Sunday, April 11, 2021

అంగద రాయభారం విఫలమా? : వనం జ్వాలా నరసింహారావు

 అంగద రాయభారం విఫలమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (11-04-2021) ప్రసారం  

సేతువు మీదినుండి లంకా తీరం చేరిన రామచంద్రమూర్తి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు, మైంద ద్వివిదులు, లక్ష్మణుడు, సుషేషణుడు, విభీషణుడు, గజ నల కుముదులు, పనస గవాక్షులు, ఒకచోట చేరి చేయాల్సిన పని గురించి ఆలోచన చేయసాగారు. లంకకు చేరిన వానరులంతా దాన్ని ముట్టడి చేద్దామన్నారు. అలా ముట్టడించినప్పుడు ఎవరే పని చేయాల్నో అని ఆలోచించారు. అప్పుడు విభీషణుడు రావణ సేనా సన్నాహ విధానం రాముడికి చెప్తూ ఇలా అన్నాడు.

         “నా మంత్రులు అనలుడు, శరభుడు, ప్రఘసుడు, సంపాతి; మాల్యవంతుడి మొదటి తమ్ముడు సుమాలి కూతురు కైకసి, రెండవ తమ్ముడు మాలి కొడుకులు అనలుడు, సరపాటి; ప్రహస్తుడి తమ్ముడు ప్రఘసుడు పక్షి వేషంలో శత్రు పురమైన లంకకు పోయి అక్కడ పుర రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన సేనల విధం చూసి వచ్చారు. వారి చెప్పినది చెప్తాను. గొప్ప సేనతో సేనానాయకుడైన ప్రహస్తుడు తూర్పు గవనిని కాపలా కాస్తున్నాడు. దక్షిణాన మహోదర, మహాపార్శ్వలున్నారు. పడమట ఇంద్రజిత్తు వున్నాడు. అతడికి సహాయంగా ఆయుధాలు ధరించిన వారెందరో వున్నారు. ఉత్తరాన రావణుడు స్వయంగా తానే రక్షిస్తున్నాడు. వీడికి సహాయంగా రాక్షస సమూహం వుంది. విరూపాక్షుడు నగర మధ్యప్రదేశాన్ని రక్షిస్తున్నాడు. ఈ విధంగా శత్రువులు తమ సేనను తీర్చిదిద్దారు. లంకలో వేయి ఏనుగులు, పదివేల రథాలు, అశ్వాలు పదివేలు, కోటి మంది పదాతులైన రాక్షసులున్నారు. వీరంతా మహాశూరులు, హింసాసక్తులు, రావణుడి మెప్పు పొందినవారు, భయంకరులు. ఇక నువ్వు శత్రువును గెలవడానికి తగిన సన్నాహం చేయి. రామచంద్రా!”.

         ఇలా విభీషణుడు చెప్పగానే, ఆలోచించిన రామచంద్రమూర్తి శత్రువులను జయించడానికి తన సేనను విభజించాడు. విభజించి ఇలా అన్నాడు. “గొప్ప సేనలతో నలుడు తూర్పు గావని వద్ద నిలిచి ప్రహస్తుడిని గెలవాలి. దక్షిణ దిక్కున అంగదుడు మహోదర, మహాపార్శ్వలను గెలవాలి. ఆంజనేయుడు తన సేనతో పోయి ఇంద్రజిత్తున్న పడమటి దిక్కున నిలిచి లంకను ఆక్రమించాలి. ఇక రావణుడిని చంపే వంతు నాది. వాడున్న ఉత్తర దిశలో నేను లక్ష్మణుడితో వుంటాను. జాంబవంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు సేనా మధ్యాన్ని రక్షించాలి. వానరులెవ్వరూ మనుష్య రూపంలో వుండవద్దు. ఇది నియమం. దీన్ని ఎవరూ, ఎప్పుడూ తప్పకూడదు. నేను, నా తమ్ముడు లక్ష్మణుడు, నా స్నేహితుడు విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు, ఈ ఏడుగురు మాత్రం మనుష్యుల రూపంలో యుద్ధం చేసి శత్రువులను చంపగలం. మరెవరైనా మనుష్యరూపంలో కనబడితే వాడిని శత్రువని వెంటనే వధించాలి. కాబట్టి వానరులెవ్వరూ మనుష్యరూపాలు ధరించకూడదు”. ఇలా సేనలను ఏర్పాటు చేసి తన పని ఫలవంతం కావడానికి ఆలోచన చేస్తూ రామచంద్రమూర్తి లంకను చూడాలనుకుని సువేలాద్రి ఎక్కాడు.

