Tuesday, September 28, 2021

పృధ్వీ మూలరాజు వంశం (బ్రాహ్మణ రాజులు-11) ..... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 పృధ్వీ మూలరాజు వంశం (బ్రాహ్మణ రాజులు-11)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           వేంగీ నగరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన శాలంకాయన రాజుల సామంతులుగా, గుణపాశపురం రాజధానిగా, తీరాంధ్రాన్ని ఏలిన మూలరాజు వంశీయులు పరాక్రమవంతులు. సాహసోపేతులు. అరివీర భయంకరులు. శాలంకాయన రాజులలో చివరివారు భీరువులై, అసమర్థులై, భోగలాలసులై, వున్న తరుణంలో మూలరాజు వంశీయుడైన ప్రభాకర మహారాజు స్వతంత్రుడై, తన పరిధి రాజ్యాన్నే కాకుండా, పరిసర సామంతులను ఓడించి, విశాల రాజ్యాన్ని నెలకొల్పి పాలించాడు. ఈ వంశీయులు బ్రాహ్మణులు. ఈ వంశానికి ఆద్యుడు ప్రభాకర మహారాజు.

         ప్రభాకర మహారాజు శక్తిసంపన్నుడు. యుద్ధ విద్యా విశారదుడు. సాహసి. ఇతడు శాలంకాయన ప్రభువుల సామంతుడిగా వుండి, విష్ణుకుండినుల విజృంభణాన్ని గమనించి, స్వాతంత్ర్యం ప్రకటించి, విష్ణుకుండినుల వంశీయులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని, తన సామంత రాజ్యాన్ని సుస్థిరపర్చుకున్నాడు. ఇతడు సుమారు 38 సంవత్సరాలు (క్రీస్తుశకం 360-398) పాలించాడు.

         ప్రభాకర మహారాజు మరణానంతరం అతడి కుమారుడు పృధ్వీమూలరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. పృధ్వీమూలరాజు శక్తిసంపన్నుడు. అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించాడు. ప్రభు భక్తి పరాయణుడు. యుద్ధ విద్యా విశారదుడు. పృధ్వీమూలరాజు రాజకీయ పరిజ్ఞాని. భవిష్యత్కాలాన్ని గమనించి, తండ్రి ప్రభాకర మహారాజు ఆజ్ఞానుసారం, తన ఏకైక కుమార్తె పరమ భట్టారికా మహాదేవిని విష్ణుకుండిన రాజ్యాన్ని ఏలుతున్న మొదటి గోవిందవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. పృధ్వీమూలరాజు వివేకనయ విద్యా సంపన్నుడు. యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు. విష్ణుకుండినుల సామంత రాజుగా వారికి తోడ్పడి వారి రాజ్య విస్తరణకు సహాయం చేశాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 398-460, సుమారు 62 సంవత్సరాలు.

         పృధ్వీమూలరాజు మరణానంతరం అతడి కుమారుడు హరివర్మ మూలరాజ వంశ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ వంశీయుల రాజధాని గుణపాశపురం, నేటి తూర్పు గోదావరి జిల్లాలోని తాడూరు. హరివర్మ తన మేనల్లుడు విష్ణుకుండిన రెండవ మాధవ వర్మకు తన ఏకైక కుమార్తెను ఇచ్చి వివాహం చేయడమే కాకుండా, శాలంకాయన రాజ్యాన్ని విష్ణుకుండిన మహాసామ్రాజ్యంలో విలీనం కావడానికి తోడ్పడ్డాడు. హరివర్మ క్రీస్తుశకం 460-528 మధ్య కాలంలో సుమారు 68 సంవత్సరాలు పాలించాడు.

         హరివర్మ కుమారుడు మూలరాజు. ఇతడు పల్లవ  సింహవర్మను ఓడించి తన ప్రభువైన విక్రమేంద్ర భట్టారకునికి విజయం చేకూర్చాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 528-580, సుమారు 52 సంవత్సరాలు. మూలరాజుతో ఈ వంశం అంతరించినది.        

1 comment:

  1. నమస్కారం నరసింహారావు గారు!! ఈ ధారావాహిక చాలా బగుందండీ. దయచేసి కొనసాగించమని మనవి. అలాగే ఈ "బ్రాహ్మణ రజ్య సర్వస్వం" అనే పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కుడా దయచేసి తెలియజేయమన్ మనవి.

    భవదీయుడు
    - శశికుమార్

    ReplyDelete