Saturday, April 17, 2021

ఇంద్రజిత్తు నాగపాశాలు రామలక్ష్మణుల మీద విఫలమా? : వనం జ్వాలా నరసింహారావు

 ఇంద్రజిత్తు నాగపాశాలు రామలక్ష్మణుల మీద విఫలమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (17-04-2021) ప్రసారం  

రామలక్ష్మణ, సుగ్రీవ, హనుమ, అంగద, జాంబవంత నాయకత్వ సారధ్యంలో వానరులు లంకను నాలుగు వైపుల నుండి ముట్టడి చేసిన తరువాత రాక్షసులు రావణుడి ఇంటికి పోయి, ఆ విషయం చెప్పగా అతడికి కోపం వచ్చింది. తన మేడ ఎక్కి వానరులు ఆక్రమించిన విధానం చూశాడు. భూమినే మింగేసే విధంగా వున్న ఈ వానరసేనను ఎలా చంపాల్నా అని ఆలోచించ సాగాడు. ఇదిలా వుండగా రామచంద్రమూర్తి ప్రాకార సమీప ప్రదేశానికి పోయి అన్ని పక్కలా రాక్షసులతో ఆవరించబడి, రక్షించబడి, ధ్వజాలతో అలంకరించ బడిన లంకను చూశాడు.

శ్రీరాముడు విరోధులందరినీ నాశనం చేయమని అనుమతి ఇవ్వగా వానరులు సింహనాదాలు చేస్తూ, విచ్చలవిడిగా, వారి-వారికి నచ్చిన రీతిలో రాక్షస సేనా సమూహాన్ని ఎదిరించారు. ప్రాణాలమీద ఆశ వదలుకుని రావణుడు చూస్తుండగానే బలాతిశయంతో లగ్గపట్టి వానర శ్రేష్ఠులు గుంపులు-గుంపులుగా కోట గోడలను, ద్వారాలను, వనభూములను, నేలను చదరంగా నాశనం చేశారు. ఇలా చేస్తూ, జయం-జయం శ్రీరామచంద్రమూర్తికి, జయం-జయం లక్ష్మణుడికి, రామచంద్రుడి రక్షణలో వున్న సుగ్రీవుడికి జయం-జయం అని సంతోషంగా అరిచారు. “రాక్షసులారా! యుద్ధానికి పొండ” ని రావణుడు చెప్పగానే రాక్షసుల సింహనాదాలు, పెడబొబ్బలు అతిశయించాయి. సముద్రం పొంగి పొర్లినట్లు రాక్షస సేనలు వానరుల మీద పడ్డారు. ఒకనాటి దేవదానవ యుద్ధంతో సమానమైన యుద్ధం రాక్షసులకు, వానరులకు మధ్య జరిగింది.

         యుద్ధంలో రాక్షస సైన్యం ప్రకాశించింది. ఇలా దొమ్మి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్తు అంగదుడితో యుద్ధం చేశాడు. సంపాతి ప్రజంఘుడితో, జంబుమాలి హనుమంతుడితో, మిత్రఘ్నుడు విభీషణుడితో, గజుడు తపనుడితో, నీలుడు నికుంభుడితో, సుగ్రీవుడు ప్రఘసుడితో ఎదిరించి పోరాడారు. లక్ష్మణుడు విరూపాక్షుడిని అడ్డుకున్నాడు. ఇలా ఒకరినొకరు ఎదిరించి దొమ్మియుద్ధం చేస్తుంటే నెత్తురు నేలమీద వ్యాపించింది. మైందుడు, ద్వివిదుడు, సుషేణుడు తదితరులు ద్వంద్వ యుద్ధంలో రాక్షసులను చంపారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. రాత్రి చీకట్లను వ్యాపింప చేసింది. ఆ అంధకారంలో వానర రాక్షసులకు యుద్ధం భీకరంగా జరిగింది. రాత్రుల్లో రాక్షసులకు బలం ఎక్కువ కాబట్టి వారు విజృంభించడం చూసి కోపించిన శ్రీరామలక్ష్మణులు జడివానలాగా బాణాలు కురిపించి రాక్షసులను వధించారు.