         రామచంద్రమూర్తి సువేలాద్రి ఎక్కగా, ఆయన వెంట లక్ష్మణుడు ఎక్కాడు. ఆ వెనుక సుగ్రీవుడు, మంత్రులతో విభీషణుడు, హనుమంతుడు, అంగదుడు, నీలుడు, మైంద, ద్వివిద, గజగవయ గవాక్షులు, గంధమాదనుడు, శరభుడు, జాంబవంతుడు, హరుడు, శతవలి, సుషేషణ, ఋషుభ, దుర్ముఖులు మొదలైన వారంతా వాయువేగంతో ఎక్కారు. ఇలా అందరూ కొండ ఎక్కి ఆకాశాన్ని తాకుతున్నదా అన్నట్లున్న త్రికూటపర్వత శిఖరం మీదున్న అందమైన ప్రాకారాల వరుసలను, ద్వారాలను చూసి ఆ ప్రాకారాలలో వున్న నల్లటి రాక్షసులను వేరొక ప్రాకారమా అని భావించారు. లక్ష్మణ సుగ్రీవ విభీషణ సహితంగా రామచంద్రమూర్తి ఆ రాత్రి పర్వతం మీదే వున్నాడు.   

         ఉదయం కాగానే రామలక్ష్మణ సుగ్రీవ విభీషణ తదిర వీరులందరూ లంకానగరాన్ని చూసి ఆశ్చర్య పోయారు. సుగ్రీవుడి ఆజ్ఞానుసారం సువేలలోని వానరులు మినహా మిగిలిన వారంతా దండుగా బయల్దేరి లంకమీదకు పోయారు. వారి సింహనాదాలతో, కాలి తొక్కుళ్ళతో   లంకానగరం అంతా అల్లల్ల చలించింది. లంకలో భూమి వణికింది. దూళి అతిశయించింది. ఆ ధ్వనికి భయపడి జంతుసమూహాలు పరుగెత్తాయి. లంకానగరానికి భూషణంగా మనోహరమైన రావణాసురుడి మేడ వుంది. దాన్ని వానరులు మిక్కిలి ఆశ్చర్యంగా చూశారు. రామచంద్రమూర్తి కూడా దాన్ని వానరులతో కలిసి చూశాడు. స్వర్గలోకంతో సమానమైన ఆ పురాన్ని, దాని అందాన్ని చూసిన రామచంద్రమూర్తి ఆశ్చర్యపడి సంతోషంగా సర్వం చూస్తూ వుండిపోయాడు.

         ఇంతలో సుగ్రీవుడు చివాలున రావణుడున్న మేడమీదకు ఆకాశానికి ఎగిరి దూకాడు. దూకిన సుగ్రీవుడు, అల్పకాలమే అయినా నిలిచి భయం లేకుండా రావణుడిని చూసి, ఆ దుష్టుడిని కొంచెమైనా లెక్కచేయకుండా, తనతో యుద్ధం చేయమన్నాడు. సుగ్రీవుడిని చూసి రావణుడు “సుగ్రీవా! నా కంట పడకముందు నీకు చక్కటి మెడ వుంది కాని ఎప్పుడు నాకంట పడ్డావో అప్పుడే మెడలేనివాడివయ్యావు”. ఇలా అంటూ కోపంతో సుగ్రీవుడిని ఎత్తి అవతల పారవైచాడు.

         ఇలా విసిరివేయగా సుగ్రీవుడు పుట్ట చెండులాగా పైకెగిరి చేతులతో రావణుడిని నేలమీదికి తోశాడు. కిందపడ్డ రావణుడు భయపడక, వెనుదీయక త్వరగా లేచి చేతులతో యుద్ధం చేయసాగాడు. వాళ్ళిద్దరూ ఇలా కోపంతో యుద్ధం చేస్తుంటే చెమట నీళ్లు కారాయి. దేహాలలో నెత్తురు ఉబ్బింది. ఇద్దరూ గొప్ప ధైర్యం కలవారై యుద్ధం చేశారు. ఒకరినొకరు కొట్టుతూ, పడతోస్తూ, పెనుగులాడుతూ, ద్వంద్వ యుద్ధంలో నేర్పరులగా యుద్ధం చేశారు. బలవంతులైన ఆ ఇద్దరూ సమానంగా యుద్ధం చేశారు. సుగ్రీవుడిని న్యాయ యుద్ధంలో గెలవలేమని, మాయ చేసి గెలవాలని రావణుడు అనుకున్నాడు. సుగ్రీవుడు వాడి ద్రోహబుద్ధి కనిపెట్టి, వున్నవాడు వున్నట్లే చిటిక వేసే లోపు ఆకాశానికి ఎగిరాడు. అలా రావణుడిని జయించినవాడై, బడలిక ఏమాత్రం లేకుండా సుగ్రీవుడు వేగంగా రాముడి దగ్గరికి పోయాడు.

