Sunday, March 21, 2021

నియత, ప్రాణయుక్త, దేవి అంటే ఏమిటి? : వనం జ్వాలా నరసింహారావు

 నియత, ప్రాణయుక్త, దేవి అంటే ఏమిటి?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (21-03-2021) ప్రసారం  

సీతాన్వేషణకు కపులను నలుదిక్కులకు పంపగా, దక్షిణ దిక్కుకు పోయిన హనుమంతుడి బృందం తప్ప, మిగిలినవారంతా తిరిగి వచ్చిన తరువాత, ఇంకా సీతాదేవి వార్త తెలియరానందున, రామచంద్రమూర్తి సంతాప పడుతుంటాడు కిష్కింధ సమీపంలో. సంతాపపడుతున్న శ్రీరామచంద్రుడిని చూసిన సుగ్రీవుడు, ఆయనతో, ఓదార్పు మాటలతోనూ, ధైర్యవచనాలతోనూ, మాట్లాడాడు. వానరులు నిస్సందేహంగా సీతను చూసొచ్చారనీ, గడువుదాటి కార్యం సాధించకుండా, తన ఎదుటకు వచ్చే ధైర్యం వాళ్లకు లేదనీ, కార్యసాధకులు కాకపోతే, తాతతండ్రులు రక్షించుకుంటూ వస్తున్న ఉద్యానవనంలోకి ప్రవేశించడానికి ఎన్ని గుండెలుండాలనీ, సీతాదేవి వార్త తెలిసి వుండాలనీ, ఈకార్యం సాధించగలవాడు హనుమంతుడొక్కడేననీ, ఇతరులకిది దుస్సాధ్యం అనీ, అంటాడు సుగ్రీవుడు.

ఇలా రామసుగ్రీవులు మాట్లాడుకుంటున్నప్పుడు, సింహనాదాలు చేసుకుంటూ అంగదుడినీ, ఆంజనేయుడినీ, మనస్సులో తలచుకుంటూ, వానరులు సుగ్రీవుడి దగ్గరగా దిగారు. శ్రీరామచంద్రమూర్తితో హనుమంతుడప్పుడు సీతను గురించి సర్వస్వం తెలియ చెప్పే విధంగా, మూడే-మూడు మాటలంటాడు. "నియత, ప్రాణయుక్త, దేవి" అన్న ఆ మూడు మాటలు వింటూనే, సుగ్రీవుడు రామకార్యం ఫలించిందనీ, తన మాట చెల్లించు కున్నాననీ సంతోషించాడు. శ్రీరామలక్ష్మణులు ప్రీతిగా, ప్రియమైన మాటలు చెప్పిన హనుమంతుడిని ప్రేమగా అలాగే చాలాసేపు చూస్తుండిపోయారు.

"నియత" అంటే పాతివ్రత్య నియమం కలదనీ, "ప్రాణయుక్త" అంటే జీవించి వున్నదనీ, "దేవి" అంటే సీతాదేవి అనీ ఆ మూడు మాటలకర్థం. సీతాదేవి ప్రాణాలతో బ్రతికున్నా, శీలం చెడిందయితే చచ్చినదానితో సమానమైంది కనుక, "శీలం" కలదని “నియత” అని మొదలంటాడు. శీలం కలిగిన విషయం నిజమే! చనిపోతే శీలం వున్నా లాభం ఏమిటి? కాబట్టి జీవించే వున్నదని “ప్రాణయుక్త” అంటాడు. "దేవి" శబ్దం తనకు సీతాదేవి మీదున్న భక్తి, గౌరవం చెప్పటానికే! దేవుడి భార్య దేవి. దేవీ శబ్దం లక్ష్మి పర్యాయపదంగా అష్టోత్తర శతనామావళిలో చెప్పబడింది. రామ, దేవ శబ్దాలు సమానర్థం కలిగున్నవే! తనకామె సాక్షాత్తూ "లక్ష్మీదేవి" లాగా కనపడిందన్న భావన.

