Sunday, March 7, 2021

బ్రహ్మాస్త్రం హనుమను బంధించలేదా? : వనం జ్వాలా నరసింహారావు

 బ్రహ్మాస్త్రం హనుమను బంధించలేదా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (07-03-2021) ప్రసారం

హనుమంతుడు అశోకవనంలో వున్నా సీతను చూసి, ఆమెతో మాట్లాడి, ఆమెకు రాముడి గుర్తుగా అంగుళీయకం ఇచ్చి, ఈమె గుర్తుగా చూడామణిని తీసుకుని, ఆమెదగ్గర శలవు తీసైకుని వెళ్లిపోయాడు. తనకు శుభమగుగాక, విఘ్నాలు కలగకుండా వుండుగాక! అని సీతాదేవి అనడంతో, ఆమె దయకు పాత్రుడనైనాననుకుంటాడు హనుమంతుడు. ఇంకా చేయాల్సినపని కొంచెం మిగిలుంది అనిపించిందాయనకు. సీతను వెతకమనీ, లంకను చూడమనీ, సుగ్రీవుడు తనకు రెండు పనులప్పగించాడు. సీతను వెతకడం, చూడడం అయిపోయింది. లంకను చూడటమంటే, రాక్షసుల బలాబలాలు బేరీజు వేయడం, రావణుడి అభిప్రాయం తెలుసుకోవడం ఇంకా జరగలేదు. ఇదిచేయాలంటే, సామ-దాన-భేదాలు పనికిరావు. దండోపాయమొక్కటే సరైన మార్గమనుకుంటాడు.

రామలక్ష్మణులు సహాయం లేనివారు, ఏమీ చేయలేరని దురభిప్రాయంతో వున్న రాక్షసుల అపోహ తొలగించాలంటే, సుగ్రీవుడి సహాయముందని ప్రకటించి, యుద్ధం చేసి, కొందరినన్నా చంపాలని అనుకుంటాడు. ఇలా జరుగుతే తక్కినవారు ద్వేషం వదిలి మెత్తబడటమో, వారిలో వారికి విభేదాలు రావటమో జరుగుతుందనుకుంటాడు. తాను యుద్ధంచేసి కొందరిని చంపి వేస్తే రామచంద్రమూర్తి పని సులభం కావచ్చు. సీతాదేవి ఏం చెప్పింది? రాముడే రావాలి, రావణాదులను చంపాలి, తనను తీసుకునిపోవాలనికదా! ఈ సంగతి చెప్పటమంటే రాక్షసుల బలాబలాల విచారణ జరగాలనే! అనుకున్నాడు.

ఏదోవిధంగా, రావణుడిని, వాడి మంత్రులను, సైన్యాన్ని, యుధ్ధానికీడ్చి, దాంతో శత్రువుల బలాబలాలను తెల్సుకుని, వాడి ఆలోచనేమిటో అర్థం చేసుకోవటమే మంచిదనుకుంటాడు. గొప్పగొప్ప వృక్షాలతో, అందమైన తీగలతో వున్న అశోకవనం ఉద్యానవనం ధ్వంసం చేస్తే రావణుడికి కోపం వస్తుందనీ అనుకుంటాడు. ఈ అశోకవనం కార్చిచ్చుతో కాలినట్లు పాడైపోతే, మండిపడ్డ రావణుడు, ఏనుగులతో సహా తనసైన్యాన్ని యుద్ధం చేయమని తనమీదకు పంపుతాడు. వాళ్లను తునాతునకలు చేసి సంతోషంగా కిష్కింధకు పోదామని నిర్ణయించుకుంటాడు.

