Monday, September 27, 2021

మాఠర వంశం (బ్రాహ్మణ రాజులు-10) ....... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 మార వంశం (బ్రాహ్మణ రాజులు-10)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           ఖారవేల మహారాజు అనంతరం కళింగ దేశం మార వంశీయుల పాలనలోకి వచ్చింది. సముద్ర గుప్తుడి దక్షిణాపథ, దక్షిణ భారత దిగ్విజయానంతరం కళింగ రాజ్యం చిన్న-చిన్న రాజ్యాలుగా తలెత్తాయి. మార వంశీయులు పిష్టపురం రాజధానిగా కళింగ దేశాన్ని ఏలసాగారు. కాలక్రమంలో వీరికి పిష్టపురం బదులుగా వర్థమాన పురం, సింహపురాలు రాజధానులుగా వర్ధిల్లాయి. ఈ వంశీయులలో మొదటి రాజు శక్తివర్మ. బృహత్పలాయన, శాలంకాయన, ఆనందగోత్రికుల లాగా వీరు కూడా గోత్రనామాన్ని వంశనామంగా గ్రహించిన విప్రులు. శక్తివర్మ నాల్గవ శతాబ్దంలో కళింగ దేశాధీశుడయ్యాడు. ఇతడి రాజధాని పిష్టపురం. ఇతడు క్రీస్తుశకం 350-365 మధ్య కాలంలో 15 సంవత్సరాలు పాలించాడు.

         శక్తివర్మ కుమారుడు అనంతవర్మ క్రీస్తుశకం 365 లో కళింగ రాజ్యాధినేత అయ్యి ఒక సంవత్సరం మాత్రమే పాలించాడు. ఇతడు శక్తిమంతుడు కాదు. శాలంకాయన వంశీయులు, వాసిష్ట గోత్రీకులైన ప్రభువులు పిష్టపురం మీద దండయాత్రలు చేయడం వల్ల అనంతవర్మ తన రాజధానిని సింహపురానికి మార్చాడు. కాని ఎక్కువ కాలం రాజ్యభారం వహించలేదు. ఇతడి అనంతరం ఆయన కుమారుడు అనంత శక్తివర్మ సింహాసనం అధిష్టించాడు. ఇతడు కడు సమర్థుడు. ఇతడి కాలం నుండి సింహపురి మార వంశీయుల రాజధానిగా వర్దిల్లినది. సింహపురం సింగాపురంగా ప్రఖ్యాతిగాంచినది. ఇది శ్రీకాకుళం, నరసన్న పేటల మధ్యన వున్నది. అనంత శక్తివర్మ సింహపుర రాజ్యాన్ని అతి సమర్థవంతంగా క్రీస్తుశకం 365 నుండి క్రీస్తుశకం 394 వరకు 29 సంవత్సరాలు పాలించాడు.

         అనంత శక్తివర్మ తరువాత అతడి కుమారుడు చండవర్మ సింహపురాదీశుడు అయ్యాడు. ఇతడు కళింగ రాజ్యాన్ని క్రీస్తుశకం 394 నుండి క్రీస్తుశకం 400 వరకు 6 సంవత్సరాలు పాలించాడు. చందవర్మ కుమారుడు ఉమావర్మ తండ్రి అనంతరం కళింగ రాజ్య పీఠాన్ని అలంకరించాడు. ఆయన రాజ్యారంభ కాలంలోనే సింహపురాన్ని కోల్పోయాడు. ఇతడు క్రీస్తుశకం 400 నుండి క్రీస్తుశకం 440 వరకు సుమారు 40 సంవత్సరాలు పాలించాడు.

         ఉమావర్మ అనంతరం అతడి కుమారుడు విశాఖవర్మ కళింగ రాజ్యాధికారం వహించాడు. ఇతడు కొద్దికాలం మాత్రమే పాలించాడు. విశాఖవర్మతో మార వంశీయుల పాలన అంతరించింది. కళింగ దేశాన్ని గాంగ వంశీయులు స్వాధీనపర్చుకున్నారు.    

No comments:

Post a Comment