వానరులందరూ, రామలక్ష్మణసుగ్రీవుల దగ్గరకు పోయి, నమస్కరించి, సీతాదేవి రావణాసురుడి ఇంట్లో వున్న సంగతి, రాక్షసస్త్రీలు ఆమెను బెదిరిస్తున్న విషయం, రావణుడు పెట్టిన గడువు వ్యవహారం, సీతాదేవి పతిభక్తి గురించీ, వివరంగా చెప్పారు. సీతాదేవి క్షేమసమాచారం విన్న శ్రీరాముడు, ఆమె ఎక్కడుంది, ఏంచేస్తున్నది, తన విషయంలో ఏ నియమంతో వుంది, వివరించమని వానరులను అడిగాడు. చూసి వచ్చిన హనుమంతుడినే, ఈ విషయాలన్నీ చెప్పమని మిగిలిన వానరులంటారు. హనుమంతుడప్పుడు, సీతాదేవి వుండే దిక్కుకు తిరిగి, సీతాదేవికి వినయంగా నమస్కరించి, శ్రీరామచంద్రమూర్తితో చెప్పడం మొదలెట్టాడు.

"నూరుయోజనాల సముద్రాన్ని దాటి, సీతను చూసే కోరికతో పోయాను. అక్కడ దేవతల విరోధి రావణాసురుడుండే లంకనే పట్టణముంది. ఆ రాక్షసరాజు ఇంట్లో, ఏకోరికల్లేక, నిన్ను చూద్దామన్న ఒకే ఒక్క కోరికతో, ఊపిరి బిగబట్టుకుని వున్న సీతను చూశాను. దుఃఖమంటే ఏమిటో తెలియక, సుఖపడాల్సిన సీత, చెప్పనలవికాని శోకంతో అశోకవనంలో వుంది. రావణుడి అంతఃపురంలోని చెరలో చిక్కుకున్న సీతాదేవికి కాపలాగా రాక్షసస్త్రీల గుంపులున్నాయి. సర్వకాల సర్వావస్థలందు సీత నిన్ను ధ్యానించడంలోనే నిమగ్నమయింది. దేహం కాంతిచెడి, ప్రాణాలు విడుద్దామని ఆలోచిస్తున్న సీతాదేవిని అదేసమయంలో అతికష్టం మీద చూశాను. నా రాకను ఆమెకు తెలియచేసే వుద్దేశంతో, ఇక్ష్వాకు రాజుకీర్తిని ఆమెను నమ్మించేందుకు, ఆమె వినేటట్లు స్మరించాను".

"మహామహిమగల సీతాదేవి నిన్నే మిగుల నిర్మల స్వభావంతో, మనస్సులోనే స్మరిస్తున్నది. సత్పురుషులను ప్రశంసించే భక్తి, స్వభావం,  పాతివ్రత్యం,  తపస్సు,  ఉపవాసం వదలకుండా, అశోకవనంలో వుంది. ఇది వీరెవ్వరూ నాతో చెప్పిందికాదు. స్వయంగా నాకళ్లతో నేనే చూసాను" అంటూ, తనూ, సీతాదేవీ మాట్లాడామనటానికి గుర్తుగా చిత్రకూట పర్వతంపైన జరిగిన కాకాసుర వృత్తాంతాన్ని చెప్పాడు. చెప్పి," అక్కడ చూసిన సర్వస్వం చెప్పమన్నది సీతాదేవి. చెప్పాను. నెలరోజులెట్లాగో ప్రాణాలు నిలబెట్టుకుంటానన్నది. ఎంత శుష్కించి పోయినా, పతివ్రతా ధర్మాన్ని మాత్రం విడువకుండా, రావణుడింట్లో నిర్బంధంగా జీవిస్తున్నది. ఉన్నదున్నట్లు సర్వం నీకుతెలిపాను. నీవెట్లైనా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేయి" అంటాడు. చెప్పదల్చుకున్నది చెప్పిన తర్వాత, అక్కడున్న వారందరూ నమ్మేటట్లు, సీతాదేవి ఇచ్చిన చూడామణి దివ్య రత్నాన్ని తీసి శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు.

సీతను తలచుకుని, ఆమెను కౌగలించుకున్న రీతిలో, చూడామణిని రొమ్మునకు హత్తుకుని, సీతను తలచుకుంటూ, దుఃఖం పొంగిపొర్లి వస్తుంటే, లక్ష్మణ, సుగ్రీవులతో ఇలా అంటాడు శ్రీరాముడు: "సుగ్రీవా! ఈ చూడామణిని చూడగానే, నామనస్సు ఎక్కడికో పోయింది. దీన్ని మామామగారు, సీతాదేవికి వివాహ సమయంలో ఆమె శిరస్సు అలంకరించాడు. దివ్యమై, సత్పురుష పూజితమై, జలంలో పుట్టిన ఈ చూడామణిని, యజ్ఞం చేస్తున్న మా మామగారికి, ఆయన మీద దయతో, సంతోషంతో ఇంద్రుడు ఇచ్చాడు ఆయనకు. దీనిని చూస్తుంటే, మామామ జనకరాజునూ, తండ్రినీ చూసినట్లు అయింది. సీతాదేవి శిరస్సులో ప్రకాశించే దీనిని చూడగానే సీతాదేవే వచ్చినట్లుగా అనిపిస్తున్నది. నన్ను విడిచి సీత ఇంకొక నెల రోజులు జీవించి వుంటే, ఆమెకు మరణమేలేదు. ఎన్నిరోజులైనా బ్రతికుంటుంది. నేను బ్రతికుండాలంటే నన్నామెదగ్గరకు తీసుకొనిపొండి. సీత ఇలా వుందని వినికూడా, ప్రాణాలతో వుండడం నా వశం కాదు”.