ఇలా ఆలోచించిన హనుమంతుడు విజృంభించాడు. చెట్లన్నీ కూకటివ్రేళ్లతోసహా పీకి నేలమీద పడేయడం ఆరంభించాడు. ప్రమదావనాన్ని పాడుచేసాడు. క్రీడాపర్వతాలను నేలమట్టం చేసాడు. క్రీడాసరస్సులను విరగ గొట్టాడు. ఆ వనం కార్చిచ్చు తగిలి కాలిపోయినట్లయింది. రావణాసురుడి భార్యలకు ప్రమదావనమైన ఉద్యానవనాన్ని మూలమట్టంగా నాశనంచేసి, సంతోషంతో కయ్యానికి కాలుదువ్వి, యుధ్ధానికెదురు చూస్తూ ఆ వనం తలవాకిటిమీద కూర్చున్నాడు హనుమంతుడు.

సీతకు కాపలాగా వున్న రాక్షస స్త్రీలు దీనికి భయపడి, దిక్కుతోచక, పరుగు-పరుగున రావణుడికి చెప్పటానికి వెళ్లారు. వెళ్లి: "భయంకరమైన వానరరూపంకల వీరుడొకడు సీతతో మచ్చికగా ముచ్చట్లాడి, అశోకవనంలో వున్నాడు. వాడు సీతను వెతికేందుకు వచ్చిన శ్రీరాముడి దూతో, కాదో, తెల్సుకోవడం కష్టంగా వుంది” అని విన్నవించుకున్నారు రావణుడికి.  “నీ వనాన్ని పాడు చేసినందుకు, సీతను పలుకరించినందుకు, కోతి పొగరు అణిగేటట్లు కఠినంగా దండించు. నువ్వు కోరికపడ్డ ఆడదానితో మరొకరొచ్చి మాట్లాడినవాడెవరైనా కాని ప్రాణాలతో వుండవచ్చునా?" అని రెచ్చగొట్తారు రాక్షసులు. ఆమాటలకు మండిపడ్డాడు రావణాసురుడు.

కోపంతో ఊగిపోయాడు రావణుడు. తనతో సమానమైన కింకరులనేవారిని వెంటనే వెళ్లి, ఆ కోతిని పట్టుకునిరమ్మని పంపుతాడు. ఆ కింకరులు ఆయుధాలు, ఖడ్గాలు ధరించి, యుధ్ధకాంక్షతో, హనుమంతుడి మీదకొస్తారు. వారిని చూసి "దృఢపరాక్రమం, ధన్యమైన రూపంకల శ్రీరామచంద్రమూర్తికీ, శత్రువులు సంహరించలేని బలమున్న లక్ష్మణుడికీ, రామలక్ష్మణుల రక్షణలో వుండి, తెంపు, పరాక్రమం, కీర్తిగల వానరనాధుడు సుగ్రీవుడికి, జయంకలుగుకాక... జయంకలుగుకాక" అని స్మరిస్తాడు హనుమంతుడు. (జయ త్సతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: దాసోహం కోసలేంద్రస్య; నరావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్-వీటిని జయమంత్రాలంటారు. సర్వకార్య సిద్ధికి ఈ శ్లోకాలను జపించమన్నారు పెద్దలు. ఇవి నిత్యమూ పఠిం వారిపై క్షుద్రశక్తులు పనిచేయవని పెద్దలంటారు) సమస్తకళ్యాణ గుణాలవల్ల మనోహరుడైన కోసలదేస ప్రభువైన రామచంద్రమూర్తికి తాను దాసుడననీ, శత్రు సంహారకుడైన వాయుపుత్రుడననీ, హనుమంతుడన్న పేరుకలవాడిననీ, వేయిమంది రావణులైనా తనతో యుద్ధంలో సరితూగరనీ, రాళ్లతో, చెట్లతో శత్రువులను సంహరిస్తాననీ గర్జిస్తాడు. లంకను ధ్వంసం చేసి, రాక్షసులందరినీ హింసించి, సీతాదేవికి మ్రొక్కి, రాక్షసులేడుస్తుంటే, కీర్తిమంతుడనై వెళ్తానని అరుస్తాడు.

