Wednesday, August 26, 2020

పృథుచక్రవర్తి, విజితాశ్వుడు, ప్రాచీనబర్హి .... శ్రీ మహాభాగవత కథ-17 : వనం జ్వాలా నరసింహారావు

 పృథుచక్రవర్తి, విజితాశ్వుడు, ప్రాచీనబర్హి 

శ్రీ మహాభాగవత కథ-17

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         యజ్ఞ యాగాదులు చేస్తే విశేష ఫలం లభిస్తుందని భావించిన పృథుచక్రవర్తి వంద అశ్వమేధయాగాలను చేయాలని దీక్షబూని యాగాలు చేయసాగాడు. ఆయన చేస్తున్న యజ్ఞకర్మలో సాక్షాత్తు నారాయణుడు విచ్చేశాడు. పృథుచక్రవర్తికి కావాల్సిన హవిస్సులు మొదలైన వాటిని భూమాత సమకూర్చింది. ప్రకృతిలో వున్న సమస్త జీవరాశులు తమ దగ్గరున్నవన్నీ సమకూర్చాయి. సమస్త జనులు కానుకలిచ్చారు. అలా పృథుచక్రవర్తి 99 యాగాలను వైభవంగా నిర్వహించాడు. నూరవ యజ్ఞంలో పుండరీకాక్షుడిని పూజ చేస్తున్న సమయంలో, ఇంద్రుడు అక్కసుతో యజ్ఞపశువును అపహరించి ఆకాశ మార్గంలో మాయమయ్యాడు. ఇది గమనించిన అత్రి మహాముని పృథుచక్రవర్తి కొడుక్కు సమాచారం ఇచ్చాడు. అతడు దేవేంద్రుడి వెంట బడ్దాడు. అతడిని పట్టుకుని మీద దూకే సమయానికి తన మాయావేషాన్నీ, గుర్రాన్నీ వదిలి అంతర్థానమయ్యాడు. పృథుచక్రవర్తి కుమారుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వచ్చాడు. మరోమారు దేవేంద్రుడు అదే పని చేశాడు. మళ్లీ పృథు కుమారుడు ఆయన వెంటబడేసరికి అశ్వాన్ని వదిలి పారిపోయాడు. ఇదంతా తెలుసుకున్న పృథుచక్రవర్తి ఇంద్రుడిని చంపడానికి పూనుకోగా ఋత్విక్కులు వారించారు.

పృథుచక్రవర్తి యజ్ఞం కొనసాగిస్తుండగా బ్రహ్మదేవుడు వచ్చి, 99 యజ్ఞాల ఫలం లభించాలని ఆయన్ను దీవించి, మోక్షధర్మం తెలిసిన పృథుచక్రవర్తిని ఇక ఇంతటితో యజ్ఞాలు చేయడం చాలించమనీ, దేవేంద్రుడికి కోపం రాకుండా ప్రవర్తించమనీ సలహా ఇచ్చాడు. ఆయన ఎవరివల్ల ఎందుకు సృష్టించబడ్డాడో గ్రహించి, తదనుగుణంగా, పరబ్రహ్మ సంకల్పానుసారం ధర్మాన్ని పాలించమని కూడా చెప్పాడు. ఇంద్రుడు కల్పించిన ప్రచండ పాషండ మార్గమైన మాయను జయించమని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞను పాటించి, పృథుచక్రవర్తి దేవేంద్రుడితో సఖ్యత పెంచుకున్నాడు. యజ్ఞదీక్షను విరమించి అవభృత స్నానం చేశాడు. అక్కడున్న వారంతా ఆయన్ను దీవిస్తున్న సమయంలో, యజ్ఞభోక్త, యజ్ఞకర్త, భగవంతుడూ అయిన సర్వేశ్వరుడు ఇంద్రుడితో సహా వచ్చాడు. నూరవ అశ్వమేధ యాగానికి భంగం కలిగించిన ఇంద్రుడు పృథుచక్రవర్తిని క్షమాపణ కోరడానికి వచ్చాడనీ, ఆయన్ను క్షమించమనీ అన్నాడు శ్రీహరి. ఇంకా ఇలా అన్నాడు ఆ సర్వేశ్వరుడు పృథుచక్రవర్తితో:

"నువ్వు సుఖదుఃఖాల పట్ల సమానమైన చిత్తం కలవాడిగా ఉండాలి. అందరిపట్ల సమానంగా ప్రవర్తించు. ఈ సమస్త లోకాన్నీ రక్షించాల్సిన బాధ్యత నీదే. విప్రుల అనుమతితో, సంప్రదాయ సిద్ధమైన ధార్మిక మార్గాన్ని స్వీకరించి, అర్థకామాల పట్ల ఆసక్తి లేకుండా, ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాల పట్ల సమాన దృష్టిని కలిగి ఉండు. ప్రజానురంజకంగా రాజ్యాన్ని పాలించు". ఇలా చెప్పి, ఆయనకొక వరమిస్తాననీ, కోరుకొమ్మనీ అన్నాడు. జవాబుగా పృథుచక్రవర్తి, నిర్మలమై ప్రకాశించే భగవంతుడి కీర్తిని వినడం కోసం తనకు పదివేల చెవులను ప్రసాదించమని, అదే తన అభిమతమని అన్నాడు. అలాగే తత్త్వ జ్ఞానాన్ని మరిచిపోయిన అజ్ఞానులకు వెంటనే తత్త్వమార్గాన్ని చూపగలిగే వరాన్ని కూడా అనుగ్రహించమని, అంతకంటే తనకేవరం అక్కరలేదని అన్నాడు. ఆయన కోరిన వరాలను ఇచ్చి నారాయణుడు ఆయన చేసిన పూజలను స్వీకరించి బయల్దేరి, దేవతలు కీర్తిస్తుండగా, వైకుంఠానికి చేరుకున్నాడు. పుణ్యభూమి (యజ్ఞశాల) నుండి బయల్దేరి పృథుచక్రవర్తి నగరానికి చేరి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత భూమండలాన్ని పరిపాలించి, స్వఛ్చమైన తన కీర్తిని భూమండలమంతా నెలకొల్పి, పరమానందంతో పరమపదాన్ని చేరుకున్నాడు పృథుచక్రవర్తి.             

పృథుచక్రవర్తి భార్య, పరమ పతివ్రత, అయిన అర్చి మహాదేవి భర్తతో పాటి సహగమనం చేయడానికి సిద్ధమైంది. మహానదిలో స్నానం చేసి భర్తకు ఉదక తర్పణాలు వదిలింది. ఆ తరువాత సహగమనం చేసింది. అలా సహగమనం చేస్తున్న అర్చి మహాదేవిని చూసి దేవతాస్త్రీలు పులకించిపోయారు. అప్సరకాంతలు నృత్యం చేశారు. అర్చి మహాదేవి మహిమను కొనియాడారు. దేవతాస్త్రీలు అలా కీర్తిస్తుండగా పృథువు పొందిన విష్ణులోకాన్ని సాటిలేని వైభవంతో ఆమె కూదా పొందింది.

పృథు మహారాజుకు, అర్చి మహాదేవికి జన్మించిన విజితాశ్వుడు పృథువు తరువాత రాజయ్యాడు. తండ్రి లాగానే కీర్తి ప్రతిష్తలు సంపాదించాడు. పృథుచక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించుకుని అంతర్థానమైనప్పుడు, విజితాశ్వుడు కూడా అంతర్థాన విద్యతోనే ఇంద్రుడిని వెంబడించి, యాగాశ్వాన్ని వెనక్కు తెచ్చాడు. అందువల్ల అతడికి అంతర్థానుడు అనే బిరుదు వచ్చింది. అశ్వాన్ని జయించాడు కాబట్టి విజితాశ్వుడు అన్నారు. రాజ్యాన్ని పాలిస్తున్న విజితాశ్వుడు స్థిరబుద్ధి, సమచిత్తం కలవాడని పేరు తెచ్చుకున్నాడు. తన తమ్ములకు నలుదిక్కులను పంచి ఇచ్చాడు. త్రేతాగ్నులకు మానవులుగా జన్మించమని వశిష్టుడి శాపం ఉన్నందున, విజితాశ్వుడి భార్య శిఖండిని ద్వారా త్రేతాగ్నులు జన్మించారు. అతడి రెండవ భార్య సభస్వతి ద్వారా హవిర్ధానుడు అనే కొడుకు కలిగి, రాజ్యాన్ని చక్కగా పాలించాడు.

విజితాశ్వుడు ఆత్మజ్ఞుడై, పరమాత్మను యజ్ఞంలో అర్చించి, యోగ సమాధి ద్వారా ముక్తిని పొందాడు. ఆయన పరలోకగతుడైన తరువాత, ఆయన కొడుకు హవిర్ధానుడు ఆరుగురు కొడుకులను కన్నాడు. అందులో ఒకడైన బర్హిష్మదుడు యజ్ఞదీక్షాశాలియై, భూతలమంతా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, ప్రజలచేత యోగసమాధి నిష్టుడు అనీ, ప్రజాపతి అనీ కీర్తించబడ్డాడు. ’ప్రాచీనబర్హి’ గా కూడా పేరుపొందాడు. సముద్రుడి కూతురైన శతధృతి అనే కన్యను మోహించి వివాహమాడాడు. వారి వివాహం వాస్తవానికి బ్రహ్మ ఆదేశానుసారం జరిగింది. ఆ దంపతులకు పదిమంది కొడుకులు కలిగారు. వాళ్లనే ప్రచేతసులు అని అంటారు. తండ్రి ఆజ్ఞానుసారం ప్రజాసృష్టిని కొనసాగించడానికి అడవికి బయల్దేరే సమయంలో రుద్రుడు సాక్షాత్కరించాడు వారికి. ఆయన ఆదేశానుసారం ప్రచేతసులు నారాయణుడిని పదివేల దివ్య సంవత్సరాలు పూజించారు.

