Thursday, October 21, 2021

ప్రతీహారవంశం (బ్రాహ్మణ రాజులు-23) ....... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 ప్రతీహారవంశం (బ్రాహ్మణ రాజులు-23)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు

           భారత దేశంలోని రాజపుత్ర స్థానాన్ని పాలించిన రాజవంశాలలో ప్రతీహార వంశం ప్రముఖమైనది. హరిశ్చంద్రుడు అనే బ్రాహ్మణుడు ఈ రాజ్యస్థాపకుడు. ఈ వంశంలో చివరివాడు శీలుకుడు. ఇది తరువాత కాలంలో గొప్ప శక్తి సమన్వితమైన రాజ్యంగా రూపుదిద్దుకున్నది. ప్రతీహార వంశానికి చెందిన రాజులు వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రాగ్దక్షిణ ప్రదేశాలలో చిన్న చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలించారు. కొందరేమో లాట దేశంలోని నందిపురి రాజధానిగా దక్షిణ భాగాన్ని ఏలారు. ఘూర్జర రాజ్యాన్ని ప్రతీహార వంశానికి చెందిన ప్రధానమైన శాఖ వారు పాలించినట్లు కూడా ఆధారాలున్నాయి. ప్రధాన శాఖకు చెందిన ప్రతీహార ప్రభువులు జోధ్పూర్ రాజధానిగా పాలన చేశారు. ప్రతీహార వంశీయుడైన నాల్గవ వత్సరాజు జాలార్, అవంతీ రాజ్యాలను పాలించినట్లు ఆధారాలున్నాయి. నాల్గవ వత్సరాజు, అతడి పూర్వీకులు ఉజ్జయినీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు.

         ప్రతీహార వంశం క్రీస్తుశకం 8 వ శతాబ్ది ప్రథమార్థంలో ప్రాముఖ్యంలోకి వచ్చింది. నాగభట్టు అనే ప్రతీహార ప్రభువు మ్లేచ్చరాజును ఎదిరించి ఓడించాడు. ఇతడే మొదటి నాగభట్టు. ఇతడు భారతావని మీద దండెత్తి వచ్చిన అరబ్బు రాజులను కూడా ఓడించాడు. మొదటి నాగభట్టు ప్రాక్ ప్రతీహార శాఖకు చెందినవాడు. మొదటి నాగభట్టు క్రీస్తుశకం 730 నుండి క్రీస్తుశకం 756 వరకు సుమారు 27 సంవత్సరాలు పాలించినట్లు ఆధారాలున్నాయి. మొదటి నాగభట్టు సైన్యాన్ని సమీకరించుకొని, మాళవము, రాజపుత్ర స్థానం, ఘూర్జరము లోని కొన్ని ప్రాంతాలను జయించి శక్తి సమన్వితమైన ప్రతీహార రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాగభట్టు భారత జాతి గర్వించదగ్గ మహారాజు. విదేశీయుల దాడులను అరికట్టి గొప్ప జాతీయ నాయకుడిగా ప్రసిద్ధికెక్కాడు.

         మొదటి నాగభట్టు అనంతరం అతడి సోదరుడి కుమారులు కక్కుకియా, దేవరాజు అనేవారు ఒకరి తరువాత ఒకరు రాజ్యపాలన చేశారు. దేవరాజు కుమారుడు వత్సరాజు చారిత్రిక పురుషుడు. గొప్ప బలవంతుడు. శక్తిమంతుడైన రాజు. ఇతడు రణహస్తి వత్సరాజుగా ప్రఖ్యాతుడు. వత్సరాజు తన రాజ్యానికి ఉత్తర దిశలో వున్న భూభాగాన్ని, మధ్య రాజపుత్ర స్థానాన్ని పాలించాడు. భండి తెగవారి నుండి వారి రాజ్యాన్ని వత్సరాజు బలవంతంగా గ్రహించాడు. వత్సరాజు గౌడ ప్రభువును కూడా జయించాడు. వత్సరాజు ఉత్తరాపథంలోని అనేక రాజ్యాలను జయించి మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.

         వత్సరాజు మరణానంతరం అతడి కుమారుడు రెండవ నాగభట్టు ప్రతీహార రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు అనేక రాజ్యాలను జయించి తన రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. అనేక గిరి దుర్గాలను కూడా స్వాధీన పర్చుకున్నాడు. రెండవ నాగభట్టు అనేక విజయాలను సాధించినప్పటికీ, చివరకు రాష్ట్రకూటాన్వయుల చేతిలో పరాజితుడయ్యాడు. విశాల సామ్రాజ్య నిర్మాణానికి ప్రయత్నించిన ప్రతీహార రెండవ నాగభట్టు కోరిక కలగా మిగిలిపోయింది. రాష్ట్రకూటులతో రెండవ నాగభట్టు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ, అతడు అజ్ఞాతవాసిగా జీవిస్తూ, తిరిగి రాజ్యాన్ని సంపాదించి, ప్రతీహార సామ్రాజ్యంలోని కొన్ని భాగాలను పాలించాడు. ఇతడు క్రీస్తుశకం 833 వరకు పాలించాడు.

         రెండవ నాగభట్టు అనంతరం, అతడి కుమారుడు రామభద్రుడు సింహాసాన్ని అధిష్టించి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతడు పిరికివాడు. యుద్ధంలో వెనుకంజ వేసేవాడు. పరిపాలనా పటిమ లేనివాడు. విశాల ప్రతీహార రాజ్యంలోని అధిక భూభాగాన్ని ఇతడు యుద్ధాలలో కోల్పోవాల్సి వచ్చింది. ఇతడు ఆదరణ కోల్పోయి కేవలం నామ మాత్రపు ప్రభువుగా కొనసాగాడు. రామభద్రుడి పాలనాకాలం క్రీస్తుశకం 833-835.  

         రామభద్రుడి కుమారుడు భోజుడు బాల్యం నుండే సమస్త విద్యలలో ఆరితేరి తండ్రి మరణానంతరం ప్రతీహార సింహాసనం అధిష్టించాడు. శత్రువుల హస్తగతమై వున్న కన్యాకుబ్జాన్ని భోజరాజు జయించి తన రాజధానిగా చేసుకొన్నాడు. శత్రురాజుల వశమై పోయిన రామభద్రుడి కాలంలో దానం ఇచ్చిన అగ్రహారాలను భోజరాజు పునరుద్ధరించాడు. భోజుడు రాజ్యాధికారం వహించిన తరువాత అనేక రాజ్యాలను జయించి పూర్వ ప్రతీహార రాజ్యాన్ని పునరుద్ధరించాడు. అయితే పాల వంశీయుడైన దేవపాలుడు ప్రతీహార రాజ్యం మీద దండెత్తి భోజుడిని ఓడించాడు. భోజుడు పట్టుదల కలవాడు. ప్రతిభావంతుడు. అపజయాలను లెక్కచేయకుండా సైన్యాన్ని సమకూర్చుకుని, క్రీస్తుశకం 9 వ శతాబ్దాంతంలో దండయాత్రలు నిర్వహించి విజయాలు సాధించాడు. ప్రతీహార భోజుడు కడు సమర్థుడు. యుద్ధ విద్యా విశారదుడు. విశాల సామ్రాజ్యాన్ని తన వారసులకు అప్పచెప్పాడు. క్రీస్తుశకం 855 లో ఇతడు మరణించాడు.  

         భోజుడి తరువాత రాజ్యానికి వచ్చిన ప్రతీహార పాలకులు బలహీనులు, భోగాలాలసులు. వారి పాలనా కాలంలో మాళవము రాష్ట్రకూటుల స్వాధీనమైపోయింది. కానిభోజుడి అనంతరం రాజ్యానికి వచ్చిన మొదటి మహేంద్రపాలుడు మాత్రం పూర్వం ప్రతీహార సామ్రాజ్యంలో వున్న మాళవమును తిరిగి జయించగలిగాడు. యుద్ధాలలో కోల్పోయిన రాజ్య భాగాలు పోగా మిగిలిన విశాల ప్రతీహార సామ్రాజ్యాన్ని మొదటి మహేంద్రపాలుడు అవిచ్చిన్నంగా పాలించాడు. తండ్రి ఆర్జించి ఇచ్చిన రాజ్యానికి అదనంగా మహేంద్రపాలుడు అనేక ప్రాంతాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తృతపరచాడు. యితడు క్రీస్తుశకం 885 నుండి క్రీస్తుశకం 908 వరకు పాలించాడు.

         మహేంద్రపాలుడు మరణించిన తరువాత అతడి కుమారుడు రెండవ భోజుడు ప్రతీహార సామ్రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు రాజ్యానికి వచ్చిన తరువాత సవతి సోదరుడు మహీపాలుడితో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. చివరకు మహీపాలుడు సింహాసనాన్ని ఆక్రమించాడు. అంతఃకలహాల్లో కూరుకుని బలహీనపడివున్న ప్రతీహార రాజ్యభాగాలను రాష్ట్రకూటులు ఆక్రమించుకున్నారు. మహీపాలుడు చాళుక్య నరసింహుడి ధాటికి తట్టుకోలేక పారిపోయి, అలహాబాద్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఆ తరువాత కాలంలో చెల్లాచెదరైన తన సైన్యాన్ని సమీకరించుకొని, సామంతులను కూడగట్టుకొని, మహీపాలుడు, ప్రతీహార సామ్రాజ్యాన్ని పునరుద్ధరించుకున్నాడు. క్రీస్తుశకం 942 వరకు మహీపాలుడు పాలించాడు.

         మహీపాలుడి కుమారుడు ఆ తరువాత ఒక ఏడాది మాత్రమే పాలించాడు. ఆ తరువాత నలుగురు రాజులు సుమారు 15 సంవత్సరాలు పాలించారు. ప్రతీహార సామ్రాజ్యం రాష్ట్రకూట, పాల వంశీయుల దండయాత్రల వల్ల క్షీణించ సాగింది. సుమారు ఒక శతాబ్దికాలం మహావైభవంగా అనుభవించిన ప్రతీహార వంశం, ఉత్తర భారత దేశంలో మహా సామ్రాజ్య స్థాపన చేసిన వంశంగా ప్రసిద్ధికెక్కింది.                    

No comments:

Post a Comment