         సుగ్రీవుడి శరీరం మీద యుద్ధం గుర్తులు చూసిన శ్రీరాముడు అతడిని నిండు మనస్సుతో సంతోషంగా కౌగలించుకుని ఇలా అన్నాడు. “నీవిలాంటి సాహసం చేయవచ్చా? రాజైన వారు సాహసంతో ఇలాంటి పనులు స్వయంగా చేయవచ్చా? నువ్వక్కడ చిక్కుబడి వుంటే సీత గతి ఏంటి? నాగతి ఏంటి? ఈ వానరుల గతి ఏంటి? వీరికి నాయకుడు ఎవరు? నాయకుడు లేకుండా వారెలా యుద్ధం చేస్తారు? మనల్ని నమ్మి వచ్చిన విభీషణుడి గతి ఏంటి? నీ ఒక్కడి అనాలోచిత కార్యం వల్ల ఎందరికి ఎంత కీడు కలిగేదో ఆలోచించు. ఇకమీద నాతో ఆలోచించకుండా ఇతరులకు కష్టం కలిగించే ఇలాంటి పనులు చేయవద్దు”.

         “ఏమి ఆలోచించానంటావా? విను. తనకు, తన స్నేహితుడికి ద్రోహం చేసినవారిని క్షమించకూడదు. కాబట్టి యుద్ధంలో రావణుడిని, కొడుకులతో, బంధువులతో సేనలతో చంపుతాను. నామాట అసత్యం కాకుండా విభీషణుడిని లంకారాజ్యానికి అభిషిక్తుడిని చేస్తాను. బలవంత పెట్టయినా నా సొంతరాజ్యానికి భరతుడిని నిలుపుతాను. ఈ రెండు పనులు చేసి నాప్రాణాలను విడవాలనుకున్నాను”. ఆ తరువాత శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు.

          “లక్ష్మణా! రాక్షసుల కనిష్టసూచకాలు కనపడే సమయంలోనే మనం సేనలతో పోయి లంకను ముట్టడించాలి”. ఇలా అంటూనే, వానరులంతా చూస్తుండగానే వేగంగా కొండ దిగి, “వానరులారా! ఇవే రాక్షసులకు అపజయం కలిగించే శకునాలు కనపడుతున్నాయి. ఈ సమయంలోనే పోయి లంకను ముట్టడి చేస్తే, అల్పకాలంలో రాక్షసులను, లంకను నుగ్గు-నుగ్గు చేయవచ్చు. మీకు రాగల అపాయం లేదు. మీకు అపాయం కలగకుండా నేను చూసుకుంటాను. రండి, లంకను ముట్టడి చేయండి.” అని వానరులకు ఉత్సాహం కలిగే విధంగా సమయోచితంగా రామచంద్రమూర్తి పౌరుష వాక్యాలను పలికాడు.

         ఈ విధంగా రామలక్ష్మణులు లంకాపురాన్ని సమీపించి, దానిని, లోపలివారు బయటికి రాకుండా వుండే విధంగా, వానరసేనను నియమించారు. కొండ శిఖరంలాగా వున్న ఎత్తైన ఉత్తర ద్వారాన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి అడ్డగించాడు. ఆ ద్వారం దగ్గరే రావణుడు లంకాపుర రక్షణ కొరకు కాపున్నాడు. రావణుడు కాపలా వున్న ఉత్తర ద్వారాన్ని అడ్డగించడానికి రామచంద్రమూర్తి తప్ప మరెవ్వరూ సమర్థులు కారు. వానర సేనానాయకుడైన నీలుడు తనకు మైందద్వివిదులు తోడుండగా లంకాపుర తూర్పు ద్వారాన్ని అడ్డగించాడు. గజగవయగవాక్ష ఋషభులు తనకు సహాయంగా వుండగా అంగదుడు తన సేనతో దక్షిణ దిక్కును అడ్డగించాడు. ప్రఘసుడు, ప్రమాథి సహాయులుగా ఆంజనేయుడు పశ్చిమ ద్వారాన్ని అడ్డగించాడు. సుగ్రీవుడు మద్యలో వున్నాడు.

