Sunday, October 3, 2021

రాజపుత్రస్థాన ఘూర్జర వంశం (బ్రాహ్మణ రాజులు-14) ..... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 రాజపుత్రస్థాన ఘూర్జర వంశం (బ్రాహ్మణ రాజులు-14)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

         క్రీస్తుశకం ఆరవ శతాబ్ది ఉత్తరార్థంనుండి ఘూర్జరులు ప్రసిద్ధికెక్కారు. వీరు గుప్త రాజ్య పతనానంతరం విజృంభించి రాజ్యస్తాపన చేశారు. పూర్వకాలంలో గుజరాత్ ఘూర్జర దేశంగా పరిగణించబడింది. గుజరాత్ ప్రాంతాన్ని ఏలడం వల్ల వీరు ఘూర్జరులు అని పిలువబడ్డారు. రాజాస్థాన్ లోని జోద్పూర్ ప్రాంతంలో ఘూర్జరుల రాజ్యం వర్దిల్లినది. గుజరన్వాల, గుజరాత్, పంజాబ్ రాష్ట్రంలోని గుజర్ ఖాన్, గుజరాత్ గా వ్యవహరించబడ్డ సహరాన్పూర్ జిల్లా ఘూర్జరుల ఆవాస స్థలాలుగా పరిగణించబడ్డాయి.

         ఘూర్జరులు అనేక ప్రదేశాలలో రాజ్యాలను నెలకొల్పి పాలించారు. వీరు మొదట్లో హిమాలయా పర్వత పశ్చిమ భాగాలలోనూ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, సింధు రాష్ట్రంలో వున్న కొండ ప్రదేశాలలో నివసించారు. భారతావని మీద దండయాత్రలు చేసిన హూణుల వెంట ఘూర్జరులు వచ్చి, పంజాబ్, రాజపుత్ర స్థానం, గుజరాత్ ప్రాంతాలలో నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్ ప్రదేశంలో వున్న అనేక ప్రదేశాల పేర్లు ఘూర్జర నామ సామ్యాన్ని కలిగి వున్నాయి. ఘూర్జరులు భారతీయులే అని, వారు గుజరాత్ రాష్ట్ర వాసులని, విదేశీయులు కానేకారని పలు ఆధారాలున్నాయి.

         ఘూర్జర వంశ స్థాపకుడు హరిశ్చంద్రుడు. ఇతడు గుప్త సామ్రాజ్య పతనానంతరం రాజపుత్ర స్థానమందలి జోధ్పూర్ నగరాన్ని రాజధానిగా ఘూర్జర రాజ్యాన్ని స్థాపించాడు. హరిశ్చంద్రుడు సమరశూరుడు. బ్రాహ్మణుడు. వేదాధ్యయనం చేసినవాడు. అతడు వాకాటక, విష్ణుకుండిన, కదంబాది బ్రాహ్మణ వంశీయుల లాగానే క్షత్రియ ధర్మం అవలంభించి సైన్యాన్ని సమకూర్చుకుని, క్రీస్తుశకం 550 లో జోధ్పూర్ నగరాన్ని ఆక్రమించి, ఘూర్జర రాజ్య స్థాపన చేసి, పరిసర భూభాగాలను జయించాడు. హరిశ్చంద్రుడు వేదవిదుడై అనేక శాస్త్రాలను అభ్యసించాడు.

         హరిశ్చంద్రుడికి ఇద్దరు భార్యలు. ఒకరు కులస్త్రీ కాగా, వేరొకరు క్షత్రియ వంశ సంజాత. బ్రాహ్మణ స్త్రీ వల్ల కలిగిన సంతతి ప్రతీహార బ్రాహ్మణులు అని పిలవబడ్డారు. క్షత్రియ వనిత వల్ల కలిగిన సంతానం ప్రతీహార రాజవంశం వారైనారు.

         గుప్తరాజ్యం పతనావస్థలో వున్న సమయంలో హరిశ్చంద్రుడు మిహిరకులుడిని, యశోధరుడిని ఎదిరించి రాజ్యస్థాపన చేశాడు. హరిశ్చంద్రుడు తాను స్థాపించిన ఘూర్జర రాజ్యాన్ని క్రీస్తుశకం 550 నుండి క్రీస్తుశకం 565 వరకు 15 సంవత్సరాలు పాలించాడు.

         హరిశ్చంద్రుడికి క్షత్రియ రాణి భద్రాదేవి వల్ల నలుగురు కుమారులు పుట్టారు. ఈ నలుగురు వేర్వేరు రాజ్యాల పాలకులుగా వుండేవారు. ఒక కుమారుడు రజ్జల రాజు మాండవ్యపుర రాజ్యాన్ని 25 సంవత్సరాలు పాలించిన తరువాత అతడి కుమారుడు నరభట రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 590 నుండి క్రీస్తుశకం 620 వరకు, సుమారు 30 సంవత్సరాలు.

         నరభట అనంతరం అతడి కుమారుడు నాగభట మాండవ్యపుర రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడి రాజధాని జోధ్పూర్ పట్టణానికి దగ్గరలో వున్న మెడంతకం. నాగభట ఘూర్జర రాజ్యాన్ని క్రీస్తుశకం 620 నుండి క్రీస్తుశకం 640 వరకు సుమారు 20 సంవత్సరాలు పాలించాడు. నాగభట తరువాత ఇతడి వంశానికి చెందిన 8 తరాల వారు, 10 మంది రాజులు సుమారు 200 సంవత్సరాలు ఘూర్జర రాజ్యాన్ని ఏలారు.         

No comments:

Post a Comment