శ్రీరాముడికోరిక ప్రకారం హనుమంతుడు సీతాదేవి చెప్పిన మాటలన్నీ వినిపించాడు. గుర్తుగా చిత్రకాట పర్వతం మీద జరిగిన కాకాసుర వృత్తాంతాన్నీ చెప్పాడు. సీతాదేవిని చూసి, ఓదార్పు మాటలతో నేను, సీతకు కష్టకాలం పోయిందనీ, దుఃఖం అంతరిస్తుందనీ, లంకనెప్పుడు భస్మం చేయాల్నా అని రామలక్ష్మణులిద్దరూ ఎదురు చూస్తున్నారనీ, చెప్పానంటాడు హనుమంతుడు. సీతకు ద్రోహం చేసిన, రావణుడిని బంధువులతో సహా చంపి శీఘ్రంగా అయోధ్యకు రామచంద్రుడు తీసుకుపోయే సమయం వచ్చిందని కూడా చెప్పానంటాడు.

ఆమెకు ఓదార్పుమాటలతో చెప్పిన విషయాలను రాముడికి విన్నవించిన తర్వాత జరిగిన సంభాషణను కూడ చెప్పాడు.  అమ్మా! రాజపుత్రీ! రామచంద్రమూర్తి జ్ఞాపకం వుంచుకునే గుర్తు ఏదైనా ఇవ్వు, అంతమాత్రం చేస్తే చాలు అని తను చెప్పగానే, దగ్గరలో వున్న రాక్షసస్త్రీలెవరూ చూడకుండా, నలుదిక్కులా కలియ చూసి, రావణుడికి తెలియకుండా వుండాలనే వుద్దేశ్యంతో, తలలో ధరించాల్సిన చూడామణిని, చీరె కొంగు ముడిలోనుండి తీసి, తనపై వున్న ప్రేమతో, తన చేతుల్లో వుంచిందంటాడు. అది తీసుకుని ఆమెతో బయల్దేరుతానని చెప్పానన్నాడు. తనపైన శ్రీరాముడికి కల స్నేహ భావం వల్లా, రాముడి దూతనైనందువల్లా, తృప్తిలేని అనురాగంతో, నమ్మకంతో, తనతో సీతాదేవి సంభాషించిందనీ, ఆ వివరాలూ ఆమె మాటల్లో చెప్పాడు.

"నువ్వెట్లాగూ సముద్రాన్ని దాటిపోతావు. రాముడికి నాసంగతులన్నీ చెప్తావు. ఆ అన్నదమ్ములిద్దరూ, వానరసేనతో సముద్రతీరానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే ప్రశ్న. ఎలుగుబంట్లు, వానరులు, రాజకుమారులు, అలవికాని ఆ సముద్రాన్ని ఎట్లా దాటుతారయ్యా? ఈ భూప్రపంచంలో, నువ్వూ, గరుత్మంతుడు, వాయుదేవుడు తప్ప ఇంక ఎవరూ ఈ సముద్రాన్ని దాటలేరని నా అభిప్రాయం. నేనాలోచిస్తున్న కొద్దీ, వారిక్కడకు రావడం, అసాధ్యమైనపనిలాగానే తోస్తున్నది. అయినా కార్యదక్షుడవైన నీకు చేయలేని పనేదీలేదు. దీనికి ఏమని సమాధానమిస్తావు? ఎలానెగ్గుకొస్తావో నాకు తెలియదుకాని, సాధించగలవాడివి మాత్రం నీవొక్కడివే! ఎవరూ చేయలేరు, కీర్తినీ పొందలేరు. కాని నీవిలాచేయడం నాకు కీర్తికరం కాదు"  ఇంకా ఇలా అంటుంది:

"రామచంద్రమూర్తి సైన్యంతో వచ్చి, యుద్ధంలో బల-పరాక్రమాలను ప్రదర్శించి, రావణుడిని చంపి, నన్ను అయోధ్యకు తీసుకొని పోతేనే అది నాకు కీర్తికరం. అప్పుడే నేను వీరపత్నినన్న బిరుదుకు కూడా అర్హురాలిని అవుతాను. ఇది రాముడికి సాధ్యపడుతుందా, పడదా అనేసంగతి వేరేవిషయం. కాని ఇంకే విధంగా జరిగినా నాకు కీర్తికరం కాదు. నేను చెప్పినట్లు చేసి, తన బలంతో, బాణాలతో లంకను భస్మం చేసి, నన్ను వెంట తీసుకునిపోతే, నాకేకాదు, శ్రీరాముడికీ కీర్తి. ఆయన వంశానికీ కీర్తి దక్కుతుంది. నాకోసం కాకపోయినా, తనకోసమైనా నేను చెప్పినట్లు చేయాల్సిందేనని నా కోరిక. ఆడదానినైన నా ఆలోచనావిధానమిది. యుద్ధంలో శూరుడైన రామచంద్రమూర్తికి తగినటువంటి చర్య ఏదో ఆలోచించి చెప్పు".

వానర, భల్లూకరాజైన సుగ్రీవుడు సీత నిమిత్తమై, గొప్ప సైన్యంతో రాముడికి సహాయపడేందుకు నిర్ణయించుకున్నాడనీ, ఆయనతో వచ్చేవారంతా అసమాన పరాక్రమవంతులనీ, దేవతలతో సమానులనీ, మనోవేగం కలవారనీ, దిక్కులలో, ఆకాశంలో సంచరించేవారనీ, వారంతా శీఘ్రంగా రాబోతున్నారనీ, సీతకు ధైర్యం చెప్పానన్నాడు హనుమంతుడు.

  "రామలక్ష్మణులు ఎట్లా వస్తారా అనే సందేహం కానీ, రారని శోకించడం కానీ వదులుకో. నీవు దుఃఖించే కాలంపోయింది. నేనుపోయి చెప్పగానే ఒక్కగంతేసి, వానరులొస్తారిక్కడకు. రామలక్ష్మణులు, సూర్య, చంద్రుల్లాగా నావీపుపైకెక్కి, నీ ఎదుట నిలుస్తారు. వారి బాణాగ్నికి లంకంతా పాడైపోతుంది. రావణుడిని సేనలతో సహా చంపి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకుపోతాడు. మేమెప్పుడొస్తామా అని మా రాకకొరకు ఎదురుచూస్తుండు. ఏ సాహసం చేయొద్దీలోపల. మండుతున్న అగ్నిహోత్రం లాగా రామచంద్రమూర్తిని ఇక్కడ చూస్తావు. రాక్షసుడికేగతి పడ్తుందో చూడు. కొడుకులతో, చుట్టాలతో, మంత్రులతో చచ్చిపోయి రావణుడు నేలకూలగా చూసిన నీవు దుఃఖ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటావు. నీ భర్తను కలుస్తావు" అని చెప్పానన్నాడు.  

కోరలు, గోల్ళు ఆయుధాలుగాగల పరాక్రమవంతులైన వానరులు త్వరలోనే లంకకు రావడం, సీతాదేవే స్వయంగా చూడబోతున్నదనీ, వారి భయంకర సింహనాదాలు లంకలోని పర్వతాలలో వినపడే సమయం ఆసన్నమయిందనీ, తాను సీతాదేవికి చెప్పానన్నాడు హనుమంతుడు. నిబంధన ప్రకారం వనవాసాన్ని గడిపి, విరోధులందరినీ చంపి, సీతాదేవితో సహా అయోధ్యలో పట్టాభిషేకం జరుపుకుంటారనీ కూడా ఆమెతో చెప్పానన్నాడు. ఇలా ఎన్నోవిధాలుగా చెప్పి, ఆమెను నమ్మించి, దుఃఖపడకుండా చేసివచ్చానంటాడు.

హనుమంతుడు రామచంద్రమూర్తికి సీతా వృత్తాంతమే చెప్పాడు కాని, తను పడ్డ కష్టాలను ఒక్కటైనా చెప్పలేదు. చెప్పితే ఆత్మ స్తుతవుతుందనుకుంటాడు. ఇంకో విషయం, శ్రీరామచంద్రుడికి చెప్పాల్సింది సీతా వృత్తాంతం కాని, హనుమంతుడు పడ్డ ప్రయాసకాదుకదా!

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment