుదురుతుందన్నాడనీ, అంటాడు హనుమంతుడు. ఆ ఉంగరాన్ని చూసిన సీతకు మనోవ్యాకులత కూడా తీరుతుందని రాముడు చెప్పినట్లు తెలియచేస్తాడు. హనుమంతుడిచ్చిన ఉంగరాన్ని సంతోషంగా తీసుకుంటుంది సీత. ఇదొక అద్భుతమైన ఉంగరం. ఇందులో మూడు మణులుంటాయి. అందులో ఒక మణిలో రాజైనవానికి పితృ-పితామహంగా వచ్చే సూర్యవంశపు శక్తిని ఆవహింప చేస్తారట. ఇది శ్రీరాముడి రాజ్యాధికార ముద్ర. దానిపై శ్రీరాముడి పేరు కూడా చెక్కబడి ఉందని పెద్దలంటారు. అలాంటి రాజ ముద్రను ఇవ్వడమంటే రాజ్యాన్నే ఇచ్చి వేయడమని అర్థంకద! సీతమ్మ కంటే రాజ్యం గొప్పది కాబోదు అని రాముడి భావన అనేది స్పష్టమవుతున్నది.

తనభర్త శ్రీహస్తాన్ని అలరించే ఆ ఉంగరాన్ని చూసిన సీతకు తన మగడే ఎదురుగా వచ్చినంత సంతోషం కలిగింది. ఆ ఉంగరాన్ని తాకుతూ అనుకుంటుంది సీత: "పాణిగ్రహ సమయంలో మొదటిసారి తన చేతిని రామచంద్రమూర్తి పట్టుకున్నప్పుడు, తనను తగిలిన ప్రధమాభరణం ఇదేకదా! తనకు ప్రణయకోపం వస్తే, శాంతింప చేయటానికి, భర్త తన గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతుంటే, తాకేదీ ఉంగరమేకదా! తనను కౌగలించుకున్నప్పుడు, వంటిమీదున్న ఆభరణాలన్నీ తీసేసినా, తీయందీ ఉంగరం కదా! ప్రణయకోపంలో ఇరువురికీ మాటలు లేనప్పుడు, మాట్లాడే నెపంతో, నేలమీద ఉంగరం పడేస్తే, తీసుకొమ్మని మాట్లాడే అవకాశం ఇచ్చింది ఈ ఉంగరమేకదా! అరణ్యాలకు పోతున్నప్పుడు, సర్వాభరణాలూ తీసేసినా, తనతో పాటు వెంట తెచ్చుకున్నదీ ఈ ఉంగరమేకదా!" ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తున్న సీతకు, సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే ఎదురుగా వచ్చి నిల్చున్నట్లు, భావనాతిశయ బలం వల్ల ఆయన ఆకారం స్పష్టంగా కనిపించిందామెకు.

లజ్జవతైన సీత, తన పతి క్షేమం, పతివార్త తెలిపిన ఆంజనేయుడిని, అభినందన పురస్సరంగా స్తోత్రం చేసింది. హనుమంతుడిని ప్రశంసించి శ్రీరామాదుల కుశలం అడిగింది. రామచంద్రమూర్తి తనను తప్ప మరేదీ తల్చుకోవడం లేదని ఆంజనేయుడు చెప్పడంతో, సీతకు అమృతం తాగినంత సంతోషం కలిగింది. అయితే ఆయన అమితంగా దుఃఖ పడుతున్నాడని కూడా చెప్పినందువల్ల విషం తాగినట్లనిపించింది. "విషం కలిపిన అమృతాన్నిచ్చినట్లున్నాయి నీమాటలు" అంటుంది సీతాదేవి హనుమంతుడితో.

"ఓ మారుతీ! రామచంద్రమూర్తి సూర్య వంశానికే అలంకార ప్రాయమైన వాడే! ఆయన ఈ వ్యధా సముద్రంలో మునగకుండా, తీరానికి ఎప్పుడు చేరుతాడయ్యా? గాలివానకు గిర-గిరా తిరిగే నావలాగా నలిగిపోయాడా? నన్నెప్పుడు తీసుకునిపోతాడో? ఎప్పుడు రావణుడిని చంపుతాడో? ఎప్పుడొస్తాడయ్యా రామచంద్రుడు? ఎప్పుడు చీలుస్తాడయ్యా రాక్షసమూకను? వాళ్లనెప్పుడు తన బాణాలతో ఖండిస్తాడు? పునాదులతో సహా ఎప్పుడీలంకాపురి పాడైపోతుంది? ఎప్పుడు నన్నాయన చూస్తాడు?"

"ఆంజనేయా! రావణుడు నాకొక్క సంవత్సరం గడువిచ్చాడు. అది ముగిసేవరకే నేను బ్రతికుంటాను. ఆ సంవత్సరంలో పదోనెల జరుగుతున్నదిప్పుడు. ఇంకా రెండునెలలే గడువున్నది. అవికాగానే నా చావు సిద్దం. కాబట్టి రామచంద్రమూర్తిని ఈ లోపలే వచ్చేటట్లు తొందరపెట్టు. ఆ తర్వాత వచ్చినా ఫలితం వుండదు”. ఇలా కళ్లనిండా నీళ్లు వుంచుకుని మాట్లాడుతున్న సీతాదేవిని చూసి హనుమంతుడు శోకించవద్దని ప్రార్ధిస్తూ, ఇలా అన్నాడు.