తన మీదకు వచ్చిన కింకర రాక్షసులందరినీ నుగ్గు చేసాడు. ఇలా కింకర సమూహాన్నంతా చంపి, ఇంకా యుద్ధం చేయాలన్న కోరికతో, జంకూ, గొంకూ లేకుండా, రాక్షసులకు భయంకరంగా కనిపిస్తూ, మళ్లీ తోరణమెక్కి కూర్చున్నాడాయన. అప్పుడు ప్రహస్తుడి కొడుకును యుధ్ధానికి పంపుతాడు రావణుడు. వాడిపేరే "జంబుమాలి". కింకరులందరినీ చంపిన హనుమంతుడు, మేరుపర్వత శిఖరంతో సమానమైన ఓ మేడను చూసాడు. అది గట్టిగా వూగిపోయేటట్లు దానిమీదకు దూకుతాడు. చూడటానికి ప్రాసాదంలాగా వున్న ఆమేడ లంకాధిదేవత గుడి. హనుమంతుడు, ఆ మేడంతా విరగదన్ని, విజయగర్వంతో మరొక్కసారి "జయం-జయం" రాముడికి అని స్మరిస్తూ, వేయిమంది దశకంఠులు కూడా ఒక్క హనుమంతుడికి సరికాదని గర్జిస్తాడు. 

హనుమంతుడి సింహనాదాన్ని విన్న దేవాలయం కాపలాదారులు (చైత్యపాలకులు), ఆయన్ను చుట్టుముట్టారు. కావలి రాక్షసులందరినీ చంపి, ఆకాశంలోకి ఎగిరి, అందరూ వినపడేటట్లు గట్టిగా చెప్తాడీవిధంగా: "ఓ లంకావాసులారా! వినండి. నాలాంటి వేలాది వానరులు సుగ్రీవాజ్ఞ ప్రకారం సీతాదేవిని వెతుకుతున్నారు. వాళ్లంతా నాలాగా బలవంతులే! పది ఏనుగుల బలమున్నవారు కొందరు, నూరేనుగుల, వెయ్యేనుగుల బలమున్న వారు మరికొంతమంది, చెప్పలేనంత బలవంతులు ఇంకొందరు, వాయువేగంతో పోగలిగేవారు ఎంతో మంది వున్నారు వాళ్లలో. వీళ్లందరిరి ఆయుధాలు గోళ్లు, దంతాలు, రాళ్లే! ఇలాంటి కోటానుకోట్ల, లెక్కించనలవికాని వానరులను తీసుకుని, అమేయబలుడు సుగ్రీవుడు ఇక్కడకు రాబోతున్నాడు. వచ్చి మిమ్ముల్నందరినీ చంపబోతున్నాడు. నిష్కారణంగా శ్రీరాముడితో విరోధం తెచ్చుకున్నారు మీరందరూ. రావణుడికీ  లంకకూ, మీకూ ఇక రుణానుబంధం తీరినట్లే!".

దీంతో ఇంతవరకు సీతను లంకలో వుంచిన వార్త అంతఃపురానికి వచ్చేవారికి తప్ప తెలియని ఇతరులకు కూడా తెలుస్తుందిప్పుడు. రహస్యం బయటపడింది. అప్పుడు ప్రహస్తుడి పుత్రుడు జంబుమాలి అక్కడకు అతివేగంగా వచ్చాడు. హనుమంతుడు వేసిన ఒక ఇనుప గుండు దెబ్బకు, జంబుమాలి పొడిపొడిగా, ముక్కలు చెక్కలై నేలకూలాడు. కింకరులు జంబుమాలి చచ్చాడని రావణుడికి తెలిపారు. రావణుడు, ఏడుగురు మంత్రిపుత్రులను పంపాడు హనుమంతుడిమీదకు. వచ్చిన వాళ్లను అరిచేతుల్తో, కాళ్లతో కొట్టి, గోళ్లతో చీల్చేసాడు. మంత్రికుమారుల మరణవార్త విన్న రావణుడు తన ఐదుగురు సేనానాయకులైన, విరూపాక్షుడు, దుర్ధరుడు, యూపాక్షుడు, భాసకర్ణుడు, ప్రహసుడు అనేవారిని పిల్చి, వారి సమస్త సైన్యంతో వెళ్లి, కోతిని పట్టుకుని తెమ్మంటాడు. యుద్ధానికి వచ్చిన వారందరినీ చంపాడు హనుమంతుడు.  