         రామలక్ష్మణుల శౌర్యం, రాక్షసుల పరాజయం చూసిన ఇంద్రజిత్తు, ప్రత్యక్ష యుద్ధంలో వీరిని జయించడం సాధ్యం కాదని, కనపడకుండా యుద్ధం చేద్దామనుకున్నాడు. అంగదుడి దెబ్బకు వెనుకడుగు వేసిన ఇంద్రజిత్తు తిరస్కరణీ విద్యను ఆశ్రయించి ఎవరికీ కనబడక తన వాడి బాణాలతో వానరులను బాధించాడు. ఆ సమయంలో రామచంద్రమూర్తి సుగ్రీవుడి దగ్గర నిలబడి హెచ్చరికగా వుండమని చెప్పాడు. ఇంతలో ఇంద్రజిత్తు వానరసేనమీద బాణాల వాన కురిపించాడు. రామలక్ష్మణులను కూడా ఇంద్రజిత్తు తన బాణాలతో బాధించసాగాడు. యుద్ధభూమిలో రామలక్ష్మణుల ఎదురుగా నిలుచుని వారిని జయించడం సాధ్యం కాదని తెలుసుకున్న ఇంద్రజిత్తు, మాయతో వారిని ఖండించాలని భావించి, వానరులంతా చూస్తుండగా వారిని బాణాలతో కట్టివేయాలని ప్రయత్నం చేశాడు.

         తిరస్కరణీ విద్యా బలంతో ఎవరికీ కనబడకుండా ఆకాశాన్నుండి పరాక్రమం చూపుతున్న ఇంద్రజిత్తును వెదకడానికి ఇంద్రుడి మనుమడైన అంగదుడిని, బ్రహ్మ కొడుకు జాంబవంతుడిని, నీలుడిని, సుశేణ పుత్రులను, శరభుడిని, ఋషభుడిని, వినతుడిని, సానుప్రస్థుడిని, ఋషభస్కందుడిని పంపారు. వారెవరూ ఇంద్రజిత్తును చూడలేకపోయారు. ఇంద్రజిత్తు నాగాస్త్ర సమూహాలను ప్రయోగించి రామలక్ష్మణులను ఆ బాణాలతో కట్టిపడేసాడు. బాణాల గాయాలకు వారి దేహం నుండి నెత్తురు కారింది. రామచంద్రమూర్తి విల్లుతో సహా నేలమీద పడిపోయాడు. అన్న నేలమీద పడుకోవడం చూసి లక్ష్మణుడు కూడా తన ప్రాణం మీద ఆశ వదిలి బాణశయ్య మీద పడుకున్నాడు. వానరులంతా వారిని సమీపించి దుఃఖపడ్డారు. కిందపడిపోయిన రామలక్ష్మణులను చూసిన ఇంద్రజిత్తు తనవారికి సంతోషం కలిగే విధంగా మాట్లాడాడు. రాక్షసులను చూసి “రామలక్ష్మణులు ఇద్దరూ బాణాలతో కట్టబడి నేలమీద పడి వున్నారు. చూడండి” అని చెప్పగా కాళ్లు-చేతులు కదిలించకుండా, శ్వాస విడవకుండా, భూమ్మీద పడి వున్న అన్నదమ్ములను చూసి వారి చనిపోయారని రాక్షసులు భావించారు. వాస్తవానికి రామలక్ష్మణులు మూర్ఛ పోయారు కాని చావలేదు. ఆ అస్త్రాలకు కట్టివేయగలంత బలం మాత్రమే వుంది. మంత్రబలం తగ్గగానే కట్లు వూడిపోతాయి.

         ఇంద్రజిత్తు రాక్షస సైన్యం తనను కొలుస్తుంటే బలగర్వంతో లంకలోనికి పోయి తండ్రి రావణాసురుడికి రామలక్ష్మణులు ఇద్దరూ చచ్చారని చెప్పగా అతడు తన ఆసనం మీదనుండి లేచి, “కొడుకా! బలే! బలే!” అని మెచ్చుకున్నాడు. సంతోషంగా రావణుడు కొడుకును కౌగలించుకుని, “ఎలా చంపావు? ఏమి ఉపాయం చేశావు? ఆ విధమంతా చెప్పు” అని అడిగాడు. నాగపాశాలతో వాళ్లను కట్టేసానని, కాళ్లు-చేతులు కదిలించలేకుండా పడిపోయారని జవాబిచ్చాడు ఇంద్రజిత్తు. అక్కడ జరిగిన వ్యవహారమంతా వినిపించాడు రావణుడికి. రామలక్ష్మణుల వల్ల తనకింత వరకూ కలిగిన భయం పోగొట్టుకున్న రావణుడు సంతోషంగా కొడుకును పొగిడాడు. ఇంద్రజిత్తు వెళ్ళిపోయిన తరువాత  రామలక్ష్మణులకు కాపలాగా హనుమదాదులు అక్కడే వుండిపోయారు.

         రామలక్ష్మణులు ఇంద్రజిత్తు చేతిలో చనిపోయారని సంతోషంగా సీతాదేవికి చెప్పి, ఆమె నమ్మడానికి బలవంతంగానైనా పుష్పక విమానం మీద కూర్చోబెట్టి యుద్ధ స్థలానికి తీసుకెళ్ళి వారిని చూపమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. ఆయన ఆజ్ఞానుసారం రాక్షస స్త్రీలు భర్త కొరకు తపిస్తున్న సీతను విమానంలో వుంచి యుద్ధభూమికి తీసుకెళ్లారు. యుద్ధంలో తెలివి తప్పి వున్న నాగపాశబద్ధులైన రామలక్ష్మణులను చూసింది సీతాదేవి. 