"నామాటలు విన్న శ్రీరాముడు సేనతో, వెంటనే ఇక్కడకు వస్తాడు. అంతవరకు దుఃఖమెట్లా ఆపుకోవాలంటే, దానికో మార్గముంది. నా వీపుపైనెక్కు, రామచంద్రమూర్తి వున్న చోటుకి నిన్ను తీసుకుని పోతాను. నేను దూతను. నీశీలానికి ఏ హానీలేదు. నిన్ను శ్రీరాముడి దగ్గరకు ఇప్పుడే చేరుస్తాను. నీమగడు, తమ్ముడితో కూడి రావణాదులను చంపే ప్రయత్నాన్ని నీకళ్లతో నువ్వే చూడగలవు. నావీపుపైకెక్కు. నామాట నమ్ము. ఆకాశంలో సూర్యచంద్రులతో ముచ్చటిస్తూ, సముద్రాన్ని, ఆకాశాన్ని అవలీలగా నావీపుమీద కూర్చొని దాటు. రాముడివద్దకు పోయేంతవరకూ నిన్ను దించను" అన్న ఆంజనేయుడి మాటలకు, భక్తికి, సంతోషించిన సీత, ఆయన మాటలకు ఆశ్చర్యపోయి ఇలా జవాబిస్తుంది.

"ఆంజనేయా! నేను సొమ్ములను మూటవేసిన స్థలం నాకు గుర్తుంది. అక్కడికి, ఇక్కడికి చాలా దూరం. ఇంతదూరం నన్ను ఎట్లా మోసుకుని పోతావు? నీమాటలు వినడానికే వింతగా వున్నాయి. ఇంతవరకు నీవు నిజంగా కోతివో, కాదో అన్న అనుమానం, సందేహం వుండేవి. ఇప్పుడు నీబుధ్ధిని పట్టి చూస్తే నీవు నిజంగా కోతివేనని, నిశ్చయించుకుంటున్నాను. ఈడ్చి కొలిస్తే నువ్వు జానెడు కూడా లేవు. నీవు నన్నెట్లా మోసుకుపోతావు" అన్న సీతాదేవిమాటలకు హనుమంతుడు విచారపడ్డాడు. మేరుపర్వతంతో సమానమైన ఆకారంతో, ఎర్రటి ముఖంతో, వజ్రాయుధం లాంటి గోళ్లతో, కోరలతో, సీతాదేవి ముందరర నిలబడి: "దేవీ! ఈ లంకను, కొండలతో, వనాలతో, బురుజులతో, ప్రాకారాలతో, తోరణాలతో, రావణాసురుడితో సహా పెల్లగించి, అత్యంత వేగంగా తీసుకునిపోయే శక్తి నాకుంది. నేను చిన్నవాడినన్న అభిప్రాయం మానుకో. ఆలస్యం చేయకుండా రాముడి దగ్గరకు పోదాం రా!" అంటాడు హనుమంతుడు సీతతో.

హనుమంతుడలా చెప్పగానే, ఆశ్చర్యం, భయం కలిగించే అతడి ఆకారాన్ని చూసి: "కపీశ్వరా! నీ బలగర్వం, వాయువేగం, కార్చిచ్చులాంటి నీశరీరం, ఎలాంటిదో తెలుసుకున్నాను. నీవు సామాన్య కోతివికావు. ఇంత గొప్పవాడివి కాకపోతే నువ్వెట్లా సముద్రాన్ని దాటి, రహస్యంగా లంక ప్రవేశించి, నన్ను వెతకగలిగే సమర్ధుడవవుతావు? ఇంతపని మామూలు వాళ్లకు సాధ్యమవుతుందా? నన్ను రామచంద్రమూర్తి దగ్గరకు తీసుకుపోగలవని నమ్ముతున్నాను. నీపై నాకెంత విశ్వాసమున్నా నీవెంట రాకూడదు. నీ వెంట రాకపోటానికి, మరో ముఖ్య కారణముంది. నా భర్తపై నాకున్న భక్తివల్ల, మగవాడిని, రాముడిని, తప్ప మరెవ్వరినీ తాకను. అలా చేయటానికి నామనస్సు ఒప్పుకోదు. ఈ వాస్తవాన్ని ముందే చెప్పితే, నీవేమనుకుంటావోనని, చివరకు చెప్తున్నాను".

"రామచంద్రమూర్తి వచ్చేవరకు ఆగలేను. రాలేను. రాముడు, రావణుడిని, యుద్ధంలో, ఈలంకలోనే చంపి నన్ను తీసుకోపోవాలి. అదే ఆయన యోగ్యతకు తగిన పని. ఆయన నన్ను రక్షించలేడన్న సందేహం వుంటేకదా, నేను నీవెంట రావాల్సింది. శ్రీరాముడి యోగ్యతకు తగనిదీ, ఆయనకు కష్టసాధ్యమైనదీ, సందిగ్దమైంది, నేనుకోరడం లేదు. ఎలాంటి విరోధులనైనా చంపేశక్తి, దండించే పరాక్రమం, ఆయనకున్నదని చెప్తే విన్నాను. కళ్లారా చూసాను. ఆయన శక్తి నాకు తెల్సు. ఆ సమర్ధుడి ఎదుట యుధ్ధభూమిలో నిల్చే శక్తి ఇంద్రాది దేవతలకు కానీ, పన్నగులకు కానీ, దేవదానవ రాక్షస సమూహాలకు కానీ లేదు. నీవు త్వరగా లక్ష్మణ, సుగ్రీవులతో కూడిన రామచంద్రమూర్తినే లంకకు తీసుకొచ్చి, రావణుడిని చంపి, నన్ను తీసుకుని పొమ్మని ఆయనతో చెప్పు. ఆయనకొరకు తీవ్ర దుఃఖంతో వున్న నన్ను కృతార్ధురాలిని చేయి. నీకు పుణ్యముంటుంది" అని చెప్తుంది. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

 

 

No comments:

Post a Comment