Wednesday, August 12, 2020

బొంబాయికి తిలక్ బై బై ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 బొంబాయికి తిలక్ బై బై

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(డిసెంబర్ 24-30, 2000)

         ముద్దుబిడ్డ హిందీవర్షన్ ఛోటీబహు నిర్మాణ కార్యక్రమం కొనసాగుతుండగానే ఈడూ-జోడూ సినిమాను కూడా హిందీలో ‘కంగన్’ పేరుతో తీయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. చోటీబహు తీయడం అయిం తర్వాత దాని జోలికి పోవచ్చుననుకున్నారు. తిలక్, దాని నిర్మాత బిసి శంకర్. అయితే ఛోటీబహు ప్రొడక్షన్ మేనేజర్ ఎమ్ బి రాజు, మనోజ్ కుమార్ సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్న జగదీశశర్మ, ఇతర ఫైనాన్షియర్స్, అందరూకల్సి తిలక్ భావమరిది వీరభద్రరావును భాగస్వామిగా చేసుకుని కంగన్ నిర్మాణానికి పథకం వేశారు తిలక్ అనుమతితో.

         ఆదేరోజుల్లో బొంబాయి నగరంలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడుగా చేరారు. ఎక్కువగా,  తీరిక సమయాల్లో ప్రత్యేకంగా క్లబ్ లోనే గడిపేవాడు. క్లబ్ చుట్టుప్రక్కలనే, రేస్ కోర్స్ ఉండేది. సరే, రేసులంటే సరదాపడే తిలక్, ప్రొదున్నే వాకింగ్ చేస్తూ అటువైపుగా కాళ్లుమల్లించేవారు. ప్రధానమైన రేసులు జరుగుతుండేటప్పుడు గోగినేని చినవెంకటేశ్వర రావుగారు వచ్చేవారు. ఓసారి ఇన్విటేషన్ కప్ ను గోగినేని గారి గుఱ్ఱం గెలిచింది. అప్పుడాయన గెల్చుకున్న కప్పుతో సహా తిలక్ గారింటికి వచ్చి (ఆయనున్నరూమ్ కు), కప్పులో 'బీరు’ పోసుకుని, త్రాగి మరీ వెళ్లారట.  రేసుల సంబంధంతోనే ఓ సారి గోగీనేనితో, తన కలకత్తా రెండో పర్యటన చేసారు తిలక్ ఓ పర్యాయం.

         ఈడూ జోడు హిందీ వర్షన్ కంగన్ లో సంజీవ్ కుమార్, మాలాసిన్హా, అశోక్ కుమార్, మెహమూద్, జీవన్, తదితరులు నటించారు. కంగన్ కూడా ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే షూటింగ్ చేసారు. నటీనటులను, ఇతర కళాకారులను - మాలాసిన్హా, సంజీవ్ కుమార్‌ లతో సహా కార్లల్లో ఎక్కించుకుని, ఓ కాన్వాయ్ లాగా, ఎత్తిపోతల ప్రాంతానికి, భువనగిరికి, కొలనుపాకకు వెళ్లారు తిలక్. సాంగ్స్ చిత్రీకరించారక్కడ. ఎప్పుడూ 'జనం' తోనే వుండటం తిలక్ కు ఓ సరదా.

         షూటింగ్ హైదరాబాద్లో చేస్తున్నప్పుడు నిజాంక్లబ్ లో ఎప్పుడూ రెండు గెస్ట్ రూంలుంచుకునేవారు తిలక్. ఒకటి ఆఫీసుకొరకు, మరోటి తనకొరకు. నిజాం కాలేజీలో, ఇప్పుడు పెద్ద పదవుల్లో వున్న, అప్పుడు చదువుతున్న, 30-40 మంది విద్యార్థులను తన కంగన్ సినిమాలో ఓ సీన్లో షూటింగ్ కొరకు శిక్షణ ఇప్పించారు. తెలుగులో ‘పంచర్ పంచర్’ అన్న పాటకు చలం- మణిమాల బృందంతో తీసినట్లే మహమూద్ పై హిందీలో ‘సబ్ నే ఆవో ఆవో’ అనే పాటను చిత్రీకరించారు. మహమూదుకు సపోర్ట్ గా వున్న విద్యార్థి బృందమే నిజాం కాలేజీ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ అందరికీ, వికాసం ప్రొడక్షన్స్ తరపున ఓ సర్టిఫికెట్, కాసు (8-10 గ్రాములు) బంగారం ఇప్పించారు ఉంగరం లాగా, తిలక్.