పదివేల దివ్య సంవత్సరాలు నారాయణుడిని పూజించడానికి పూర్వరంగంలో, జ్ఞాన సంపన్నులైన ప్రచేతసులు, తండ్రి అజ్ఞానుసారం పడమటి దిక్కుగా వెళ్తున్న సమయంలో సముద్రం కంటే విస్తారమైన ఒక మనోహరమైన సరస్సును చూశారు. అందులో ఒక దివ్య పురుషుడిని చూశారు. అతడు సరోవరంలో నుండి వెలుపలికి వచ్చాడు. అతడే సాక్షాత్తు పరమ శివుడు. పరమేశ్వరుడి పాదపద్మాలకు నమస్కరించారు. హరుడు ప్రీతిచెంది, వాళ్ల మనస్సులో వున్న సంకల్పం తనకు తెలుసనీ, వారికి క్షేమం కలుగుగాక అనీ, వారిని అనుగ్రహించాలన్న బుద్ధితో దర్శనం ఇచ్చాననీ అన్నాడు. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు, తన కుమారులకు చెప్పిన శ్రీహరి స్తోత్రాన్ని వారికి తెలియచేస్తానని, మోక్షప్రదమై, మంగళకరమైన తన ఉపదేశాన్ని వినమని, ఆస్తోత్రాన్ని వివరంగా చెప్పాడు. యోగాదేశమనే ఆ స్తోత్రాన్ని మళ్లీ, మళ్లీ జపిస్తూ, సర్వేశ్వరుడిని కీర్తిస్తూ, ధ్యానశీలురై పూజించమని చెప్పాడు శివుడు ప్రచేతసులకు. ఈ స్తోత్రాన్ని భగవంతుడైన బ్రహ్మ సృష్టిని చేయగోరి కొడుకులైన తమకు, భృగువు మొదలైన మునీంద్రులకు ఉపదేశించాడని, తాము దాని మహిమతో సృష్టి చేయగలిగామని కూడా చెప్పాడు. రుద్రుడు ఉపదేశించిన విష్ణు స్తోత్రాన్ని జపిస్తూ, పదివేల సంవత్సరాలు భయంకరమైన తీవ్ర తపస్సు చేశారు ప్రచేతసులు.  

అప్పుడు పద్మనాభుడు ప్రత్యక్షమయ్యాడు వారికి. వాళ్ల శరీరాలను స్పృశించాడు. వారు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారనీ, రుద్రుడు గానం చేసిన తన స్తోత్రాన్ని నిత్యం పఠించమనీ అన్నాడు. వారికి పరబ్రహ్మ లక్షణాలతో కుమారుడు కలుగుతాడని చెప్పాడు. కండు మహామునికి, ప్రమ్లోచ అనే అప్సరసకు పుట్టిన మారిష అనే కన్యను తండ్రి ప్రాచీనబర్హి ఆజ్ఞతో పెళ్లి చేసుకోమని చెప్పాడు. వారంతా వెయ్యి సంవత్సరాలు తన మీద భక్తితో భూలోక సుఖాలు అనుభవించి, తన స్థానాన్ని చేరుకుంటారని అన్నాడు. అలా చెప్పిన శ్రీహరికి ప్రచేతసులు నమస్కరించి స్తుతించారు. ఆయన వారు చూస్తుండగా వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఆ తరువాత బ్రహ్మ అజ్ఞానుసారం ప్రచేతసులు విధివిధానంగా మారిషను పెళ్లి చేసుకున్నారు. దక్షుడు దైవప్రేరితుడై, మారిష కడుపున, ప్రచేతసులకు పుత్రుడై జన్మించాడు. బ్రహ్మ ద్వారా ప్రజాసృష్టిని చేయడానికి నియమించబడ్దాడు.

ప్రచేతసులు భార్యను కొడుకు దగ్గర వుంచి, జాబాలి ముని ఆశ్రమానికి ఆత్మవిచారాన్ని చేయడానికి వెళ్లారు. అక్కడికి నారదుడు వచ్చాడు. ఈశ్వరుడు ఉపదేశించిన ఆత్మతత్త్వాన్ని ప్రసాదించమని ఆయన్ను కోరారు. ఆయన వారు కోరిన విధంగానే పద్మనాభుడి సచ్చరితాన్ని వినిపించి, బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. ప్రచేతసులు శ్రీమహావిష్ణువు సత్కీర్తిని భక్తితో పొగిడి శాశ్వతమైన శ్రీహరి పదాన్ని పొందారు.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment