Monday, October 4, 2021

నందిపురి ఘూర్జర వంశం (బ్రాహ్మణ రాజులు-15) ...... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 నందిపురి ఘూర్జర వంశం (బ్రాహ్మణ రాజులు-15)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           నందిపురి ఘూర్జర వంశపు రాజులు, రాజస్థాన ఘూర్జర స్థాపకుడైన హరిశ్చంద్రుడి సంతతివారు. హరిశ్చంద్రుడికి నలుగురు కుమారులు. భోగభట, కక్క, రజ్జిల, దడ్డ  అనే ఆ నలుగురిలో మొదటి ఇద్దరికీ పాలనా విషయాలు అంతగా తెలియదు. కాని రజ్జల మాండ్యపుర రాజ్యాన్ని పాలించగా, దడ్డ నందిపురి రాజ్యపాలనా బాధ్యత వహించాడు.

         ఘూర్జర వంశీయుడైన మొదటి దడ్డరాజు క్రీస్తుశకం 575 లో రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడి వంశీయులు భరుకచ్చం రాజ్యానికి తోడుగా అవంతీనగరం రాజధానిగా కల రాజ్యాన్ని సైతం పాలించారు. వీరు ప్రతీహారులుగా పరిగణింపబడినారు. శాసనాల ఆధారంగా నందిపురి ఘూర్జర రాజ వంశీయులు క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 641 వరకు పాలించారు.

         మొదటి దడ్డరాజు బలపరాక్రమ సంపన్నుడు. ప్రజ్ఞాశాలి. ఇతడు భరుకచ్చం రాజ్య సరిహద్దులలో వున్న నాగ రాజులను ఓడించి, వారి రాజ్యాలను స్వాధీనపర్చుకున్నాడు. మొదట్లో దడ్డరాజు వంశేయులు రాజస్థాన ఘూర్జర రాజుల సామంతులుగా వుంది, తరువాత బాదామీ చాళుక్యుల విధేయ సామంతులుగా మారారు. దడ్డరాజు స్వతంత్ర పాలకుడిగా క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 600 వరకు సుమారు 25 సంవత్సరాలు ఘూర్జర రాజ్యాన్ని పాలించాడు.

         మొదటి దడ్డరాజు కుమారుడు జయభటరాజు. ఇతడు తండ్రితో కలిసి అనేక యుద్ధాలు చేశాడు. ఇతడి పాలనాకాలం 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 600-క్రీస్తుశకం 615). జయభటరాజు కుమారుడు రెండవ దడ్డరాజుతండ్రి అనంతరం బ్రోచ్ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి రాజ్యానికి ఉత్తరాన మహీనది, దక్షిణాన కిమ్, పడమర సముద్రం, తూర్పున మాళవ, ఖాందేశ్ రాజ్యాలున్నాయి. నందిపురం ఈ వంశీయుల రాజధాని. నందిపుర నగరమే బ్రోచ్ లేక భరుకచ్చం. రెండవ దడ్డరాజు నందిపుర రాజ్యాన్ని క్రీస్తుశకం 615 నుండి క్రీస్తుశకం 635 వరకు 20 సంవత్సరాలు ప్రశాంతంగా పాలించాడు.

         రెండవ దడ్డరాజు కాలం నుండి ఈ వంశీయులు కాలచురి రాజ వంశీయులతో వైరం కలిగి వున్నారు. రెండవ దడ్డరాజు బాదామీ చాళుక్యుల సామంతుడు. ఇతడు, ఇతడి వంశీయులు రెండవ పులకేశికి, కాలచురి రాజులతో జరిగిన సంగ్రామాలలో సహాయపడ్డారు. కాలచురి రాజ్యాన్ని జయించిన చాళుక్యులు ఆ రాజ్యాన్ని తమ రాజ్యంతర్భాగంగా గ్రహించారు. రెండవ దడ్డరాజు తరువాత అతడి కుమారుడు రెండవ జయభట, అతడి వంశీయులైన మూడవ దడ్డరాజు, మూడవ జయభట, ఆహిరోల, నాలగవ జయభట నందిపురి రాజ్యాన్ని పాలించారు.         

No comments:

Post a Comment