జాంబవంతుడితో కలిసి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి పడమటి వైపు, అంటే, కుడిపక్కన నిలిచారు. హనుమంతుడికి ఎదురుగా ఇంద్రజిత్తు, రామచంద్రమూర్తికి ఎదురుగా రావణుడు వుండడం వల్ల ఈ రెండు వైపులా తాకుడు ఎక్కువగా వుంటుందని సుగ్రీవుడు ఇద్దరి మధ్య నిలిచాడు. ఎప్పుడు యుద్ధం చేద్దామా అని వానరులు ఎదురు చూడసాగారు. ఈ విధంగా తన సేననంతా తగిన స్థలాలో నిలవబెట్టి మంత్రి పుంగవులతో రామచంద్రమూర్తి సమాలోచన చేయసాగాడు.

వీరుడైన అంగదుడిని చూసి రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. “శూరుడా! కోట గోడ దాటి, లంక ప్రవేశించి, రావణుడిని సమీపించి, వాడంటే భయం లేకుండా నీ గొప్పతనానికి తగ్గట్లు నేను చెప్పానని నా మాటలుగా ఇలా చెప్పు. నువ్వు వీరుడివై యుద్ధానికి వస్తే రా. నా బాణాలకు చచ్చి పోగలవు. అలా చేయడానికి నీకు ఇష్టం లేకపోతే గర్వం వదిలి సీతను నాకిచ్చి నా శరణు వేడుకో. ఈ రెంటిలో ఏదో ఒకటి చేయకపోతే నా బాణాలతో లోకంలో రాక్షసులనేవారు లేకుండా చేస్తాను. నీ ఒక్కడి కారణాన రాక్షసవంశమే నాశనం అవుతుంది. నిన్ను చంపి, లేదా, తొలగించి, రాక్షస రాజ్యాదిపత్యం విభీషణుడికి ఇస్తాను. విభీషణుడిని సింహాసనం మీద కూర్చోబెట్టడానికే నేను వచ్చాను” అని అన్నాడు.

ఇలా రామచంద్రమూర్తి చెప్పగా అంగదుడు ఆకాశానికి ఎగిరి, కోట దాటిపోయి, రావణుడు మేడమీద వుండగా అక్కడ దిగి, మంత్రులతో కూడి వున్న రావణుడిని చూసి, సమీపానికి పోయి, రామచంద్రమూర్తి చెప్పిన మాటలను ఒక్క అక్షరం ముక్క కూడా వదలకుండా సర్వం వినిపించాడు. “రామచంద్ర మహారాజు దూతను నేను. ఆయన రాయబారం పంపగా వచ్చాను. నేను వాలి కుమారుడిని. అంగదుడు అంటే నేనే. పుణ్యాత్ముడైన రామచంద్రమూర్తి ఇలా చెప్పాడు. మగవాడివైతే యుద్ధానికి లేచిరా. మంత్రులతో, కొడుకులతో, చుట్టాలతో, స్నేహితులతో సహా నిన్ను చంపుతాను. లోకాలకు నీ బాధ తొలగిస్తాను. సగౌరవంగా సీతను తెచ్చి వెంటనే నాకు సమర్పించకపోతే, శరణు వేడకపోతే, నిన్ను చంపి నీ రాజ్యాన్ని విభీషణుడికి ఇస్తాను అని చెప్పమన్నాడు”.

         అంగదుడు ఇలా చెప్పగానే, రావణుడు కోపంతో అంగదుడిని పట్టుకుని కట్టేయమని, కొట్టమని, చంపమని అరిచాడు. రావణుడు అలా చెప్పగానే అంగదుడు వారికి చిక్కినట్లు నటించి, వారు దగ్గరికి రాగానే వారి మెడలు చంకలో ఇరికించుకుని పక్షిలాగా వేగంగా ఎగిరిపోయాడు. తాను రామచంద్ర మహారాజు దూతననీ, తన పేరు అంగదుడు అనీ, వాలి పుత్రుడననీ, అందరూ వినేట్లు స్పష్టంగా పలికి సింహనాదం చేస్తూ, అంగదుడు ఆకాశ మార్గాన రామచంద్రమూర్తిని చేరుకున్నాడు. ఆయన్ను చూసి రామచంద్రమూర్తి మెచ్చుకుని యుద్ధాన్ని ప్రారంభించాడు. అంగదుడు చేసిన కార్యాన్ని చూసిన రావణుడు ఇది తనకు అపశకునంగా భావించాడు. అక్షౌహిణిల కొద్దీ వస్తున్న వానర సైన్యాన్ని చూసి రాక్షసులు భయపడ్డారు. వానరుల కేకలకు రాక్షసులు హాహాకారాలు చేశారు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

 

 

No comments:

Post a Comment