తన ఐదుగురు సేనానాయకులు, యుద్ధంలో మరణించారన్న వార్త విన్న రావణుడు, అక్షుడనే తనకొడుకును యుద్ధానికి బయల్దేరమని చెప్పాడు. బయల్దేరిన అక్షుడు, బలవంతుడైన హనుమంతుడిని సగౌరవ దృష్టితో చూసి, యుద్ధానికి దిగాడు. ఆంజనేయుడు తన చూపులతోనే అక్షకుమారుడి సేనలను దగ్ధం చేసాడు. వాడి యుద్ధ కౌశలాన్ని చూసి ఎలా చంపాలా అని ఆలోచిస్తూనే దేహాన్ని పెంచి, రాక్షసకుమారుడిని చంపే ఉద్దేశ్యంతో, వాడికాళ్లు పట్టుకుని, తిప్పి, వేగంగా బలంకొద్దీ నేలమీద వేసి బాదుతాడు. వాడిచావుకు రావణుడి గుండెలు పగిలి, వాడి వంశ క్షయం మొదలైంది.

అక్షకుమారుడు, చచ్చాడని విన్న రావణుడు హతాశుడైనాడు. ఇంద్రజిత్తును (అసలు పేరు మేఘనాదుడు. ఇంద్రుడిని జయించి ఈ బిరుదు పొందాడు) పిలిచి అతడిని యుధ్ధానికి పంపాలని నిర్ణయించాడు. ఇంద్రజిత్తు, అస్త్రవిద్యలలో ప్రధముడనీ, సమస్త దేవదానవులకు శోకం కలిగించిన వాడనీ, భుజబలంలో ఎల్లలోకాలలో ప్రసిధ్ధికెక్కిన వాడనీ, బ్రహ్మదేవుడి దగ్గరనుండి మహాస్త్రాలు సంపాదించిన వాడనీ, వాడు చేసిన పనులు దేవతలందరకూ తెలుసనీ, అంటాడు రావణుడతడితో. దేవదానవులూ, ఇంద్రుడూ అతడి ఎదుట నిల్చి యుద్ధం చేయడం మాట అటుంచి, మాయలు చేయడంలో కూడా అతడికి సమానులు కారనీ అంటాడు రావణుడు.

తండ్రిమాటలు విన్న ఇంద్రజిత్తు, తండ్రికి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తాడు. యుధ్ధానికి పోతున్న ఇంద్రజిత్తు వేగానికి జంతువులు అరిచాయి, దిక్కులు కాంతిహీనమయ్యాయి, పక్షులు ఆకాశానికెగిరి కూయసాగాయి. ఇంద్రజిత్తు బాణవర్షాన్ని కురిపిస్తూ, హనుమంతుడి దగ్గరకు పోయేప్రయత్నం చేయగా, ఆయన కంఠధ్వనికి, కొండలు బద్దలయ్యి, భూమికదిలి, మేఘాలు చెదిరిపోయాయి. ఇంద్రజిత్తు వేస్తున్న బాణాలు, విచ్చలవిడిగా వచ్చి హనుమంతుడిని తాకాయి. ఈ వీరులిద్దరూ దేవదానవుల్లా విరోధంతో యుద్ధం చేయసాగారు. ఇద్దరూ యుద్ధంలో, సమర్ధులే! ఇద్దరూ అతివేగంగా, అంతులేని పరాక్రమంతో, భూతసమూహాలు ఆశ్చర్యపోతుంటే యుద్ధం చేసారు. వారిద్దరిలో తేడా కనిపించలేదు. ఒకరిలోపం ఇంకొకరికి తెలవడం కష్టమయింది. తన బాణాలన్నీ వ్యర్ధమైపోతుంటే, ఏంచేయాలన్న ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తు.