         ఆ విధంగా పడివున్న రామలక్ష్మణులను చూసి, సీతాదేవి దుఃఖపడుతుంటే త్రిజట ఆమెకు ఇలా చెప్పింది. “నీ భర్త మరణించలేదు. ప్రాణాలతోనే వున్నాడు. కాబట్టి నువ్వు దుఃఖపడవద్దు. రామలక్ష్మణులు మరణించలేదనడానికి సాక్ష్యం ఈ పుష్పక విమానమే! ఈ పుష్పకం దివ్య విమానం. ఇది భర్త మరణించిన దానిని మోయదు. నీ భర్త మరణించి వుంటే నిన్నిది మోయదు. కాబట్టి నీ భర్త మరణించలేదు. వానరులు వృక్షహస్తులై యుద్ధానికి సిద్ధంగా వున్నారు. ఈ వానర సేన భయపడకుండా రామలక్ష్మణులను కాపాడుతున్నది. వారు మరణిస్తే ఈ కాపలా ఎందుకు? నీమీద నాకున్న ప్రేమవల్ల శుభకారణాలన్నీ చెప్పాను. నా మాట నమ్ము. బాధపడవద్దు. అన్నదమ్ములు ప్రాణాలతో వున్నారు. మరణించలేదు”.

         త్రిజట ఇలా చెప్పగా సీతాదేవి, “అమ్మా! నువ్వు చెప్పినదే వాస్తవం కావాలి” అని చేతులు జోడించి నమస్కారం చేసింది. పుష్పక విమానం మళ్లిపోయి సీతా, త్రిజటలను లంకలో దింపింది. అక్కడినుండి రాక్షస స్త్రీలు సీతాదేవిని అశోకవనానికి పిలుచుకుపోయారు. సీతాదేవి రామలక్ష్మణులను తలచుకుని వారి కష్టాలకు బాధపడ్డది.

         బాణాలతో కట్టుబడి వున్న శ్రీరాముడు స్మృతి తెచ్చుకుని తన సమీపంలోనే బాణాలతో కట్టబడి మూర్ఛపోయి వున్న తమ్ముడిని చూశాడు. చూసి, సహించలేని దుఃఖతో బాధపడి, “ఇది దుర్లభం. బాణాల దెబ్బలకు నా తమ్ముడే మరణిస్తే, నిశ్చయంగా నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడుస్తాను” అన్నాడు.

         రామలక్ష్మణులు ఇద్దరూ ఇంద్రజిత్తు బాణాలకు, ఆయన మాయా యుద్ధంలో పడిపోవడం విభీషణుడికి అమితమైన బాధ కలిగించి దుఃఖపడ్డాడు. రాక్షసులు ధర్మ యుద్ధంలో కాకుండా మోసం చేసి రామలక్ష్మణులను బంధించారు కదా అని బాధపడ్డాడు. లోకంలో ఎవరి దగ్గర చేరితే తనకు గౌరవం కలుగుతుందని విభీషణుడు భావించాడో ఆ ధీరులు రామలక్ష్మణులు ఇద్దరూ మరణించినవారిలాగా పడిపోయారు అని దుఃఖపడ్డాడు. తానూ వ్యర్థమైన కైంకర్య రాజ్యాభిలాష కలవాడినై బతికి కూడా చనిపోయినవాడిలాగా అయిపోయాననుకున్నాడు. దాని ఫలితంగా పాపాత్ముడైన రావణుడి కోరిక సఫలమైంది అనుకుంటాడు.

         ఇలా దుఃఖపడుతున్న విభీషణుడిని సుగ్రీవుడు కౌగలించుకుని “నువ్వే లంకను ఏలుతావు. రావణుడి కోరిక నెరవేరదు. విభీషణా! దుఃఖపడవద్దు. వీరు మూర్ఛపోయారు కాని ప్రాణాపాయం లేదు. వీరు మూర్ఛ నుండి లేవగానే రావణ సేనను, అతడిని చంపుతారు” అని ఊరడించాడు. ఆ తరువాత సమీపంలో వున్న సుషేణుడుని చూసి, రామలక్ష్మణులు మూర్ఛ తెరుకోగానే వారిద్దరినీ తీసుకుని కిష్కింధకు పొమ్మంటాడు. తాను సీతను తెస్తానని అంటాడు.