         ఈడూ జోడూ, కంగన్ తీస్తున్నప్పుడే, ఓసారి తిలక్ గారి జన్మదినం వచ్చింది. జనవరి 14 ఆయన బర్త్ డే. ఒకప్పుడు శ్రీ అట్లూరి సుబ్బారావు గారి దీప్తి గెస్ట్ హౌస్ ఇంటి ప్రక్కనే, రాజ్ భవన్ (సోమాజిగూడా, హైదరాబాద్) రోడ్డులో, ఉజాగర్ సింగ్ అనే ఆయన కొత్తగా ఇల్లు కొనుక్కున్నారప్పట్లో. దాని గృహ ప్రవేశం సందర్భంగా ఓ పెద్ద విందు నిర్వహించారాయన. ఆ రోజు అనుకోకుండా తిలక్ బర్త్ డే. జబర్దస్తీ పార్టీ నిర్వహించారు ఉజార్ సింగ్ రెండు కలిసొచ్చేలాగా. సంజీవ్ కుమార్, ఈలపాటి రమురామయ్యలు కూడా వచ్చారా పార్టీకి. జల్పాగా త్రాగిన తర్వాత కూడా షూటింగ్ జరిగింది. మర్నాడు మళ్లీ యధాప్రకారం కాన్వాయ్ తో వెళ్లి షూటింగ్ చేసేవారు. మాలాసిన్హాతో పాటు షూటింగుకు ఆమె తండ్రి కూడా వచ్చేవారు.

         ఓ సారి షర్మిలా టాగూర్ తో (ఛోటీబహు) షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా, తిలక్ బర్త్ డే వచ్చింది. గ్లాసులో ‘మందు’ వేసుకుని షూటింగ్ చేయిస్తూ తాగుతుంటే, పర్మిల చూసి, ‘అయ్యా మీ బర్త్ డే నాడు ఎందుకు పెట్టారు. నేను డేట్స్ మార్చుకునేదాన్ని కదా!' అని నొచ్చుకుందట ఆమె. అయితే ఇంటికెళ్లి 'బాటిల్’ పంపింది బర్త్ డే గిఫ్ట్ గా.

         హిందీ ఫీల్డ్ లో చాలామందితో పరిచయాలయ్యయి. ఓ సారి ఖైఫీ ఆజ్మీ, తాను పాకిస్తాన్ ఇడియా యుద్దం సందర్భంగా, ఆజాద్ మైదానం (బొంబాయి)లో పాడిన పద్యాన్ని చదివి వినిపించాడు. శ్రీకృష్ణరాయబారంలో శ్రీకృష్ణుడు, రాయబారం సందర్భంగా చదివిన పద్యాల స్టైల్లో వున్నాయట అవి. బాంబేలో వున్న రోజుల్లో ఓ పర్యాయం అజ్ఞాత వాసంలో పున్న తమ్ముడు  నరసింహారావు వచ్చికల్సి వెళ్లాడు తిలక్ ను.


         బొంబాయిలోనే పద్మనాభయ్య గారనే మహారాష్ట్ర క్యాడర్ ఐఎఎస్ అధికారితో  పరిచయం స్నేహం అయ్యింది తిలక్ కు.  తరువాత ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పదవిని నిర్వహిమ్చారు. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. తెలుగాయన. లోగడ హోమ్ సెక్రటరీగా కూడా పనిచేశారు కొంతకాలం. ఆ రోజుల్లో జరిగిన మరో ఆసక్తికరమైన సంఘటన్ను గుర్తు చేసుకున్నారు తిలక్. ఒక ఐఆర్ఎస్ ప్రాబెషన్ ఆఫీసర్ రేసుకోర్సులో పరిచయమయ్యాడు తిలక్ కు. పిఎమ్ రుంగ్తా అనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో అప్పటి కేంద్రన్యాయ శాఖ మంత్రి శ్రీ ఎకెసేన్ వున్నప్పుడు, ఈ ప్రాబేషనర్, ఆయన సమక్షంలో రుంగ్తా ఇంటిపై దాడి చేయించాడు ఓ కేసు విషయంలో. ఈ విషయాన్ని ‘భయ్యా’ అనే రుంగ్తా స్నేహితుడు తిలకు తెలియచేసాడు. ‘నేను లా మినిస్టర్ ను ఇక్కడకు రావద్దు' అని సేన్ వార్నింగ్ ఇచ్చాడట. మొదలు ఒప్పుకొని ఆ ప్రాబెషనర్ తర్వాత కుదుటపడాల్సి వచ్చింది. తిలక్ కూడా ఎన్నో ఉదాహరణలు చెప్పి, దుడుకుతనం మానుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు ఆ కుర్ర అధికారికి.  ముందు అధికారంలో నిలదొక్కుకోమని కూడా సూచించాడు.

         కంగన్ తీస్తున్న రోజుల్లో అశోక్ కుమార్ ఎక్కువ సమయాన్ని తిలక్ గారి గదిలో గడిపేవాడు. తిలక్ కొడుకుతో సరదాగా ఉండేవాడు. చోటీబహు. కంగన్ సినిమాలను విజయవంతంగా (బాక్సాఫీస్ కాకపోవచ్చు) తీసిన తిలక్ కు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించమని ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. ఏదీ ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే అయన తిలక్ ఎలా అవుతాడు? 

బాంబే నగరానికి గుడ్ బై చెప్పి హైదరాబాద్ కు చేరుకున్నారు మరో మజిలీకి.

 (మరిన్ని విశేషాలు మరోసారి)

 

 

 

 

No comments:

Post a Comment