ఆంజనేయుడెంతకూ తనకు చిక్కడంలేదనుకున్న ఇంద్రజిత్, భుజబలంతో వీడిని చంపడం వీలుకాదనీ, ఏవిధంగానైనా కట్టేయాలనీ, భావించి బ్రహ్మాస్త్రం సంధించాడు. అది ఆంజనేయుడిని కట్టేయడంతో, కోతి నేలకూలిందని సంతోషించారు రాక్షసులు. కాళ్లూ, చేతులూ కదిలించలేక సోలిపోయిన ఆంజనేయుడు, బ్రహ్మ తనకిచ్చిన వరాన్ని గుర్తుచేసుకుంటాడు. భుజపరాక్రమం చాలించి, బ్రహ్మ ఆజ్ఞను దాటకుండడమే మేలని తలుస్తాడు. రాక్షసులకు కొంచెం సేపు చిక్కిపోయినా, తనకు వరాలిచ్చిన బ్రహ్మ, ఇంద్రుడు, తండ్రి వాయుదేవుడు, తన్ను రక్షిస్తుంటే, తనకొచ్చిన భయమేదీలేదనుకుంటాడు. బ్రహ్మ రుద్రేందాదుల వరాలను పొందిన నిరుపమ పరాక్రమశాలి హనుమంతుడు. అతడిని ఏ అస్త్రాలూ బంధించలేవు.

వీళ్లకు చిక్కినా తన్నేమీ చేయలేరనీ, ఏంచేయాలన్నా రావణాజ్ఞ తప్పనిసరనీ, కదలక, మెదలక వూరుకుండిపోయాడు. దుష్ట రాక్షసులు తనమీదపడి, నారతాళ్లతో, నారగుడ్డలు కలిపి, తన్ను కట్టేస్తుంటే, కోతిగుణం తెలిపేవాడిలా కేకలు వేయసాగాడు.

హనుమంతుడు పడిపోవడం చూసిన రాక్షసులు కోపంతో, బలమైన పగ్గాలను నారవస్త్రాలతో ముడేసి, కడు ప్రయత్నంతో తన్ను కట్టేస్తుంటే, రావణుడిని చూడవచ్చుకదా అన్న కోరికతో, ఆ కట్లు సహించి వూరుకున్నాడు ఆయన. ఇంద్రజిత్తు హనుమంతుడిని, "బ్రహ్మాస్త్రం"తో బంధించిన తర్వాత, రాక్షసులు, తాళ్లతో, పగ్గాలతో తిరిగి కట్టేయగానే, బ్రహ్మాస్త్ర బంధాలు తెగిపోయాయి. బ్రహ్మాస్త్ర బంధాలు మరో బంధాలతో కలిస్తే, ఆ బంధాలు విడిపొయినట్లే! దీనర్థం: ప్రపత్తి చేసినవాడు, దాని మీద విశ్వాసం లేక పోతే, ప్రపత్తికి సహాయ పడుతుందని వేరే సాధనాన్ని వుపయోగిస్తే, "ప్రపత్తి" చెడిపోతుంది. ప్రపత్తిలో వున్న అపాయం ఇదే! ఇతర "ఉపాయాల"ను అది సహించదు. ఉత్తములు నీచ సహవాసాన్ని సహించరుకదా! అంతే భరన్యాసం చేసినవాడు మళ్లీ సొంత ప్రయత్నం చేస్తే వాడికి భరన్యాస ప్రభావం మీద నమ్మిక లేనట్లే! భరన్యాసం చేసినవాడు అకించనుడిగా భావిస్తూ వుండాలని పెద్దలంటారు.

తన దేహాన్ని కట్టేసిన అస్త్రబంధాలు వదిలిపోయిన సంగతి ఎరుగని ఆంజనేయుడు చిక్కుబడివున్నాడనీ, తెలిస్తే విజృంభిస్తాడనీ, అప్పుడేంగతనీ  ఇంద్రజిత్తు ఆలోచనలో పడిపోయాడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

No comments:

Post a Comment