         జవాబుగా సుషేణుడు సుగ్రీవుడితో మృత సంజీవని విద్యతో కూడిన కొన్ని మూలికలు పాల సముద్రం సమీపంలో వున్నాయని, వాటిని సంపాతి, పనసుడు లాంటి వానరులను పంపించి తెప్పించమని అంటాడు. లేదా ఆంజనేయుడిని పంపమంటాడు. అతడు తన పరాక్రమంతో వాటిని తెస్తాడని అంటాడు. దేవతలు పాలసముద్రం ఎక్కడ చిలికారో అక్కడ ద్రోణ పర్వతం, చంద్ర పర్వతం అనే రెండు కొండలున్నాయని, అక్కడ విశల్యకరణి, సంజీవ కరణి ప్రప్రకాశిస్తాయని వాటిని త్వరాగా తెప్పించమని అంటాడు. ఇంతలో చెవుడు కలిగే పెద్ద ధ్వని వచ్చింది.

         అదే సమయంలో,  మండుతున్న అగ్నిహోత్రుడిలాగా ప్రకాశిస్తూ గరుత్మంతుడు ఆకాశంలో కనబడ్డాడు. ఆయన కనపడగానే రామలక్ష్మణులను చుట్టుకున్న పాపపు పాములన్నీ చెల్లాచెదరై భయంతో పరుగెత్తిపోయాయి. గరుడుడు రామలక్ష్మణులను సమీపించి వారిద్దరూ ముఖకమలాలను ముట్టుకోగానే వారి దేహాలకున్న గాయాలన్నీ మానిపోయాయి. ఆయన అలా ముట్టుకోగానే రామలక్ష్మణులకు బుద్ధిబలం, దేహబలం, వీర్యం, తేజం, ఓజస్సు, ఉత్సాహం, స్మరణ శక్తి, బుద్ధి సూక్ష్మత వృద్ధి చెందాయి. వారి దేహకాంతి బంగారు కాంతికంటే ఎక్కువయింది. గరుత్మంతుడు రామలక్ష్మణులను కౌగలించుకున్నాడు. తానెవరో చెప్పాడు.

“మీకు తోడ్పడడానికి వచ్చాను. దానవులు, అసురులు, గంధర్వులు ఇంద్రుడిని ముందు వుంచుకుని  వచ్చినా నీ శరబంధాలను వదిలించలేరు. ఎందుకంటే వీటిని ఇంద్రజిత్తు మంత్రాల వల్ల కలిగిన అద్భుత శక్తితో సృష్టించాడు. అప్పుడు విషంతో క్రూరమైన కోరలున్న సర్పాలు బాణాల్లాగా వచ్చి, మిమ్మల్ని బంధించాయి. ఈ వృత్తాంతం విని నీమీద వున్న స్నేహభావం వల్ల నేను అతి శీఘ్రంగా బయల్దేరి వచ్చాను. ఆ కట్లను విడిపించాను. రామచంద్రా! రాక్షసులు మోస యుద్ధం చేస్తారు కాబట్టి నువ్వు అప్రమత్తంగా వుండాలి. రాక్షసులకు మోసం చేయడమే బలం. అది లేకపోతే వారు దేనికీ పనికిరారు. కాబట్టి రణంలో మీరు రాక్షసులను నమ్మవద్దు. మీరు ఋజుత్వాన్ని వదలక, వారి మాయలకు లోబడక, హెచ్చరికగా వుండాలి. నేనెవరో యుద్ధం పూర్తయిన తరువాత తెలుసుకుంటావు. నాకు సెలవిస్తే నేను పోతాను. ధర్మ శాస్త్రం నీలాగా తెలిసిన వారెవరూ లేరు. రాక్షస సమూహాలను పూర్తిగా నాశనం చేసి నువ్వు పతివ్రత అయిన సీతను గ్రహిస్తావు”.

         ఇలా చెప్పి ఆకాశమార్గాన గరుడుడు పోయాడు. రామలక్ష్మణులు మూర్ఛ నుండి తెప్పరిల్లారు. రామలక్ష్మణులను అలా చూసిన వానరులు సింహనాదాలు చేసారు. ధ్వనులు చేశారు. అవి విన్న రావణుడు విని ఉలిక్కిపడి విషయం కనుక్కోమని రాక్షసులను ఆదేశించాడు. స్వేచ్చగా యుద్ధభూమిలో తిరుగుతున్న రామలక్ష్మణులను చూసిన రాక్షసుల గుండెలు గుభిల్లుమనగా, ముఖాలు వెలవెల బోయాయి. సర్వం రావణుడికి ఇలా చెప్పారు. “రాజా! ఇంద్రజిత్తు బాణాలతో కట్టబడి కదలక-మెదలక పడివున్న రామలక్ష్మణులు తమ్ము కట్టిన తాళ్ళను తెంచుకుని ప్రకాశిస్తున్నారు”.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)

No comments:

Post a Comment